మిళ నటుడు విజయ్ దళపతి ఇటీవల నటించిన సినిమా ‘వారిసు’. ఈ మూవీ ను తెలుగులో ‘వారసుడు’ పేరుతో విడుదల చేస్తున్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకు సంబంధించి షూటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. అలాగే సినిమాకు సంబంధించి విడుదల చేసిన ప్రచార చిత్రాలు కూడా మంచి ఆదరణ పొందాయి. అయితే తాజాగా ‘వారసుడు’ సినిమాకు సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.


‘వారసుడు’ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూాడా దాదాపు పూర్తవుతున్నాయి. సినిమాను సంక్రాంతికే విడుదల చేయాలని నిర్ణయించింది మూవీ టీమ్. దీంతో రిలీజ్ డేట్ దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు. అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగులోనూ ప్రచారం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా చెన్నైలోని మెట్రో రైళ్లను సైతం ప్రచారం కోసం వాడేస్తున్నారు. ఇందుకు చెన్నై మెట్రో ట్రైన్ అంతటా ‘వారిసు’ సినిమా పోస్టర్లతో నింపేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్స్ చెన్నైలో హల్చల్ చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది మూవీ టీమ్. ఇప్పుడీ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. 
 
హీరో విజయ్ కు తెలుగులో కూడా మంచి పాపులారిటీ ఉంది. ‘తుపాకీ’ సినిమా నుంచి విజయ్ సినిమాలు అన్నీ తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ తెలుగులో తన పాపులారిటీని మరింత పెంచుకోవాలని చూస్తున్నారు. అందుకే తెలుగు దర్శక నిర్మాతలతో కలసి సినిమా చేస్తున్నారు. ‘వారసుడు’ సినిమాతో ఇక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నారు విజయ్. 


‘వారసుడు’ సినిమాను వచ్చే యేడాది విడుదల చేయనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలిపారు మేకర్స్. ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే తమిళ్‌లో ‘రంజితమే’ అనే పాట విడుదలైంది. ఈ పాటకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. థమన్ మ్యూజిక్ అందించిన ఈ పాటకు తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం థమన్ మంచి ఫామ్ లో ఉన్నాడు. వరుస భారీ ప్రాజెక్టులు చేస్తూ దూసుకుపోతున్నాడు. దీంతో ఈ ‘వారసుడు’ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.


ఇక ‘వారసుడు’ సినిమా సంక్రాంతి బరిలో దిగడంతో మూవీ పై ఉత్కంఠ నెలకొంది. తెలుగులో సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలే ఉన్నాయి. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య ‘వీరసింహారెడ్డి’ సినిమాలతో పోటీ పడనుంది ఈ మూవీ. అలాగే తమిళ్ నుంచి హీరో అజిత్ నటించిన ‘తునివు’ సినిమా తెలుగులో ‘తెగింపు’ గా సంక్రాంతికే విడుదల కానుంది. మరో వైపు ‘వారసుడు’ చిత్రాన్ని దిల్ రాజు స్వయంగా నిర్మించడంతో థియేటర్లు ఎక్కువగా ఉంటాయని టాక్.. కాబట్టి సినిమా కలెక్షన్స్ పై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఈ పోటీను తట్టుకొని ‘వారసుడు’ ఎలా నెట్టుకొస్తాడో వేచి చూడాలి.