AI Hitting Senior Employees First: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్  సృష్టించిన ప్రకంపనలతో ప్రముఖ టెక్ దిగ్గజం ఒరాకిల్  భారీగా ఉద్యోగ కోతలను ప్రకటించింది. సుమారు 20,000 నుండి 30,000 మంది ఉద్యోగులను తొలగిస్తూ సంస్థ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ రంగంలో ఆందోళన రేకెత్తిస్తోంది. మరీ ముఖ్యంగా దశాబ్దాల కాలం పాటు సంస్థకు సేవలందించిన సీనియర్ నిపుణులు కూడా ఈ వేటుకు గురవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సంస్థలో 33 ఏళ్ల అనుభవం ఉన్న సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ సైతం ఉదయాన్నే వచ్చిన ఈ-మెయిల్స్‌తో నివ్వెరపోయారు.

Continues below advertisement

కేవలం ఒరాకిల్ మాత్రమే కాకుండా మెటా, మైక్రోసాఫ్ట్, డిస్నీ వంటి దిగ్గజ సంస్థలు కూడా ఇటీవల వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపించాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  లో భారీగా పెట్టుబడులు పెడుతున్న కంపెనీలు, పని సామర్థ్యాన్ని పెంచుకునే క్రమంలో మానవ వనరులను తగ్గిస్తున్నాయి. ఆటోమేషన్ పెరగడం వల్ల ఖర్చులు తగ్గి లాభాలు పెరుగుతాయని పెట్టుబడిదారులు భావిస్తుండటంతో, లే-ఆఫ్స్ ప్రకటించిన వెంటనే ఆయా కంపెనీల షేర్ ధరలు పెరగుతున్నాయి.  

ఈ పరిణామం అటు సీనియర్లను, ఇటు ఫ్రెషర్లను సమానంగా దెబ్బతీస్తోంది. భారీ జీతాలు తీసుకునే సీనియర్ మేనేజర్ల స్థానాన్ని ఏఐ టూల్స్ ,  తక్కువ వేతనానికి వచ్చే జూనియర్ ఉద్యోగులతో భర్తీ చేసేందుకు కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. మరోవైపు, కోడింగ్ ,  టెస్టింగ్ వంటి ప్రాథమిక పనులను ఏఐ పూర్తిగా ఆక్రమించడంతో, కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఫలితంగా ఇప్పుడు ఐటీ రంగంలో నిలబడాలంటే కేవలం అనుభవం ఉంటే సరిపోదని, ఏఐ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం తప్పనిసరి అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.           

సాధారణంగా ఆర్థిక మాంద్యం సమయంలో జరిగే ఉద్యోగ కోతలకు భిన్నంగా, ప్రస్తుతం కంపెనీలు లాభాల్లో ఉన్నప్పటికీ భవిష్యత్తు అవసరాల కోసం తమ రూపురేఖలను మార్చుకుంటున్నాయి.  ఏఐ ఫస్ట్ విధానంలో భాగంగా జరుగుతున్న ఈ పునర్వ్యవస్థీకరణ ఐటీ నిపుణులలో తీవ్ర అభద్రతాభావాన్ని పెంచుతోంది. నైపుణ్యం ఉన్నవారే ఆల్గారిథమ్స్ కారణంగా ఉద్యోగాలు కోల్పోతుండటం చూస్తుంటే, టెక్ ప్రపంచం ఒక విప్లవాత్మకమైన కానీ కఠినమైన మార్పు దిశగా పయనిస్తున్నట్లు స్పష్టమవుతోంది.