తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పేపర్ లీక్ వ్యవహారంలో అరెస్టుల పర్యం కొనసాగుతోంది. ఈ కేసులో తాజాగా సిట్ అధికారులు మరో 19 మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న పోల రమేష్ నుంచి ప్రశ్న పత్రం కొనుగోలు చేసిన వారిని సిట్ అరెస్టు చేసింది. పరీక్షలో హైటెక్ పద్ధతిలో మాస్ కాపీయింగ్ చేయించి అరెస్టు అయిన పోల రమేష్‌కు నిందితులతో ఉన్న సంబంధాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. అసిస్టెంట్ ఇంజనీర్ పేపర్‌ను 30 మందికి విక్రయించినట్లు గుర్తించిన సిట్ అధికారులు.. పోల రమేష్ ఇచ్చిన సమాచారంతోనే తాజాగా మరో 19 మందిని అరెస్టు చేశారు. దీంతో ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు అరెస్టు చేసిన వారి సంఖ్య 74కు చేరినట్లయింది.


పేపర్ లీక్ కేసులో 16వ ర్యాంకర్ అరెస్ట్, రూ.30 లక్షలకు డీల్..
తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. సిట్ మరో నిందితుడ్ని అరెస్ట్ చేసింది.  అరెస్టుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది.  ఈ కేసు దర్యాప్తులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) వేగం పెంచడంతో నిందితులు ఒక్కరూ ఒక్కరుగా బయటపడుతున్నారు. తాజాగా ఈ కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. ఈఈ పరీక్ష రాసి 16వ ర్యాంకు సాధించిన ఎం నాగరాజును  అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రూ.30 లక్షలు ఇచ్చేందుకు రమేష్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు ఎం నాగరాజు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురానికి చెందిన ఎం నాగరాజు ఏఈ పరీక్ష పత్రాన్ని రమేష్ నుంచి కొనుగోలు చేశాడు. విచారణలో భాగంగా తేలడంతో సిట్ అధికారులు నాగరాజును అరెస్ట్ చేశారు. 


అభ్యర్థులకు అలర్ట్, దరఖాస్తుల సవరణకు అవకాశం! 
తెలంగాణలో గ్రూప్‌-2 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ కీలక సూచన చేసింది. దరఖాస్తుల సమయంలో నమోదుచేసిన వివరాలల్లో తప్పులుంటే ఎడిట్‌ చేసుకొనేందుకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు జులై 8 నుంచి 12 వరకు వెబ్‌సైట్‌ ఎడిట్‌ ఆప్షన్‌ అందుబాటులో ఉంటుందని కమిషన్ జులై 6న ఒక ప్రకటనలో తెలిపింది. తెలంగాణలో మొత్తం 783 గ్రూప్-2 పోస్టులకు 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ లెక్కన ఒక్కో పోస్టుకు సగటున 705 మంది పోటీ పడనున్నారు. ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా మున్సిపల్ కమిషనర్, ఏసీటీవో, తహసిల్దార్, సబ్-రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, మండల పంచాయతీ అధికారి, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.   


వెబ్‌సైట్‌లో వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్ పరీక్ష హాల్‌టికెట్లు, పరీక్ష ఎప్పుడంటే? 
తెలంగాణలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్ష హాల్‌టికెట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష సమయానికి 45 నిమిషాల ముందు వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 13, 14 తేదీల్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహించనున్నారు.  జులై 13న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష నిర్వహించనున్నారు.


వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ రాతపరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


మాక్ టెస్ట్ కోసం క్లిక్ చేయండి.. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial