TG DSC Answer Key Objections: తెలంగాణలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన తుది ఆన్సర్ కీని పాఠశాల విద్యాశాఖ సెప్టెంబరు 6న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఫైనల్ కీపైనా అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఆన్సర్ కీపై తప్పులకు సంబంధించి.. అభ్యర్థులు పాఠ్యపుస్తకాలు, తెలుగు అకాడమీ పుస్తకాలను తీసుకుని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు, ఎస్‌సీఈఆర్‌టీ కార్యాలయ అధికారులను సంప్రదిస్తున్నారు. ప్రాథమిక కీలో సరిగ్గా ఉన్న సమాధానాలను తుది కీలో మార్చారని పలువురు అభ్యర్థులు చెబుతున్నారు. విద్యాశాఖ ముద్రించిన పాఠ్యపుస్తకాల్లోని జవాబులను తాము గుర్తించినా తుది కీలో వాటిని తప్పుగా చూపారని పాఠశాల విద్యాశాఖ అదనపు సంచాలకుడు కె.లింగయ్య, ఎస్‌సీఈఆర్‌టీలో టెట్ ప్రత్యేకాధికారి రేవతీరెడ్డికి సెప్టెంబరు 9న విన్నవించారు. 


రాష్ట్రంలో మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల కోసం 2.45 లక్షల మంది అభ్యర్థులు పోటీపడ్డారు. సెప్టెంబరు 6న రాత్రి డీఎస్సీ తుది  కీని విద్యాశాఖ వెల్లడించింది. ప్రాథమిక, తుది కీల మధ్య 109 ప్రశ్నల జవాబులను మార్చింది. మరో 59 ప్రశ్నలకు అర మార్కు చొప్పున కలిపింది. తుది కీని వెల్లడించిన తర్వాత రెండు రోజులు సెలవులు కావడంతో సెప్టెంబరు 9న సంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ తదితర జిల్లాల నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి వచ్చారు. 


అప్పుడు 'ఏకాదేశం'.. ఇప్పడు 'ఆదేశం'
ఆన్సర్ కీలో తప్పుల సరళిని ఒకసారి పరిశీలిస్తే.. గత టెట్‌లో తెలుగులో 'ఏకాదేశం' అనగా అని ఒక ప్రశ్న ఇచ్చారు. దానికి ఒక వర్ణం స్థానంలో మరో వర్ణం రావడం అనేది సరైన జవాబు. అయితే జూన్ 12న వెలువడిన ఫలితాల్లో దానికి మార్కు ఇచ్చారు. ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో మాత్రం ఆ ప్రశ్నను తిప్పి అడిగారు. ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడాన్ని ఇలా అంటారని 4 ఆప్షన్లు ఇచ్చారు. వాటిలో 'ఆదేశం' సరైన జవాబు అని విద్యాశాఖ తెలిపింది. అయితే తెలుగు అకాడమీ పుస్తకాల్లో ఉన్నట్లుగానే తాము 'ఏకాదేశం' అని గుర్తించామని, మార్కులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా పలు ప్రశ్నలపై అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అభ్యర్థుల అభ్యంతరాలపై నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకుంటుందని అధికారులు అంటున్నారు. తుది ఆన్సర్ కీపై అభ్యంతరాలు రావడంతో డీఎస్సీ, టెట్ మార్కులను కలిపి ఇచ్చే జనరల్ ర్యాంకు జాబితా(జీఆర్‌ఎల్) వెల్లడిపై ప్రభావం పడే అవకాశం ఉంది. వారం రోజుల్లో రావాల్సిన ఫలితాలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. డీఎస్సీ 80 మార్కులకు, టెట్‌ 20 మార్కులను కలిపి జిల్లాల వారీగా జనరల్‌ ర్యాంకు లిస్టును విడుదల చేయనున్నారు. ఆ తర్వాత రిజర్వేషన్ల ప్రకారం 1:3 నిష్పత్తిలో మెరిట్‌ జాబితాను ప్రకటించనున్నారు. వీరికి సంబంధిత డీఈఓలు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. అనంతరం మెరిట్‌ ఉన్న అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు.


తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 29న 'డీఎస్సీ-2024' నోటిఫికేషన్‌ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి మార్చి 4 నుంచి జూన్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం ఖాళీల్లో సెకండరీ గ్రేడ్ టీచర్-6,508 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్-2,629 పోస్టులు,  లాంగ్వేజ్ పండిట్-727, పీఈటీలు-182 పోస్టులు, ప్రత్యేక కేటగిరీ విభాగంలో స్కూల్ అసిస్టెంట్లు 220 పోస్టులు, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి. ఇక జిల్లావారీగా ఖాళీల వివరాలు పరిశీలిస్తే.. రాష్ట్రంలో అత్యధిక ఖాళీలు హైదరాబాద్‌లో 878 ఉండగా.. ఆ తర్వాత నల్గొండ జిల్లాలో 605, నిజామాబాద్‌లో 601, ఖమ్మం 757, సంగారెడ్డి 551, కామారెడ్డి 506 చొప్పున ఖాళీలను భర్తీ చేయనున్నారు. అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో 93 ఖాళీలను భర్తీ చేయనన్నారు. ఆ తర్వాత స్థానాల్లో రాజన్న సిరిసిల్ల (151), వనపర్తి (152) ఉన్నాయి.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..