ఎస్ ఎస్ రాజమౌళి.. ఇప్పుడో అంతర్జాతీయ స్థాయి దర్శకుడు. ‘RRR’ సినిమాకు ఆస్కార్ అవార్డు లభించిన తర్వాత అతడి రేంజి పెరిగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు.  ఆస్కార్ వేడుక కోసం అమెరికాకు వెళ్లిన రాజమౌళి, ఇవాళ(మార్చి 17న) తెల్లవారు జామున హైదరాబాద్ కు చేరుకున్నారు. కొంత విరామం తర్వాత మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కానీ, అప్పుడే జక్కన్న వర్క్ మొదలు పెట్టారు. మహేష్ బాబును కలిసి సినిమా గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇద్దరు కలిసి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


రెస్టారెంట్‌లో గొప్ప భోజనంలా ఉంటుంది- విజయేంద్ర ప్రసాద్


ఇక రాజమౌళి, మహేష్ బాబు సినిమాకు సంబంధించి, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ రాస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్ సినిమా సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది. రాజమౌళితో మహేష్ సినిమా రెస్టారెంట్‌లో గొప్ప భోజనంలా ఉంటుందని తాజాగా వెల్లడించారు. టాప్ యాక్షన్ సీన్లు, భావోద్వేగాలు కలగలిపి ఉన్నఈ చిత్రం రాజమౌళి కెరీర్ లోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని చెప్పారు. ఈ చిత్రం కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని, ఇందులో ఎలాంటి సామాజిక సందేశం ఉండదన్నారు. కథకు కొన్ని ఫినిషింగ్ టచ్‌లు అవసరమని, సినిమాలో కీలక పాత్రలు పోషించే కొన్ని పేర్లు తెరపైకి వస్తున్నాయన్నారు. విజయేంద్ర ప్రసాద్ తాజా వ్యాఖ్యలు ఈ చిత్రం ఓరేంజిలో అంచనాలు పెంచాయి.  విజయేంద్ర ప్రకారం, రాజమౌళి మరిన్ని ఆస్కార్ నామినేషన్లకు సన్నాహాలు ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది.


అక్టోబర్ లో సెట్స్ పైకి వచ్చే అవకాశం!


ఇక రాజమౌళి ఈ చిత్రం కోసం అమెరికా కాస్టింగ్ ఏజెన్సీతో జతకట్టారు. ఈ చిత్రం గ్లోబ్-ట్రాటింగ్ అడ్వెంచర్ డ్రామాగా రూపొందుతున్నట్లు ఇప్పటికే జక్కన్న వెల్లడించారు. దీనిని కెఎల్ నారాయణ నిర్మించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ గురించి పెద్దగా వివరాలు తెలియకపోయినా, మహేష్ ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. ‘RRR’ లాంటి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు సమాచారం.  దసరా సందర్భంగా అక్టోబర్‌లో ఈ సినిమా సెట్స్‌ పైకి రానుందని సమాచారం.  


#SSMB29 పిక్ వైరల్


ఇక తాజాగా మహేష్ బాబు, రాజమౌళి కలిసి ఉన్న ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో  మహేష్ ఏదో చెబుతుంటే రాజమౌళి  వింటున్నట్టుగా ఉంది.  వారి సినిమా గురించే మాట్లాడుకుంటున్నట్లు సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ ఫోటో ఎక్కడ తీసుకున్నారు? ఎప్పుడు తీసుకున్నారు? అంటూ ఆరా తీస్తున్నారు. ఇవాళే కలిశారు అంటూ మరికొంత మంది కామెంటస్ పెడుతున్నారు. అమెరికా నుంచి వచ్చిన జక్కన్న మహేష్ ను కలినట్లు చాలా మంది చెప్తున్నారు. యాక్షన్‌ అడ్వెంచర్‌ నేపథ్యంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథగా #SSMB29 తెరకెక్కనుంది.


Read Also: ఆస్కార్‌తో హైదరాబాద్‌ చేరుకున్న ‘RRR’ టీమ్, ఘన స్వాగతం పలికిన అభిమానులు