Podharillu Serial Today Episode: మాధవ్‌ చెప్పడంతో ఎట్టకేలకు మహాలక్ష్మీ  రిసెప్షన్‌కు  స్టేజీమీదకు రావడానికి ఒప్పుకుంటుంది. దీంతో చక్రి, మహా ఇద్దరూ కలిసి రెడీ అయ్యి రిసెప్షన్ కు వస్తారు. దీంతో  అందరూ వాళ్లను చూసి ఆనందపడతారు. ఇక నారాయణ సంతోషంతో  డ్యాన్స్‌ వేస్తాడు. మా పరువు నిలబెట్టారని చక్ర మహాకు ధ్యాంక్స్‌ చెబుతాడు. అయితే స్టేజీపై  ఉన్న కుర్చీలో ఇద్దరూ దూరంగా  కూర్చుని ఉండటంతో చూసి ఫొటోలు తీసే వ్యక్తి వాళ్లను దగ్గరకు రమ్మని చెబుతాడు. దీనికి చక్రి తటపటాయిస్తుంటాడు. మహా కలుగజేసుకుని  చక్రి పక్కకు వచ్చి కూర్చుని ఉంటుంది. ఫొటోలు తీయడం అయిపోగానే  ఒక్కసారిగా మహా లేచి నిల్చుంటుంది. ఇంట్లోకి వెళ్లిపోతుందేమోనని చక్రి చాలా కంగారుపడిపోతాడు. కానీమహా ఫొటోలు దిగడం కోసమే లేచి నిల్చుందని తెలిసి స్థిమితపడతాడు. వివిధ యాంగిల్‌లో ఫొటోలు తీస్తూ....ఆమె భుజంపై చేయివేయమని ఫొటోలు తీసే అబ్బాయి చెప్పడంతో మాధవ్‌ ఇప్పుడు ఇలాంటి వద్దని వారించి ఆపేస్తాడు. అందరూ ఒక్కొక్కరూ  వచ్చి నూతన దంపతులకు విషెష్‌ చెప్పి గిప్ట్లు ఇచ్చి వెళ్తుంటారు.                 మాధవ్‌కు, చక్రికి నిజం తెలుసు కాబట్టి ఇదంతా ఇబ్బందికరంగా ఉంటుంది.ఇంతలో నారాయణ  ఎవరూ ఊహించని విధంగా  దండలు తీసుకుని వస్తాడు. వాటిని చూడగానే మహాకు గుండెలో రాయిపడినట్లు అవుతుంది. చక్రి తనకు ఏమీ తెలియదని చెబుతాడు. దండలు వాళ్లిద్దరికి ఇచ్చి మార్చుకోమని చెబుతాడు. కొద్దిసేపు ఓర్చుకోడండని చెప్పి చక్రి ఆమె మెడలో దండవేస్తాడు. చేసేదిలేక మహా కూడా చక్రి మెడలో దండవేస్తుంది. హమ్మయ్య గట్టు ఎక్కామని  అనుకునేలోపు  నారాయణ మళ్లీ ఇంకో మెలిక పెడతాడు. ఈసారి ఏకంగా  బంగారు మంగళసూత్రం బయటకు తీసి మహా మెడలో వేయమని చెబుతాడు. దీంతో చక్రికి ఏం చేయాలో అర్థం కాదు.  ఇప్పుడు కానీ ఆ తాళి నా మెడలో వేశావంటే చంపేస్తానని మహా హెచ్చరిస్తుంది. కానీ నారాయణ గట్టిగా  అందరికీ చూపిస్తూ...మా చక్రి, కోడలు ఇష్టపడి పెళ్లిచేసుకోలేదని అన్నవాళ్లందరి నోళ్లు మూతపడాలని చెబుతూ తాళిని చక్రి చేతికి  అందిస్తాడు నారాయణ. చేసేది లేక చక్రి మహా మెడలో వేస్తాడు. ఇదంతా చూస్తున్న మాధవ్‌కు లోపల ఆనందంగానే ఉన్నా...మహా ఏం అనుకుంటుందోనని భయంగా ఉంటుంది. ఇంతలో కింద ఉన్న వాళ్లలో ఒకరు వచ్చి మహా మెడలో ఉన్న పసుపుకొమ్ము తాళి తీసి మాధవ్‌కు ఇచ్చి జాగ్రత్తగా  దేవుడి దగ్గర పెట్టమని చెప్పి వెళ్లిపోతుంది.                   పసుపుకొమ్ము తాళి దేవుడి దగ్గరపెట్టి మాధవ్ దేవుడిని కోరుకుంటాడు.ఎలాగైనా ఈ మహాలక్ష్మీ మా ఇంటి గడప దాటిపోకుండా చూడాల్సిన బాధ్యత నీదేనంటూ  మొక్కుకుంటాడు. అంతా సవ్యంగా సాగుతోందని అనుకుంటాడు. ఇంతలో వచ్చిన జనం మొత్తం కొత్త దంపతులను  ఆశీర్వదించి  వెళ్లిపోగా....తాయరు వాళ్ల  అన్నయ్యను తీసుకుని చురచురమంటూ  అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంతలో అందరూ కలిసి గ్రూప్‌ పొటో దిగుదామని  కన్నా కోరడంతో  నలుగురు అన్నదమ్ములు కలిసి ఫొటో దిగడానికి ప్రయత్నిస్తుంటారు. ఇంతలో నారాయణతోపాటు గాయత్రి కూడా వచ్చి ఫొటో దిగుతారు. మాధవ్‌,గాయత్రి కూడా కలిసి విడిగా ఫొటోలు దిగుతారు. మాధవ్ గాయాత్రిని తీసుకెళ్లి  ఆమెకు ప్రత్యేకంగా భోజనం పెట్టిస్తాడు. ఈ ఊరిలో మా ఇల్లుగురించి మంచిగా కోరుకునే వ్యక్తివి నువ్వు ఒక్కదానివేనంటూ  ఆమెకు కొసరి కొసరి వడ్డిస్తాడు. మరోవైపు నారాయణ ఫుల్‌గా మందువేసి  అన్నం తిని వెళ్తున్న అందరినీ ఆపి తనను అవమానంచిన వారికి బుద్దిచెబుతుంటాడు. ఇంతలోఅన్నం తింటున్న గాయత్రి దగ్గరకు తాయరు వచ్చి మండిపడుతుంది. నీకు ఇక్కడ అన్నం ఎలా తినాలనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అక్కడ మీ పెద్దన్నయ్య ఏం చేస్తున్నాడో  చూడమని చెప్పగా....వాళ్ల తమ్ముడు ఇచ్చిన మందు తాగుతూ కనిపిస్తాడు. నువ్వు పెట్టిన శాపాలు ఏం పనిచేయవమ్మా కాబట్టి నువ్వు కూడా వచ్చి అన్నం తినమని చెబుతుంది గాయత్రి. మీరు ఇద్దరూ ఇంటికి రండి మీ పని చెబుతానంటూ  కోపంతో తాయర్ ఇంటికి వెళ్లిపోతుంది. స్టేజీ దిగి ఇంట్లోకి వెళ్లిపోతున్న చక్రి, మహాను పిలిచి అందరం భోజనం చేద్దామని రమ్మని అంటాడు మాధవ్‌. వాళ్లు రాగానే అందరూ కలిసి భోజనం చేస్తారు.