Gruhalakshmi Serial November 20th Episode : దీపక్ తులసి ఇంటికి వెళ్లి ఎంత చెప్పినా తులసి వినదు. వెళ్లిపోమని వార్నింగ్ ఇస్తుంది. తన చేతగాని తప్పునకు అమ్మకు దూరమయ్యానని.. చేయని తప్పునకు నువ్వు కూడా దూరం పెడితే ఎలా అక్కా అంటూ దీపక్ ఏడుస్తాడు. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి అని ఏడుస్తాడు. అమ్మ విషయం నాకు ఫోన్ చేసి చెప్పకపోవడం నీ తప్పు కాదా అని తులసి ప్రశ్నిస్తుంది. అయితే తాను ఫోన్ చేశానని నువ్వే మాట్లాడలేదని దీపక్ నిజం చెప్తాడు. ఇక పరందామయ్య కూడా దీపక్ ఫోన్ చేశాడని చెప్తాడు. 


తులసి: నా తమ్ముడు ఫోన్ చేస్తే నేను ఎందుకు మాట్లాడకుండా ఉంటాను


దీపక్: కారణం నువ్వే చెప్పాలి అక్కా.. అమ్మకి సడెన్‌గా హార్ట్‌ ఎటాక్ వచ్చింది. డాక్టర్లు ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. వెంటనే పది లక్షలు కట్టాలన్నారు. అది చెప్పాలని నీకు ఫోన్ చేశాను అక్కా నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. బావకి ఫోన్ చేశాను నీకు ఫోన్ ఇమ్మని చెప్పాను కానీ బావ ఇవ్వమంటే ఇవ్వలేదు. బిజీగా ఉన్నాను అని చెప్పాడు. చెప్పేది వినకుండా తిట్టేసి ఫోన్ పెట్టేశాడు. తర్వాత ఫోన్ స్విచ్‌ ఆఫ్ వచ్చింది అక్కా. నువ్వు ఇంట్లో ఉన్నావేమో అని పరుగెత్తుకుంటూ ఇంటికి వచ్చాను వైజాగ్ వెళ్లావ్ అన్నారు. అమ్మను బతికించుకోవడానికి పది లక్షల అప్పుకోసం తెలిసిన వాళ్లందరినీ అడిగాను. నా దురదృష్టం ఏంటంటే తెలిసిన వాళ్లందరినీ అడిగాను. కానీ ఎక్కడా అప్పు పుట్టలేదు అక్కా. డాక్టర్లను బతిమాలాను తర్వాత ఇస్తా అన్నాను కానీ చివరకు గవర్నమెంట్ హాస్పిటల్‌కి తీసుకెళ్లేలోపు అమ్మ ప్రాణం పోయింది అక్క.


పరందామయ్య: ఆ తర్వాత నుంచి నేను దీపక్ నీకోసం ట్రై చేస్తూనే ఉన్నామ్ అమ్మ. ఫోనులు స్విచ్ ఆఫ్‌లో ఉన్నాయి.


దీపక్: ఇప్పుడు చెప్పు అక్క నేను చేసిన దాంట్లో తప్పేమైనా ఉందా. నీ ఫోన్ కలిసుంటే అమ్మ బతికేది అక్క. ఆపరేషన్ జరిగుండేది అక్క. 


తులసి: నందగోపాల్ గారూ... మనం వైజాగ్ రెస్టారెంట్‌లో ఉన్నప్పుడు మా తమ్ముడు కాల్ చేశాడా.. మీరు స్విచ్ ఆఫ్ చేశారా.. 


నందు: అంటే అది నువ్వు మూడ్ బాగోలేదు ఎవ్వరితో మాట్లాడను అన్నావని..


తులసి: తమ్ముడితో కూడా మాట్లాడను అని చెప్పానా. ఆ తర్వాత మీకు కూడా వాడు కాల్ చేశాడు కదా చెప్పేది వినిపించుకోకుండా తిట్టి కాల్ కట్ చేశారు. మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేశారు. వాడు కాల్ చేసింది మా అమ్మకు హార్ట్‌ ఎటాక్ వచ్చింది అని చెప్పడానికి. కానీ మీరు వినిపించుకోలేదు. వాడు టెన్షన్‌గా కాల్ చేశాడు అంటే దాని అర్ధం ఏంటి.. ముఖ్యమైన విషయం చెప్పాలి అనే కదా. అప్పుడు నేను మూడ్ బాలేదు అన్నాను సరే. ఆ తర్వాత శ్రీనివాస్ గారితో మాట్లాడిన తర్వాత అయినా మా తమ్ముడు ఫోన్ చేశాడని చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదు. మీరు చేసిన తప్పుకు ఖరీదు మా అమ్మ ప్రాణం. అవునా కాదా. సమయానికి డబ్బులేక ఆపరేషన్ జరగక మా అమ్మ చనిపోయింది. మీ వల్ల కేవలం మీ వల్ల మా అమ్మను బతికించుకునే అవకాశానికి నేను దూరమయ్యాను. మీ కారణంగా మా అమ్మ చనిపోయింది. మా అమ్మను చంపిన హంతకుడు మీరే. ఎస్ మీ వల్లే మా అమ్మ చనిపోయింది. మా అమ్మ మాకు దూరం అయింది.


నందూ: పొరపాటు జరిగింది నిజమే కానీ నేను ఇది తెలిసి చేసిన తప్పు కాదు


తులసి: తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. పొరపాటు జరిగిందని దేవుణ్ని వేడుకొని మా అమ్మను తిరిగి ఇమ్మని చెప్పండి ఇస్తాడా..బుద్ధి తక్కువై మళ్లీ మిమల్ని నమ్మాను. మొదటి సారి నమ్మి జీవితంలో సంతోషాన్ని పోగొట్టుకున్నాను. ఒంటరిగా మిగిలాను. రెండోసారి నమ్మి మా అమ్మను దూరం చేసుకున్నాను. అనాథగా మిగిలాను


నందూ: తులసి నన్ను క్షమించు.


తులసి: ఎన్ని సార్లు మిమల్ని క్షమించాలి. భర్తగా విడిపోయినప్పుడే మిమల్ని దూరం పెట్టుంటే నాకీ క్షోభ ఉండేదే కాదు. 


పరందామయ్య: ఆవేశంలో ఉన్నావు అమ్మా తర్వాత మాట్లాడుకుందాం.


తులసి: ఇది నా ఆవేశం కాదు మామయ్య. నా బాధ నాలో అవసరానికి మించిన ఓపిక, సహనం, మంచితనం ఉన్నాయి. కానీ మా అమ్మను చంపిన హంతకుడ్ని క్షమించే అంత ఔదార్యం లేదు. మిమల్ని జీవితంలో ఎప్పటికీ క్షమించను. ఈ కుటుంబానికి జీవితాన్ని అంకితం చేసుకుంటూ మా అమ్మను కూడా పట్టించుకోకుండా బతికాను. మా అమ్మ దిగులును కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు మా అమ్మతో కలిసి ఉండాలి అని అనుకున్న సమయంలో మా అమ్మ నాకు లేకుండా చేశారు. మీరు నాతో మాట్లాడొద్దు. నా మనసు విరిగిపోయింది అంటూ తన తల్లిని గుర్తుచేసుకొని దీపక్, దివ్య, తులసి గట్టిగా ఏడుస్తారు.  
 
ఇక రాజ్యలక్ష్మి ఇంటికి వస్తుంది. దివ్య, విక్రమ్‌లు ఇంట్లో లేరు ఏంటని అడుగుతుంది. తన పర్మిషన్ లేకుండా దివ్య, విక్రమ్‌లు హనీమూన్‌కి ఎందుకు వెళ్లారని సీరియస్ అవుతుంది. దివ్య చేతిలో విక్రమ్ కీలుబొమ్మలా మారుతున్నాడని ఫైర్ అవుతుంది. ఇక తులసి తన తల్లి ఫొటో పట్టుకొని ఏడుస్తుంది. దీపక్ తన దగ్గరకి వచ్చి సర్ది చెప్తాడు. చేతులారా తన తల్లిని తానే చంపుకున్నానని తులసి ఏడుస్తుంది. ఇక దీపక్ తులసిని తన ఇంటికి పిలుస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.