ఏపీలో 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాతపరీక్షకు పోలీసు నియామక మండలి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా పలు కేంద్రాల్లో జనవరి 22న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులను ఉదయం 9 గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. 10 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. అభ్యర్థులు తీసుకెళ్లే వస్తువుల కోసం పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి ఏర్పాట్లూ ఉండవని పోలీసు నియామక మండలి తెలిపింది. అభ్యర్థులు ఒక రోజు ముందే పరీక్ష కేంద్రాన్ని సందర్శించాలి. అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటరు కార్డు, రేషన్ కార్డు వంటి ఒరిజినల్ గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకొని రావాలి. 


ఒక్కో పోస్టుకు 83 మంది పోటీ!
ఏపీలో 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన దరఖాస్తు గడువు జనవరి 7తో ముగిసింది. ఈ ఉద్యోగాలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,09,579 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు తీవ్రంగా పోటీ నెలకొంది. అంటే ఒక్కో పోస్టుకు 83 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మరోవైపు ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన దరఖాస్తు గడువు జనవరి 18న సాయంత్రం 5 గంటలకు ముగిసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు గడువు ముగిసే సమయానికి మొత్తం 1,73,047 మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. వీరిలో పురుషులు 1,40,453 మంది ఉండగా..మహిళలు 32,594 మంది ఉన్నారు. మొత్తం 411 ఎస్‌ఐ పోస్టులకు 1,73,047 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. అంటే ఒక్కో పోస్టుకు 421 మంది పోటీ పడుతున్నారు. ఎస్‌ఐ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 5 నుంచి పరీక్ష హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు. 


కానిస్టేబుల్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


ప్రిలిమినరీ పరీక్ష విధానం:


➨ ప్రిలిమ్స్ పరీక్షలో పేపర్-1, పేపర్-2 ఉంటాయి. మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.


➨ పేపర్-1లో 100 ప్రశ్నలు-100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలు-100 మార్కులు. పరీక్ష సమయం 3 గంటలు.


➨ ఓఎంఆర్ విధానంలోనే రాతపరీక్ష ఉంటుంది.


➨ పరీక్షలో అర్హత మార్కులను ఓసీలకు 40 శాతం, బీసీలకు 35 శాతం, ఎస్సీ-ఎస్టీ-ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 30 శాతంగా నిర్ణయించారు.


➨ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఫిజికల్ పరీక్షలు, ఫిజికల్ ఈవెంట్లు నిర్వహిస్తారు.


➨ అరిథ్‌మెటిక్, రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.


అభ్యర్థులకు ముఖ్య సూచనలు..


➥ హాల్‌టికెట్‌ను ఏ4 సైజ్ పేపర్‌లో ప్రింట్ తీసుకొని దానిపై నిర్ధేశిత స్థానంలో దరఖాస్తు సమయంలో డిజిటల్ కాపీలో ఉంచిన ఫొటోనే తిరిగి అతికించాలి. కేవలం గమ్‌తోనే అతికించాలి. 

➥ అభ్యర్థులు చేతులకు మెహిందీ, టాటూలు ఉంచుకోవద్దు. 

➥ మహిళా అభ్యర్థులు నగలు ధరించకూడదు. ఓఎంఆర్ షీట్లపై అనవసర రాతలు, గుర్తులు, మత సంబంధ అంశాల్లాంటివి రాస్తే మాల్‌ ప్రాక్టీస్‌గా పరిగణిస్తారు. 

➥ అభ్యర్థి పరీక్ష గదిలోకి హాల్‌టికెట్‌తో పాటు బ్లూ, బ్లాక్ పాయింట్ పెన్నును మాత్రమే తీసుకెళ్లాలి.

➥ అభ్యర్థులు సెల్ ఫోన్, ట్యాబ్లెట్, పెన్ డ్రైవ్, బ్లూటూత్ డివైస్, చేతి గడియారం, క్యాలిక్యులేటర్, లాగ్ టేబుల్, వాలెట్, పర్స్ నోట్స్, ఛార్జ్,రికార్డింగ్ పరికరాలు, ఖాళీ పేపర్లను వెంట తీసుకురాకూడదు.


➥ నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు హాల్‌టికెట్‌ను భద్రంగా ఉంచుకోవాలి. 
 
➥ హ్యాండ్‌ బాగ్స్‌, పౌచ్‌ వంటి వస్తువులను పరీక్ష హాల్‌లోకి తీసుకోకూడదు. 


కానిస్టేబుల్ పోస్టుల నోటిఫికేషన్, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...