AP Group -1 Results: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్టకేలకు గ్రూప్‌ -1 ఫైనల్ ఫలితాలను విడుదల చేసింది. ఎన్నో ఏళ్లుగా కఠోర శ్రమ, ఇతర అడ్డంకులు దాటుకొని సామాన్య కుటుంబాల నుంచి ఎంతో మంది విజేతలుగా ఆవిర్భవించారు. డిసెంబర్‌ 2023లో నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఈ నియామక ప్రక్రియ అనేక మలుపులు తిరిగింది. ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్ వరకు హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. దీంతో మూడేళ్లుగా వాయిదాలు పడుతూ వచ్చింది. చివరకు గతే మేలో మెయిన్స్ పరీక్షలు, జూన్‌లో ఇంటర్వ్యూలు పూర్తి చేశారు. శుక్రవారం ఫైనల్ జాబితాను విడుదల చేశారు. 

మొత్తం 89 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా, స్పోర్ట్స్ కోటాపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్న కారణంగా అసిస్టెంట్‌ కమిషనర్‌, డీఎస్పీ విభాగాల్లో ఒక్కో పోస్టును పక్కన పెట్టారు. మిహివిన 87 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇందులో 9 మంది డిప్యూటీ కలెక్టర్లు, 25 మంది డీఎస్పీలు, 17 మంది స్టేట్ టాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్లు సహా మొత్తం 15 రకాల కేడర్లకు నియామకాలు జరిగాయి. 

పల్నాడు జిల్లా నరసారావుపేటకు చెందిన షేక్ యూసబ్‌ సలామ్‌ తండ్రి సుభానీ ఒక కార్పెంటర్‌, కనీస వసతులతోనే బీటెక్, ఎంటెక్ పూర్తి చేసి తన రెండో ప్రయత్నంలో రీజినల్‌ ట్రాన్స్‌ పోర్టు ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. తెనాలికి చెందిన అడపాల ఓంకార వెంకట నాగేశ్వరరావు తండ్రి కూరగాయల వ్యాపారి. ప్రస్తుతం సచివాలయ పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న నాగేశ్వరరావు, తన లక్ష్యాన్ని వదలకుండా గ్రూప్‌-1 సాధించి డీఎస్పీగా ఎంపికయ్యారు. 

అన్నమయ్య జిల్లాకు చెందిన సురేష్  సచివాలయ కార్యదర్శిగా పని చేస్తూనే గ్రూప్‌్-2లో డిప్యూటీ తాహసీల్దార్‌గా ఎంపికయ్యారు, అదే ఊపుతో గ్రూప్‌-1 రాసి ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన డిప్యూటీ కలెక్టర్‌ పోస్టును దక్కించుకున్నారు. అనకాపల్లి జిల్లాకు చెందిన సంతోషి ఒకవైపు తాహసీల్దార్‌ కార్యాలయంలో కంప్యూటర్ జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తూనే మరోవైపు గ్రూప్స్‌ కోసం ప్రిపేర్ అయ్యారు. మంగళవారం వచ్చిన గ్రూప్‌-2 ఫలితాల్లో అసిస్టెంట్‌ ఆఫీసర్‌గా ఎంపికైన ఆమె, శుక్రవారం విడుదల చేసిన గ్రూప్‌-1 ఫలితాల్లో ఆర్టీవోగా ఎంపికయ్యారు. 

గుంటూరుకు చెందిన ప్రియాంక, సాహితి అనే అక్కాచెల్లెళ్ళు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. అక్క ప్రియాంక తన మూడో ప్రయత్నంలో గ్రూప్‌-1 డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపిక కాగా, చెల్లెళ్లు సాహితి మొదటి ప్రయత్నంలోనే గ్రూప్‌-2లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించారు. వాళ్ల తండ్రి కూడా ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్ అయ్యారు.                            

శ్రీకాకుళం జిల్లాకు చెందిన సంపతిరావు శివనాగగౌరి రెండో ప్రయత్నంలో డీఎస్పీగా ఎంపికయ్యారు. ఆమె ప్రస్తుతం వంశధార ప్రాజెక్టులో ఏఈఈగా పని చేస్తున్నారు. మార్కాపురానికి చెందిన ఒద్దుల వెంకట సుజిత్ రెడ్డి 2023లో ఇంజినీరింగ్ పూర్తి చేసి తన మొదటి ప్రయత్నంలో అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌గా కొలువు సాధించారు.