రాష్ట్రంలో ఇటీవలి కాలంలో వరసపెట్టి నోటిఫికేషన్లు విడుదల చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు పరీక్షల తేదీల రూపంలో పెద్ద చిక్కొచ్చిపడింది. ఉద్యోగ నియామక పరీక్షల తేదీలకు సంబంధించి తర్జనభర్జన పడుతోంది. టీఎస్‌పీఎస్సీకే పెద్ద పరీక్షగా మారింది. ఈ ఏడాది డిసెంబరు వరకు వివిధ పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షలు, ఉద్యోగ పరీక్షలతో శని, ఆదివారాలు బిజీగా ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. 



టీఎస్‌పీఎస్సీ ప్రాథమికంగా ఖరారు చేసిన పరీక్షల తేదీల్లోనే కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల పరీక్షలు, ఇతర ప్రవేశ పరీక్షలు, స్టాఫ్‌సెలక్షన్ కమిషన్ పరీక్షలు, యూపీఎస్సీ పరీక్షల తేదీలు కూడా ఖరారయ్యాయి. దీంతో రాష్ట్రంలోని అభ్యర్థులు ఆయా ఉద్యోగాలకు సంబంధించిన అన్ని పోటీ పరీక్షలకు హాజరయ్యేందుకు టీఎస్‌పీఎస్సీ కసరత్తు చేస్తోంది. దీంతో టీఎస్‌పీఎస్సీ పరీక్షల నిర్వహణకు తేదీలు అందుబాటులో ఉండటంలేదు. 



ఇప్పటికే గ్రూప్-4 పరీక్ష తేదీని టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే గ్రూప్-4 పరీక్ష తేదీ ఖరారుకు రెండు వారాలకు పైగా కమిషన్ వర్గాలు కసరత్తు చేయాల్సి వచ్చినట్లు తెలిసింది. మరోవైపు పరీక్ష కేంద్రాల ఏర్పాటు కూడా కమిషన్‌కు తలపోటుగా మారింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఈ పరీక్షలు నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల గుర్తింపు, తేదీల ఖరారుకు శ్రమించాల్సి వస్తోంది.



వాయిదా వేస్తే తదుపరి తేదీ కష్టమే..
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సాధారణంగా శని, ఆదివారాల్లోనే నియామక పరీక్షలు నిర్వహిస్తూ ఉంటుంది. వారాంతాల్లో విద్యాసంస్థలకు సెలవు కావడంతో ఆ రోజుల్లోనే పోటీ పరీక్షలు నిర్వహిస్తూ వస్తోంది. మార్చి, ఏప్రిల్‌లో ఇంటర్, పదోతరగతి పరీక్షల నేపథ్యంలో పరీక్ష కేంద్రాల ఏర్పాటు టీఎస్‌పీఎస్సీకి సవాలుగా మారింది. ఇక మేలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూలు ఇప్పటికే ఖరారైంది. మరోవైపు గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించాలని భావించినప్పటికీ.. ఇతర పరీక్షలతో తేదీలు అందుబాటులో లేక జూన్ మొదటి వారంలో గ్రూప్-1 మెయిన్స్ నిర్వహించనున్నట్లు కమిషన్ ఇప్పటికే ప్రకటించింది.



మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని కమిషన్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఒకసారి పరీక్ష వాయిదా పడితే మరో తేదీ సమీపంలో అందుబాటులో లేదని, ఒక్కోసారి నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తుందని, తద్వారా సీరియస్‌గా ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు నష్టం జరుగుతుందని కమిషన్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రూప్-2, 3 పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలన్న విషయమై ఇప్పటికే ప్రాథమికంగా సమావేశాలు పెట్టినా, తేదీని ఖరారు చేయలేకపోయింది.


డిసెంబరు వరకు వారంతాల్లో వివిధ పరీక్షల షెడ్యూలు ఇలా..


మార్చి నెలలో: 15 నుంచి ఇంటర్, టీఎస్‌పీఎస్సీ పోటీ పరీక్షలు


ఏప్రిల్ నెలలో: 3 నుంచి పది పరీక్షలు, టీఎస్;పీఎస్సీ పోటీ పరీక్షలు


మే నెలలో: తెలంగాణలో వివిధ కోర్సుల సెట్ పరీక్షలు, సివిల్స్ ప్రిలిమ్స్


జూన్ నెలలో: జేఈఈ అడ్వాన్స్‌డ్, గ్రూప్-1 మెయిన్స్, యూజీసీనెట్, ఐఈఎస్, జియోసైంటిస్ట్, ఇంజినీరింగ్ సర్వీసెస్ మెయిన్స్, సీఏ ఇంటర్ పరీక్షలు


జులై నెలలో: గ్రూప్-4, యూపీఎస్సీ, కంబైన్డ్ మెడికల్ పరీక్షలు


ఆగస్టు నెలలో: సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్, ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ ఆఫీసర్, ఆఫీసు అసిస్టెంట్, ఐబీపీఎస్ క్లర్క్


సెప్టెంబరు నెలలో: ఐబీపీఎస్ క్లర్క్స్, ఎన్‌డీఏ, సీడీఎస్, ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ, సివిల్స్ మెయిన్స్, ఐబీపీఎస్ ప్రొబేషనరీ పోస్టులకు పరీక్షలు


అక్టోబరు నెలలో: ఐబీపీఎస్, యూపీఎస్సీ పరీక్షలు.


నవంబరు నెలలో: ఐబీపీఎస్ పరీక్షలు, ఐఎఫ్‌ఎస్ మెయిన్స్.


డిసెంబరు నెలలో: మిలిటరీ కాలేజ్ ప్రవేశ పరీక్ష, యూపీఎస్సీ పరీక్షలు, ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పరీక్షలు


Also Read:


తెలంగాణలోని కేంద్రీయ మైనార్టీ పాఠశాలల్లో 1308 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు - అర్హతలివే?
కేంద్ర మైనార్టీ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలోని సీబీఎస్‌ఈ మైనార్టీ పాఠశాలల్లో ఖాళీల భర్తీకి 'మహర్షి వేదవ్యాస్ ఔట్‌సోర్సింగ్ టీచర్స్ రిక్రూట్‌‌మెంట్' నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా తెలంగాణలోని 109 పాఠశాలల్లో 1308  టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఔట్‌సోర్సింగ్ విధానంలో ఈ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఏపీలోని కేంద్రీయ మైనార్టీ పాఠశాలల్లో 1428 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు - అర్హతలివే?
కేంద్ర మైనార్టీ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలోని సీబీఎస్‌ఈ మైనార్టీ పాఠశాలల్లో ఖాళీల భర్తీకి 'మహర్షి వేదవ్యాస్ ఔట్‌సోర్సింగ్ టీచర్స్ రిక్రూట్‌‌మెంట్' నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఏపీలోని 119 పాఠశాలల్లో 1428  టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఔట్‌సోర్సింగ్ విధానంలో ఈ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...