APPSC Group2 Exam: ఏపీలో ఒకేరోజు గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష, ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్ పరీక్షలు ఒకే రోజు నిర్వహిస్తుండటంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే వీరికి స్టేట్‌బ్యాంక్ ఇండియా శుభవార్త తెలిపింది.ఈ రెండు పరీక్షలు ఒకేరోజు వుండటంతో పరీక్ష తేదీ మార్చాలంటూ ఏపీపీఎస్సీ రాసిన లేఖపై ఎస్‌బీఐ ఎట్టకేలకు స్పందించింది. ఫిబ్రవరి 25న గ్రూప్-2 పరీక్ష రాసే అభ్యర్థులు మార్చి 4న ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్స్ పరీక్ష రాసేందుకు వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయంతో గ్రూప్-2 పరీక్ష రాయనున్న అభ్యర్థులకు ఉపశమనం కలుగుతుందని ఏపీపీఎస్సీ బోర్డు సభ్యుడు సుధీర్ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. అయితే, మార్చి 4న ఎస్‌బీఐ మెయిన్స్ పరీక్ష రాయాలనుకొనే అభ్యర్థులు ఫిబ్రవరి 23న ఉదయం 9 గంటల లోపు సంబంధిత లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎస్‌బీఐ స్పష్టం చేసింది.


APPSC Group-2 పరీక్షకు హాజరయ్యేవారు SBI Clerks Main పరీక్ష తేదీ మార్చుకునేందుకు క్లిక్ చేయండి..






జాతీయస్థాయి పరీక్షలను పరిగణనలోకి తీసుకోకుండా.. గ్రూప్-2 పరీక్ష తేదీని నిర్ణయించడంపై ఏపీపీఎస్సీ తీరును ఉద్యోగార్థులు నిరసిస్తున్నారు. ఏపీపీఎస్సీ వెనకాముందు చూసుకోకుండా ఫిబ్రవరి 25న ఎస్‌బీఐ క్లరికల్ మెయిన్స్ పరీక్ష జరుగుతున్న రోజే గ్రూపు-2 ప్రిలిమ్స్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఉద్యోగ నియామకాల పరీక్ష తేదీల ఖరారు సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియామక సంస్థల ద్వారా జరిగే పరీక్షలు, వాటి తేదీలను పరిగణనలోకి తీసుకొని ఏపీపీఎస్సీ పరీక్షల తేదీలను ప్రకటించాల్సి ఉంటుంది. కానీ.. గ్రూపు-2 ప్రిలిమ్స్ తేదీ ఖరారులో ఎస్‌బీఐ పరీక్ష తేదీని పరిగణనలోకి తీసుకోలేదు. అయితే ఈ విషయమై ఎస్‌బీఐకి ఏపీపీఎస్సీ అధికారులు లేఖ రాశారు. దీంతో సానుకూలంగా స్పందించిన ఎస్‌బీఐ మార్చిన 4న మరో సెషన్‌లో పరీక్ష నిర్వహించేందుకు నిర్ణయించారు.


స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ పోస్టుల భర్తీకి గత నవంబరులో నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్‌లోనే ఫిబ్రవరి 25న మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దీనికి అనుగుణంగా అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు. ఇక రాష్ట్రంలో గ్రూపు-2 నోటిఫికేషన్ గత డిసెంబరు 7న ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో ప్రిలిమ్స్ ఫిబ్రవరి 25న నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. రెండూ ఒకే రోజున ఉన్నందున ఏ పరీక్ష రాయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. గ్రూపు-2 ఉద్యోగాలకు సుమారు 4.5 లక్షల మంది దరఖాస్తు చేశారు. గ్రూపు-2 నోటిఫికేషన్ జారీకి, ప్రిలిమ్స్ నిర్వహణ తేదీ మధ్య ఇచ్చిన సమయం తక్కువగా ఉన్నందున ప్రిలిమ్స్ నిర్వహణ తేదీని వాయిదా వేయాలన్న డిమాండు అభ్యర్థులనుంచి వస్తోంది. కొందరు అభ్యర్థులు విజయవాడలో కేంద్రం కేటాయించాలని దరఖాస్తులో పేర్కొంటే గుడివాడలో ఇచ్చారు. ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది.


ALSO READ:


ఎస్‌బీఐలో 80 స్పెషలిస్ట్‌ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
ముంబయిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులర్ ప్రాతిపదికన మేనేజర్‌ (సెక్యూరిటీ అనలిస్ట్‌), డిప్యూటీ మేనేజర్‌ (సెక్యూరిటీ అనలిస్ట్‌), మేనేజర్‌ (సెక్యూరిటీ అనలిస్ట్‌), అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌(అప్లికేషన్‌ సెక్యూరిటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 80 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, ఎంసీఏ, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు రూ.750. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు మినహాయింపు ఉంది. సరైన అర్హతలున్నవారు మార్చి 4 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. షార్ట్‌లిస్ట్ంగ్‌, ఇంటర్వూ తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..