Dognosis Cancer Screening Technology: బెంగళూరుకు చెందిన డీప్-టెక్ స్టార్టప్ అయిన డాగ్నోసిస్ చేస్తున్న ప్రయోగం సంచలనంగా మారుతోంది. ఈ సంస్థ భారత్‌లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించే విధానాన్ని సమూలంగా మార్చగల ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. 'బ్రీత్‌ఈజీ' పేరుతో పిలిచే ఈ కంపెనీ ప్లాట్‌ఫామ్, కుక్కల వాసన పసిగట్టే శక్తిని, బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ టెక్నాలజీని మిళితం చేస్తుంది. క్యాన్సర్ వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉ్న వ్యక్తులను గుర్తించి, వారిని వైద్య పరీక్షల కోసం సిఫార్సు చేయడమే దీని ప్రధాన లక్ష్యం. 

Continues below advertisement

ప్రస్తుత క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే, 2027 ఆరంభం నాటికి దేశంలో వాణిజ్యపరంగా ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. ఈ టెక్నాలజీ అతి ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే, దీనికి ఎలాంటి రక్త పరీక్షలు లేదా స్కాన్‌లు అవసరం లేదు. వ్యక్తులు సుమారు 10 నిమిషాల పాటు ఒక ప్రత్యేక మాస్క్‌లో శ్వాస తీసుకుంటే సరిపోతుంది, ఆ తర్వాత వారి శ్వాస నమూనాను విశ్లేషిస్తారు. భవిష్యత్తులో, ఈ పరీక్ష కేవలం లక్షణాలు కనిపించిన తర్వాతే కాకుండా, ముందే క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చని డయాగ్నోసిస్ భావిస్తోంది. దీనివల్ల ప్రమాదంలో ఉన్నవారిని ముందుగానే గుర్తించడం సులభతరం అవుతుంది. సకాలంలో తదుపరి పరీక్షలు చేయడానికి వీలవుతుంది.

ఇది ఎలా పనిచేస్తుంది?

బ్రీత్‌ఈజీ ఒక సైన్స్‌ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందినప్పుడు, అవి volatile organic compounds అని పిలిచే చిన్న అణువులను విడుదల చేస్తాయి, ఇవి శ్వాస ద్వారా బయటకు వెలువడతాయి. మనుషుల కంటే కుక్కలకు వాసన పసిగట్టే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి అవి ఈ చాలా బలహీనమైన రసాయన సంకేతాలను కూడా గుర్తించగలవు. ఈ సంస్థ ప్రధానంగా బీగిల్ జాతి కుక్కలను ఉపయోగిస్తుంది, అయినప్పటికీ ఇతర జాతులకు కూడా శిక్షణ ఇస్తున్నారు. తమ సాంకేతికత కేవలం కుక్కల ప్రవర్తనపై మాత్రమే ఆధారపడదని డాగ్నోసిస్ (Dagnosys)పేర్కొంది. ఒక నమూనాను వాసన చూస్తున్నప్పుడు కుక్క మెదడు కార్యకలాపాలను రికార్డ్ చేసి, విశ్లేషించే ఒక ప్రత్యేకమైన బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ అభివృద్ధి చేస్తున్నారు. ఇది కేవలం సంకేత ప్రవర్తనపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.

Continues below advertisement

కంపెనీ ఆటోమేటెడ్ ప్లాట్‌ఫామ్‌పై శ్వాస నమూనాలను పరీక్షిస్తారు. కంపెనీ ప్రకారం, ఈ సిస్టమ్ మనుషుల సహాయం లేకుండా ఒకే సెషన్‌లో 200కుపైగా నమూనాలను పరీక్షించగలదు. భవిష్యత్తులో, అనేక యూనిట్లను ఏకకాలంలో నడపడం ద్వారా ఏటా సుమారు 10 లక్షల నమూనాలను పరీక్షించడమే లక్ష్యం. ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ ల్యాబ్‌లు లేదా ఇతర ఆరోగ్య కేంద్రాల నుంచి నమూనాలను సేకరించి, పరీక్షా కేంద్రానికి పంపుతారు.

ఇంకా కొనసాగుతున్న క్లినికల్ ట్రయల్స్ 

బ్రీత్‌ఈజీ ప్రస్తుతం భారీ స్థాయిలో క్లినికల్ ట్రయల్స్‌ చేస్తోంది. వాస్తవ ప్రపంచ పరిస్థితుల్లో ఈ సాంకేతికత ఎంత కచ్చితమైనదో, ఎంత నమ్మదగినదో నిర్ధారించడమే ఈ అధ్యయనాల లక్ష్యం. జర్నల్ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీలో ప్రచురించిన ఆర్టికల్‌ ప్రకారం, క్యాన్సర్ లేని పాల్గొనేవారిలో సుమారు 9 శాతం మందిని పొరపాటున పాజిటివ్‌గా గుర్తించినట్లు తేలింది. అదేవిధంగా, సుమారు 9 శాతం క్యాన్సర్ రోగులను గుర్తించలేకపోయారు. 

అయితే, ఈ డేటాను సాధారణ జనాభాకు నేరుగా వర్తింపజేయలేమని కంపెనీ పేర్కొంది. ఈ టెక్నాలజీ టెక్నికాలిటీస్‌నుఅంచనా వేయడానికి, ఈ అధ్యయనంలో ఉద్దేశపూర్వకంగా అధిక సంఖ్యలో క్యాన్సర్ రోగులను చేర్చారు. వాస్తవ జనాభాలో క్యాన్సర్ కేసుల నిష్పత్తి చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి స్క్రీనింగ్ ఫలితాలు భిన్నంగా ఉండవచ్చు. ప్రస్తుత ట్రయల్, వాస్తవ ప్రపంచ పరిస్థితులను మరింత మెరుగ్గా ప్రతిబింబించే డేటాను అందిస్తుందని భావిస్తున్నారు.

కేవలం ముందస్తు పరీక్ష చేసే మార్గమే

బ్రీత్‌ఈజీ కచ్చితమైన క్యాన్సర్‌ నిర్ధారణ చేయదని, కేవలం ముందస్తు స్క్రీనింగ్ సాధనంగా అభివృద్ధి చేస్తున్నారు. అంటే, ఇది క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్న వ్యక్తులను మాత్రమే గుర్తిస్తుంది. ఈ వ్యక్తులు అప్పుడు ఇమేజింగ్, రక్త ఆధారిత పరీక్షలు లేదా బయాప్సీల వంటి మరింత సాంప్రదాయ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఖరీదైన, సంక్లిష్టమైన పరీక్షలు అవసరమైన వారికి మాత్రమే పరిమితమవుతాయని, తద్వారా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై భారం తగ్గుతుందని కంపెనీ విశ్వసిస్తోంది. ఈ సాంకేతికతను ఆసక్తికరమైనదిగా, ఆశాజనకమైనదిగా నిపుణులు పరిగణిస్తున్నారు, అయితే దీనిని ఆరోగ్య సంరక్షణ సేవల్లో చేర్చడానికి ముందు భారీ స్థాయిలో క్లినికల్ పరీక్షులు అవసరమవుతాయని అంటున్నారు. దీని వాస్తవ ప్రయోజనం, నిర్వహణ, విశ్వసనీయతకు సంబంధించి అనేక ప్రశ్నలు మిగిలి ఉన్నాయి.

గమనిక: ఈ సమాచారం పరిశోధన అధ్యయనాలు, నిపుణుల అభిప్రాయంపై ఆధారపడి ఉంది. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా కొత్త కార్యాచరణ చేపట్టే ముందు మీ వైద్యుడిని లేదా సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.