Vikram, : హిస్టారిక‌ల్ యాక్షన్ డ్రామా 'పొన్నియ‌న్ సెల్వన్ పార్ట్ 2' విడుదలకు సిద్ధమైంది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 'పార్ట్ 1' గతేడాది రిలీజై భారీ విజయాన్ని నమోదు చేసింది. ఐదు వంద‌ల కోట్లకుపైగా క‌లెక్షన్స్ రాబ‌ట్టిన ఈ సినిమా సీక్వెల్ మరో కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 'పీఎస్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో విక్రమ్ తెలుగులో మాట్లాడి, అందర్నీ ఆకర్షించారు. తెలుగు ప్రజలు చూపిస్తున్న ఉత్సాహం ఎక్కడా చూడలేదంటూ వ్యాఖ్యానించారు.


'పొన్నియ‌న్ సెల్వన్ పార్ట్ 2'  విడుదల డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్ లో దూకుడు పెంచారు. అందులో భాగంగా ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మూవీ టీం పాల్గొని, సందడి చేసింది. ఈ సందర్భంగా హీరో చియాన్ విక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు భాషలో మాట్లాడి అందరి దృష్టినీ తన వైపుకు తిప్పుకున్నారు. సినిమా త్వరలో విడుదలకాబోతున్న సందర్భంగా తాము పలు రాష్ట్రాల ప్రేక్షకులను కలుసుకున్నామన్న విక్రమ్.. ఇక్కడ మీరు చూపిస్తున్న ఉత్సాహం ఇంకెక్కడా చూడలేదని చెప్పారు. పలు తెలుగు సినిమాల చిత్రీకరణ కోసం హైదరాబాద్‌లో తిరిగానని, పంజాగుట్ట సర్కిల్‌, బంజారాహిల్స్‌ లాంటి కొన్ని ప్రదేశాలు తనకు బాగా గుర్తున్నాయంటూ విక్రమ్ చెప్పుకొచ్చారు.


తనకు అప్పట్లో టాలీవుడ్‌ అగ్ర దర్శకులతో పనిచేయాలని కోరిక ఉండేదని, కానీ.. అది నెరవేరలేదని విక్రమ్ చెప్పారు. కానీ ఓటీటీకి ఈ సందర్భంగా థ్యాంక్స్‌ చెప్పే అవకాశం వచ్చిందని తెలిపారు. ఎన్నో సరిహద్దులను అది చెరిపేసిందన్న ఆయన.. ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’ ద్వారా పెద్ద విజయం అందుకున్నామని చెప్పారు. ఇది నేరుగా తాను తెలుగు సినిమాలో నటించినంత ఆనందాన్ని ఇచ్చిందంటూ విక్రమ్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 28న విడుదలవుతున్న  'పొన్నియన్ సెల్వన్ 2' సినిమా తెలుగు ప్రేక్షకులు విపరీతంగా నచ్చుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.



‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’తో ఎక్కడలేని పాపులారిటీని సొంతం చేసుకున్న దర్శకుడు మణిరత్నం దాని రెండో భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఈ సినిమా రెండు భాగాలు తీసేందుకు దర్శక ధీరుడు రాజమౌళి తీసిన బాహుబలే కారణమని ఆయన గత కొన్ని రోజుల క్రితం జరిగిన మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మణిరత్నం, రాజమౌళికి కృతజ్ఞతలు తెలియజేశారు.


కాగా ఈ సినిమాలో విక్రమ్‌, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్‌బచ్చన్‌, త్రిష లాంటి పలువురు టాలెంటెడ్ యాక్టర్స్ స్ర్కీన్ షేర్ చేసుకున్నారు. రెండో భాగంలో వీరి పాత్రలు కీలకంగా నిలవనున్నట్లు అర్థమవుతోంది. ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు అందించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది. 


పొన్నియ‌న్ సెల్వన్‌తో పాటు అత‌డి అనుచ‌రుడు వందిదేవుడు ప్రమాదంలో ప‌డిన‌ట్లుగా చూపించ‌డంతో ఫ‌స్ట్ పార్ట్‌ను ఎండ్ చేయగా.. ఇప్పుడు సెకండ్ పార్ట్‌లో త‌మ కుటుంబంపై కుట్రలు ప‌న్నిన నందినితో పాటు పెద‌ప‌ళువెట్టరాయ‌ర్‌ను ఎదురించి చోళ సామ్రాజ్యాన్ని క‌రికాళుడు, పొన్నియ‌న్ సెల్వన్ ఏ విధంగా నిల‌బెట్టార‌న్నది చూపించ‌బోతున్నట్లు స‌మాచారం.