Andhra Pradesh Job Calendar : ఆంధ్రప్రదేశ్ యువతకు గుడ్ న్యూస్! జాబ్ క్యాలెండర్ విడుదల, ఉద్యోగాల జాతర, నైపుణ్య పోర్టల్ ప్రారంభం!
యూనివర్శిటీలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీని వల్ల విద్యాబోధనకు ఆటంకం కలుగుతోందని గుర్తించిన మంత్రి వెంటనే ఆ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Andhra Pradesh Job Calendar : ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఉగాది పండుగ నాటికి జాబ్ క్యాలెండర్ను విడుదల చేయనున్నట్టు రాష్ట్ర విద్యా,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రకటించారు. గురువారం ఉండవల్లిలోని తన నివాసంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ కీలక నిర్ణయాలు వెల్లడించారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టులను భర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
యూనివర్శిటీల్లో కొలువుల జాతర
చాలా కాలంగా రాష్ట్రంలోని యూనివర్శిటీలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీని వల్ల విద్యాబోధనకు ఆటంకం కలుగుతోందని గుర్తించిన మంత్రి వెంటనే ఆ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డిగ్రీ కాలేజీలు, యూనివర్శిటీల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఇది విద్యాశాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి పెద్ద ఊరటనిచ్చే అంశం.
విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
కేవలం ఉద్యోగులే కాకుండా విద్యార్థుల సంక్షేమంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. ముఖ్యంగా కోచింగ్ సెంటర్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడి, మానసిక సమస్యల వల్ల జరుగుతున్న ఆత్మహత్యలను నివారించాలని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా కోచింగ్ సెంటర్లపై నియంత్రణ ఉండాలని, విద్యార్థులకు మానసిక ప్రశాంతతనిచ్చే వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇందు కోసం ప్రత్యేక విధి విధానాలు రూపొందించాలని కోరారు.
ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలే లక్ష్యం
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నామని, భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి తెలిపారు. ఈ ఏడాది గ్రౌండ్ అయిన పరిశ్రమల ద్వారా సుమారు రెండు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రిలయన్స్, సీబీఐ, జూపిటర్, లారెన్స్, ఫార్మా, హెటెరో డ్రగ్స్ వంటి దిగ్గజ సంస్థలతోపాటు కొత్తగా వస్తున్న రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టుల ద్వారా యువతకు ఉపాధి లభించనుంది. ఈ ప్రాజెక్టులకు అవసరమైన నైపుణ్యాలను గుర్తించి, యువతకు తగిన శిక్షణ ఇవ్వాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
త్వరలో నైపుణ్యం పోర్టల్ ప్రారంభం
యువతకు ఉద్యోగ సమాచారం, శిక్షణను ఒకే చోట అందించేందుకు నైపుణ్యం పోర్టల్ను త్వరలోనే ప్రారంభించనున్నారు. ఈ పోర్టల్ ద్వారా 25 రంగాలకు సంబంధించిన డేటా ఇంటిగ్రేషన్ ఇప్పటికే పూర్తయింది. ఇందులో సుమారు 1, 14, 899 ఉద్యోగ అవకాశాలు ఉన్నట్టు గుర్తించారు. విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునే వారికి కోసం 3,100 అంతర్జాతీయ ఉద్యోగాలను కూడా సిద్ధం చేశారు. అంతర్జాతీయ రిక్రూటింగ్ ఏజెన్సీలు కూడా ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.
ఏఐతో ఇంటర్వ్యూలు- నియోజకవర్గ స్థాయిలో శిక్షణ
ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా ఉద్యోగ నియామక ప్రక్రియలో మార్పులు తెస్తున్నారు. ఇప్పటికే ట్రయల్ బేసిస్లో 20వేల మంది విద్యార్థులకు , 60 వేల మంది జాబ్ సీకర్లు ఏఐ ఆధారిత ఇంటర్వ్యూలు నిర్వహించినట్టు అధికారులు వెల్లడించారు. యువతకు నైపుణ్య శిక్షణను చేరువ చేసేందుకు ప్రతి నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని, వాటికి ఇప్పటికే ఉన్న శిక్షణ కేంద్రాలకు అనుసంధానించాలని మంత్రి ఆదేశించారు.























