Young Professionals Scheme UK:యూకేలో వర్క్ వీసా కోసం ఎదురు చూస్తున్న వారు ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ ద్వారా వెళ్లే వీలు ఉంది. దీని కోసం దరఖాస్తు విండో ఇప్పటికే ఓపెన్ చేసింది. మరో రెండు రోజుల్లో ఈ గడువు ముగుస్తుంది. ఈ స్కీమ్ ద్వారా  మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి వీలు లేదు. ఈ పథకం ద్వారా దరఖాస్తు చేసుకోవాలంటే మాత్రం కఠినమైన రూల్స్‌ ఫ్రేమ్ చేశారు. వాటిని ఫుల్‌ఫిల్ చేయగలిగితేనే మీ దరఖాస్తు ఫైనల్‌ దశ వెళ్తుంది. 

18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయ పౌరులకు మాత్రమే ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ వీసా పొందిన వారికి రెండేళ వరకు యునైటెడ్ కింగ్‌డమ్‌లో నివసించడానికి, పని చేయడానికి అనుమతి లభిస్తుంది. ఈ పథకంలో అప్లై చేసుకుంటే ప్రత్యేక వర్క్ వీసా కోసం ఉచిత ఆన్‌లైన్ బ్యాలెట్‌లో ప్రవేశించే వీలు కలుగుతుంది. ఈ అవకాశం రెండు రోజుల్లో ముగియనుంది. అంటే 24 జులై 2025న మధ్యాహ్నం 1:30 కు ముగుస్తుంది. ఈ ఏడాదికి సంబంధించి చివరి బ్యాలెట్‌. ఇప్పటికే ఫిబ్రవరిలో ఒక బ్యాలెట్‌లో వర్క్‌వీసాలు కేటాయించారు. ఇప్పుడు 3000 మందికి వర్క్‌ వీసాలు ఇచ్చేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు.  

ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ అనేది భారత్‌, యూకే మధ్య జరిగిన యూత్‌ మొబిలిటీ అగ్రిమెంట్‌లో ఒకటి. భారతీయ యువకులకు అంతర్జాతీయ పని అనుభవం కల్పించేందుకు ఈ ఒప్పందం చేసుకున్నారు. వర్క్‌ వీసా కల్పించి అక్కడ కంపెనీల్లో రెండేళ్లు పని చేసి అనుభవం కల్పించనున్నారు. ఇది వారి కెరీర్ గ్రోత్‌కు ఉపయోగపడటమే కాకుండా తిరిగి ఇండియాకు వచ్చి ఇక్కడ స్టార్టప్‌లు పెట్టుకోవడానికో లేదా కంపెనీల్లో ఉన్నత స్థాయిలో పని చేయడానికో యూజ్ అవుతుంది. అందుకే దరఖాస్తులను చాలా జాగ్రత్తగా పరిశీలించి వర్క్‌వీసాలను కల్పించనున్నారు. దీని కోసం కఠినమైన రూల్స్‌ను ఫ్రేమ్ చేశారు. ఇరు ప్రభుత్వాలు కలిపి రూపొందించిన రూల్స్‌ ప్రకారం అర్హత ఉన్నవారికి మాత్రమే వర్క్‌ విసా లభిస్తుంది. బ్యాలెట్‌లోకి ప్రవేశించడానికి మాత్రమే ఉచితం మిగతా ప్రక్రియ పూర్తి అవ్వడానికి మాత్రం నార్మల్‌వీసా మాదిరిగానే రూల్స్‌అండ్ రెగ్యులేషన్స్‌ ఉంటాయి. ఎంపికైన తర్వాత వీసా దరఖాస్తు ఫీజు, ఇతర ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ వీసా పొందాలంటే అర్హతలు ఏంటీ?యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ ద్వారా పొందే వీసాకు చాలా డిమాండ్ ఉంది. అందుకే వీటి కోసం కఠినమైన రూల్స్‌ను రూపొందించారు. నిర్దిష్ట షరతులకు అనుగుణంగా ఉన్న అభ్యర్థులను మాత్రమే బ్యాలెట్‌లో చేరుస్తారు. అలాంటివారికి ఈ కింది అర్హతలు ఉండాలి.  

భారతీయ పౌరులై ఉండాలి:- ఈ స్కీమ్‌ ద్వారా వీసా కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లు కచ్చితంగా భారతీయ పౌరులై ఉండాలి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా భారతదేశ పౌరుల కోసం మాత్రమే ఈ పథకం ప్రత్యేకంగా రూపొందించారు. 

వయోపరిమితి :- దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి. అలాగనే 30 ఏళ్లకు మించి ఉండకూడదు. అంటే 18-30 ఏళ్ల మధ్య వయసు కలిగిన వ్యక్తులు మాత్రమే ఈ వర్కింగ్ వీసా పొందేందుకు అర్హులు అన్నమాట.  

విద్యార్హతలు:- యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ ద్వారా వర్కింగ్ వీసా పొందాలంటే డిగ్రీ చేసి ఉండాలి. అది కూడా RQF (రెగ్యులేటెడ్ క్వాలిఫికేషన్స్ ఫ్రేమ్‌వర్క్) స్థాయిలు కలిగి ఉండాలి.  6, 7, లేదా 8కి ఇలా అన్ని తరగతులు పూర్తి చేసి డిగ్రీ చేసిన వాళ్లే ఈ వీసాకు అర్హులు. ఇలాంటి విద్యను కలిగి ఉంటేనే యూకేలో పని చేయడానికి అర్హులుగా గుర్తిస్తారు.  

ఇలా వివిధ అర్హతలు ఉన్న వారికి బ్యాలెట్‌లో వెరిఫికేషన్ పూర్తి చేస్తారు. అన్ని సక్రమంగా ఉన్నట్టు అయితే వారికి రెండు వారాల్లోనే మెయిల్ వస్తుంది. అధికారికంగా మీరు ఇచ్చిన మెయిల్‌కు సమాచారం ఇస్తారు. దాని ఆధారంగానే వీసా కోసం అధికారికంగా దరఖాస్తు చేసుకోవచ్చు.  మీకు ఈ మెయిల్ వచ్చిన 90రోజుల్లోనే విసా వచ్చేలా చూస్తారు.