తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల తర్వాత భారీగా ఖాళీలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఉన్నవాటితో పాటు ఆ తర్వాత ఏర్పడే ఖాళీలను కలుపుకుని మొత్తం 23 వేల టీచర్‌ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి.  వివిధ శాఖల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎస్‌జీటీలు, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 13 వేల వరకు భర్తీ చేయాల్సి ఉందని ప్రకటించింది. అయితే ఇతర శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చినా.. టీచర్ పోస్టులకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ట్రాన్స్‌ఫర్లు, ప్రమోషన్లు తరువాత ఎన్ని ఖాళీలు తేలుతాయో పరిశీలించి.. ఆ తరువాత నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. 


ఇటీవల మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, హరీష్ రావు, ఉన్నత అధికారులతో టీటీజేఏసీ నాయకులు సమావేశం అయ్యారు. పదోన్నతులకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు షెడ్యూల్ విడుదలకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో 9,266 మందికి ప్రమోషన్స్ ఇవ్వబోతున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. దీంతో రాష్ట్రంలో 10 వేల ఖాళీలు ఏర్పడబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో 9 వేల ఎస్‌జీటీ పోస్టులు, మరో వెయి వరకు స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉండే అవకాశం ఉందని ఉపాధ్యాయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే 13 వేల పోస్టులు ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వం చెప్పగా.. పదోన్నతుల తరువాత 10 వేల పోస్టులు ఖాళీగా కానున్నాయి. దీంతో మొత్తం 23 వేల పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఒకేసారి మెగా మేళా నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తోందని చెబుతున్నారు. ఈ పోస్టులు మొత్తం డీఎస్సీ ద్వారానే భర్తీ చేయనున్నారు. బదిలీలు, ప్రమోషన్ల తరువాత నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. 


రెండ్రోజుల్లో టీచర్ల బదిలీల షెడ్యూల్, వారం తర్వాత దరఖాస్తులు


ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ రెండ్రోజుల్లోగా విడుదల కానుంది. అయితే దరఖాస్తుల ప్రక్రియ మాత్రం వారం తర్వాత షురూ కానుందని సమాచారం. మొదట షెడ్యూల్‌ను విడుదల చేసి ఆ తర్వాత దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు విడుదల చేసే అవకాశం ఉంది. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను తీసుకొని విధివిధానాలపై కసరత్తు చేస్తున్నారు అధికారులు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను 32 నుంచి 35రోజుల వరకు పూర్తి చేసేలా షెడ్యూల్‌ను రూపొందిస్తున్నారు.


ఉపాధ్యాయుల సంఘాల నేతలతో విద్యాశాఖ అధికారులు బుధవారం (జనవరి 18న) ఎస్‌సీఈఆర్‌టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు కేసుల కారణంతో భాషా పండితులకు ఇప్పుడు బదిలీలను చేపట్టమని అధికారులు చెప్పడం తగదని, వారికి కూడా బదిలీలు, ప్రమోషన్లు కల్పించాలని కోరారు. 317 జీవోతో నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయడంతోపాటు 13 జిల్లాల స్పౌజ్‌ బదిలీలను షెడ్యూల్‌ విడుదలకు ముందే పూర్తి చేయాలని ఉపాధ్యాయ జేఏసీ డిమాండ్‌ చేసింది. ఉపాధ్యాయులందరికీ బదిలీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని అధికారులకు యుఎస్‌పీసీ నేతలు కోరారు. 


అలాగే బదిలీలకు కటాఫ్‌ తేదీ డిసెంబర్‌ 31 లేదా జనవరి 31గా నిర్ణయించాలని కోరారు. బదిలీలు, పదోన్నతుల సీనియారిటీ లిస్టులు లోపాలు లేకుండా తయారు చేయించాలన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు 1975 ప్రకారం పదోన్నతులు, బదిలీలు చేపడితే ఎటువంటి న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం లేదని లోకల్‌ కేడర్‌ జీటీఏ సంఘం నేతలు అధికారులకు విన్నవించారు. బదిలీలకు కనీస సర్వీసును రెండు సంవత్సరాల నుంచి జీరో సర్వీసుకు తగ్గించాలని జాక్టో నేతలు కోరారు. మూడు సంవత్సరాల సర్వీసు ఉన్న వారికి బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని టీచర్‌ సంఘాల నేతలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...