నటి రిచా చద్దా ఇటీవల చేసిన ఓ ట్వీట్ వివాదంగా మారింది. దీనిపై టాలీవుడ్ నటులు మంచు విష్ణు, నిఖిల్ సైతం స్పందించారు. ఆమెపై తీవ్రంగా మండిపడ్డారు. 


అసలు వివాదం ఏంటి ?


ఇటీవల ఓ నెటిజన్ ఇండియన్ ఆర్మీ గురించి ఓ ట్వీట్ చేశాడు. అదేంటంటే.. ’’పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ లో కొన్ని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునే విషయంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ఆదేశానికైనా సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. వాళ్ళకి(పాక్ ను ఉద్దేశించి) గట్టి సమాధానం చెప్తాం’’ అని నార్తర్న్‌ ఆర్మీ కమాండర్ లెఫ్ట్ నెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది అన్నట్లుగా ట్వీట్‌ చేశాడు. అయితే ఆ ట్వీట్‌ ను కోట్‌ చేస్తూ రిచా చద్దా "గల్వాన్ సేస్ హాయ్" అంటూ రీట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్ పై నెటిజన్స్ ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఇది చినికి చినికి గాలి వానగా మారడంతో పలువురు సెలబ్రెటీలు కూడా రిచా చద్దా తీరుపై మండిపడ్డారు. 


రిచాకు కౌంటర్ ఇచ్చిన సెలబ్రెటీలు


ఆమె ట్వీట్ చేసిన పోస్ట్‌పై మంచు విష్ణు సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. "అసలు ఆమెకు ఏమైంది? ఇలా ఎలా ఆలోచిస్తారు. సైనికులను మనం గౌరవించాలి. ఇలాంటి వారిని చూస్తే బాధగా ఉంటుంది" అని ట్వీట్ చేశారు. మరో టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ కూడా ఆమె ట్వీట్ పై ఇలా స్పందించారు. "20 మంది భారత సైనికులు గల్వాన్ వద్ద తమ ప్రాణాలు అర్పించారు. దేశాన్ని కాపాడారు. వారి త్యాగం గురించి తలచుకుంటే ఇప్పటికీ కన్నీళ్లు వస్తాయి. రాజకీయాలను పక్కనపెట్టి మన సైన్యం, సాయుధ దళాలను ఎల్లప్పుడూ గౌరవించాలి. వారిని అవమానించకూడదు. రిచా తెలుసుకోండి.. దేశం తర్వాతే ఏదైనా" అంటూ ట్వీట్ చేశారు నిఖిల్. అలాగే పలువురు బాలీవుడ్ నటులు కూడా రిచా తీరుపై మండిపడ్డారు.


బీజేపీ, శివసేన పార్టీలు కూడా రిచా ట్వీట్ పై విమర్శలు గుప్పించాయి. అయితే తర్వాత ఆమె ఆ ట్వీట్ ను డిలీట్ చేసి మరో ట్వీట్ చేసింది. "ఎవర్నీ బాధించాలన్నది నా ఉద్దేశం కాదు. ఎవరినైనా బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి" అని అందులో పేర్కొంది. తన తాత కూడా సైన్యంలో పనిచేశారని చెప్పుకొచ్చింది రిచా. ఆయన కూడా చైనాతో యుద్ధంలో దేశం కోసం పోరాడినట్టు తెలిపింది. ఆయన రక్తమే తనలోనూ ప్రవహిస్తోందని పేర్కొంది రిచా. ఏదేమైనా ప్రస్తుతం రిచా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపిందని చెప్పాలి. మరి ఈ వివాదం ఎటునుంచి ఎటు దారితీస్తుందో చూడాలి.


Also Read : లవ్ టుడే రివ్యూ: ఈ తరం ప్రేమకథ ఆకట్టుకుందా? ప్రదీప్ అరుదైన జాబితాలో చేరాడా?