స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు ఈ సినిమా రూ.71 కోట్ల గ్రాస్ ను సాధించినట్లు నిర్మాతలు అధికారికంగా వెల్లడించారు. ఒక్క నైజాంలోనే 11.44 కోట్ల రూపాయల షేర్ ని రాబట్టినట్లు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ రంగంలోకి దిగి ఇండియాలోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా 'పుష్ప' సినిమా నిలిచిందంటూ ట్వీట్లు వేయడం మొదలుపెట్టారు. 


ఇది చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 'వకీల్ సాబ్' సినిమానే హయ్యెస్ట్ గ్రాసర్ అని.. 'పుష్ప' సినిమాకి అన్ని కలెక్షన్స్ రాలేదంటూ వాదిస్తున్నారు. ఎలాంటి బెనిఫిట్ షోలు లేకుండా.. పాండమిక్ సమయంలో, తక్కువ టికెట్ రేట్లతోనే 'వకీల్ సాబ్' బాక్సాఫీస్ ను స్మాష్ చేశాడంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏపీ/తెలంగాణా రాష్ట్రాల్లో అత్యధిక షేర్ అండ్ గ్రాస్ సాధించిన సినిమా 'వకీల్ సాబ్' అంటూ ట్విట్టర్ లో వందల సంఖ్యలో పోస్ట్ లు పెడుతున్నారు.


దీంతో అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ లో వార్ జరుగుతుంది. 'మా హీరో గొప్పంటే.. కాదు కాదు.. మా హీరో గొప్పంటూ' కలెక్షన్స్ విషయంలో పోట్లాడుకుంటున్నారు. మరోపక్క రజినీకాంత్ ఫ్యాన్స్ రంగంలోకి దిగి 'అన్నాత్తే' సినిమా అత్యధిక షేర్స్ సాధించిందంటూ పోస్ట్ లు పెడుతున్నారు. ట్విట్టర్ లో ఇలాంటి ఫ్యాన్ వార్స్ చాలా కామన్. గతంలో కూడా ఇలాంటివి చాలానే జరిగాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ మహేష్ బాబు ఫ్యాన్స్, అజిత్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ ఫ్యాన్స్ ఇలా ఫ్యాన్స్ గ్రూపులుగా విడిపోయి సోషల్ మీడియాలో రచ్చ చేశారు.