Covid 19 Update: దేశంలో జోరుగా వ్యాక్సినేషన్.. కేరళలో మాత్రం కరోనా టెన్షన్

ABP Desam Updated at: 02 Sep 2021 06:20 PM (IST)

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ను కేంద్ర ఆరోగ్య శాఖ మరింత వేగవంతం చేసింది. అయితే కేరళలో మాత్రం కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మొత్తం కేసుల్లో 70 శాతం కేరళలోనే నమోదయ్యాయి.

దేశంలో జోరుగా వ్యాక్సినేషన్.. కేరళలో మాత్రం కరోనా టెన్షన్

NEXT PREV

దేశంలో రోజువారీ కరోనా కేసుల నమోదవుతున్న తీరును పరిశీలిస్తే కొవిడ్ సెకండ్ వేవ్ ముగిసిందని చెప్పలేమని కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉన్నప్పటికీ కేరళలో మాత్రం వైరస్‌ వ్యాప్తి కొనసాగుతూనే ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆరోగ్య కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ మీడియాకు తెలిపారు. 











దేశంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో 70 శాతం కేరళలోనే ఉన్నాయి. యాక్టివ్ కేసులు కూడా ఇక్కడే ఎక్కువ. దేశంలో మొత్తం 3.8 లక్షల యాక్టివ్ కేసులు ఉండగా కేరళలోనే లక్షకు పైగా ఉన్నాయి. జూన్‌ నెలలో దేశవ్యాప్తంగా 279 జిల్లాల్లో రోజుకు 100కు పైగా కేసులు నమోదుకాగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 42కు తగ్గింది.                                           -  రాజేశ్ భూషణ్, ఆరోగ్య కార్యదర్శి


సెకండ్ వేవ్ ఇంకా పోలేదు..


దేశంలో ఇప్పటికే థర్డ్ వేవ్ పై చాలా నివేదికలు వెలుగుచూడగా.. కేంద్ర ఆరోగ్య శాఖ మాత్రం భిన్నంగా స్పందించింది. ఇంకా దేశంలో సెంకడ్ వేవ్ ముగిసిందని చెప్పలేమంది. ప్రజలంతా కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రాజేశ్‌ భూషణ్‌ సూచించారు. వ్యాక్సిన్ తీసుకున్నా మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అన్నారు. 


వ్యాక్సినేషన్ జోరు..


వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్ర మరింత వేగవంతం చేసింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 66 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసింది. 16 శాతం మంది అర్హులైన జనాభాకు రెండు డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 54 శాతం మందికి ఒక డోసు పూర్తయినట్లు తెలిపింది. 


సిక్కిం, హిమాచల్‌ప్రదేశ్‌, దాద్రా నగర్‌ హవేలీలలో 100 శాతం మంది(18ఏళ్లు పైబడినవారు) కనీసం ఒక డోసు తీసుకున్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.

Published at: 02 Sep 2021 06:20 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.