వెండితెరపై మల్టీస్టారర్ సినిమాలు ఇచ్చే కిక్కే వేరు. ఒక్క టికెట్‌పై ఇద్దరు స్టార్లను చూసే అవకాశం చాలా అరుదుగా వస్తుంటుంది. ఒకప్పుడు తెలుగులో మల్టీస్టారర్లు బాగానే వచ్చాయి. కానీ కొంతకాలంపాటు ఈ హిట్ ఫార్ములాకు దూరంగా ఉన్నారు దర్శకనిర్మాతలు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా నుంచి మల్టీస్టారర్ల జోరు మళ్లీ పెరిగింది. ఈ క్రమంలో సౌత్ సినిమా ఇండస్ట్రీ నుంచి మరిన్ని ఇంట్రెస్టింగ్ మల్టీస్టారర్ సినిమాలు రాబోతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం!

 

రామ్ చరణ్ - ఎన్టీఆర్ :



 

మెగా నందమూరి కాంబినేషన్ లో వస్తోన్న మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా 'ఆర్ఆర్ఆర్'. రామ్ చరణ్, ఎన్టీఆర్ లను ఒకే తెరపై చూడాలని చాలా కాలంగా అభిమానులు కోరుకుంటున్నారు. ఎట్టకేలకు రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేసరికి ఇంటర్నేషనల్ రేంజ్ లో హైప్ వచ్చేసింది. నిజానికి ఈ ఏడాదిలోనే సినిమా విడుదల కావాల్సింది కానీ కరోనా కారణంగా వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయింది. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టి.. భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. ఈ షెడ్యూల్ లో అలియా భట్ పాల్గోనుంది.

 

పవన్ కళ్యాణ్ - రానా :



 

టాలీవుడ్ లో సెట్స్ పై ఉన్న క్రేజీ కాంబినేషన్స్ లో పవన్-రానా సినిమా ఒకటి. ఈ కాంబోని తెరపై చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' సినిమాకు రీమేక్ గా వస్తోన్న ఈ సినిమాలో పవన్-రానా ల మధ్య యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉండబోతున్నాయి. ఈ సినిమాను వచ్చే ఏడాదిలో విడుదల చేయనున్నారు. 

 

చిరంజీవి - రామ్ చరణ్ :



 

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ సినిమా 'ఖైదీ నెంబర్ 150'లో రామ్ చరణ్ ఒక పాటలో కనిపిస్తేనే ఫ్యాన్స్ అంతా తెగ సంబరపడిపోయారు. అలాంటిది వీరిద్దరూ కలిసి 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నారని తెలియగానే అభిమానుల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. మొదటి చరణ్ ను క్యామియో రోల్ కోసం అనుకున్నారు కానీ తరువాత పూర్తి స్థాయి పాత్రగా మలిచినట్లు వెల్లడించారు దర్శకుడు కొరటాల. దీంతో ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

 

వరుణ్ - వెంకటేష్ :

 


గతంలో వరుణ్ తేజ్, వెంకటేష్ కలిసి నటించిన 'ఎఫ్ 2' సినిమా భారీ విజయాన్ని సాధించింది. దీంతో ఈ సినిమాకి కొనసాగింపుగా 'ఎఫ్ 3'ని తెరకెక్కిస్తున్నారు. ఈసారి వరుణ్, వెంకటేష్ లతో పాటు సునీల్ కూడా కామెడీ పండించబోతున్నారని తెలుస్తోంది. అనీల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 

 

సిద్ధార్థ్ - శర్వానంద్ :



 

హీరో సిద్ధార్థ్ తెలుగులో సినిమా చేసి చాలా కాలం అవుతుంది. ఇన్నాళ్లకు ఆయన 'మహాసముద్రం' సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇందులో సిద్ధార్థ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించబోతున్నారని టాక్. అజయ్ భూపతి రూపొందిస్తోన్న ఈ మినీ మల్టీస్టారర్ పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి లవ్ అండ్ యాక్షన్ డ్రామా ఆడియన్స్ ను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి!

 

 

విశాల్ - ఆర్య :



 

వీరిద్దరూ కోలీవుడ్ హీరోలు అయినప్పటికీ తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. వీరిద్దరి సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. గతంలో విశాల్-ఆర్య కలిసి 'వాడు వీడు' అనే సినిమాలో నటించారు. తాజాగా మరోసారి ఈ కాంబినేషన్ ను సెట్స్ పైకి తీసుకొచ్చారు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి 'ఎనిమీ' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇందులో ఆర్య విలన్ గా కనిపిస్తాడని సమాచారం. 

 

మణిరత్నం మల్టీస్టారర్ :



 

దర్శకుడు మణిరత్నం తన కెరీర్ లో మొదటిసారి భారీ బడ్జెట్ మల్టీస్టారర్ ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో విక్రమ్, కార్తీ, అమితాబ్ బచ్చన్, జయం రవి లాంటి హీరోలతో పాటు ఐశ్వర్య రాయ్, త్రిష లాంటి స్టార్ హీరోయిన్లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చాలా కాలంగా ఈ సినిమా చిత్రీకరణ దశలోనే ఉంది. 

 

 

ఈ సినిమాలతో పాటు టాలీవుడ్ లో మరికొన్ని మల్టీస్టారర్ సినిమాలు చర్చల దశల్లో ఉన్నాయి. నాగశౌర్య, బాలకృష్ణ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తుందని అంటున్నారు. శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాను నిర్మించబోతున్నారని సమాచారం. అలానే మలయాళ సినిమా 'డ్రైవింగ్ లైసెన్స్' రీమేక్ లో వెంకటేష్, చరణ్ కలిసి నటిస్తారని టాక్. దీనిపై ఎలాంటి అధికార ప్రకటన లేదు. వీటితో పాటు రాజశేఖర్-గోపీచంద్ కాంబినేషన్ లో శ్రీవాస్ దర్శకుడిగా సినిమా తెరకెక్కించే ఛాన్స్ ఉంది.