పెద్దన్న :


తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కి కోలీవుడ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. ఆయన సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలు.. హడావిడి మాములుగా ఉండదు. ఆయన చివరిగా నటించిన సినిమా 'దర్బార్'. ప్రస్తుతం శివ దర్శకత్వంలో 'అన్నాత్తే' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో 'పెద్దన్న' అనే టైటిల్ తో రిలీజ్ చేయబోతున్నారు. దీపావళి కానుకగా నవంబరు 4న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో కుష్బు, మీనా, కీర్తి సురేష్, సూరి, ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, అభిమన్యు సింగ్‌లో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో ఏషియన్ సినిమాస్, డి.సురేష్ బాబు పంపిణీ చేయనున్నారు. 







ఎనిమీ :


హీరో విశాల్ విభిన్నమైన చిత్రాలతో ఆకట్టుకుంటూ ప్రేక్షకులకు దగ్గరవ్వుతున్నాడు. తాజాగా 'ఎనిమీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే తమిళంలో విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నహాలు చేస్తున్నారు. ఈ సినిమా కూడా నవంబరు 4న తమిళ/తెలుగు భాషల్లో థియేటర్‌లలో విడుదల కానుంది. ఆనంద్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో విశాల్, ఆర్యలు శత్రువులుగా కనిపిస్తారు. విశాల్ సరసన మిర్నాలిని రవి హీరోయిన్‌గా కనిపించనుంది. తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. 






మంచి రోజులు వచ్చాయి:


సంతోష్ శోభన్ - మెహరీన్ కౌర్ ఫిర్జాదా హీరో హీరోయిన్లుగా మారుతి రూపొందించిన మూవీ 'మంచి రోజులు వచ్చాయి'. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ మంచి టాక్ సంపాదించుకున్నాయి. దీపావళి పండగను పురస్కరించుకుని ఈనెల 4న ఈ చిత్రం థియేటర్‌లలో విడుదల కానుంది.






సూర్యవంశీ :


అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ సినిమా 'సూర్య వంశీ'. రణవీర్ సింగ్, అజయ్ దేవగన్ కీలకపాత్రలు పోషించారు. పోలీస్ కథ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ కు రోహిత్ శెట్టి దర్శకత్వం వహించారు. గతేడాది విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది వేసవిలో విడుదల చేయాలని భావించినా.. సెకండ్ వేవ్ కారణంగా మరోసారి విడుదలకు విరమించుకున్నారు. ఫైనల్ గా ఈ దీపావళి కానుకగా థియేటర్లో సందడి చేయడానికి నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. 



ఓటీటీ సినిమాలు.. 
జై భీమ్.. :


వరుస సినిమాలతో అదరగొడుతున్న సూర్య ప్రస్తుతం 'జై భీమ్' అనే సినిమాలో నటిస్తున్నాడు. జ్ఞానవేల్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో సూర్య లాయర్ పాత్రలో కనిపించబోతున్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నవంబరు 2న అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ మూవీ విడుదల కానుంది.



గల్లీ రౌడీ:


సందీప్‌ కిషన్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం 'గల్లీ రౌడీ'. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ తర్వాత థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని అలరించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదల కాబోతుంది. నవంబరు 4 నుంచి ఈ సినిమాను హాట్ స్టార్ లో స్ట్రీమింగ్‌ కానుంది. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి