సినిమా కబుర్లు... లేదంటే వ్యక్తిగత జీవితం... స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఎప్పుడూ ప్రేక్షకులు, పరిశ్రమ ప్రముఖుల నోళ్ళల్లో ఉంటారు. కొన్ని రోజుల క్రితం వరకు అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) తో ఎందుకు వేరు పడ్డారో అని చర్చ జరిగింది. ఇప్పుడు ఆ విషయం మరుగున పడింది. 


ఇప్పుడు సమంత ఆరోగ్య పరిస్థితి (Samantha Health Condition) గురించి ఎక్కువ  చర్చ జరుగుతోంది. ఈ మధ్యే తనకు మైయోసిటిస్ ఉందని ఆవిడ వెల్లడించారు. ఆ వ్యాధికి సంబంధించి చికిత్స తీసుకుంటున్నారు. అందువల్ల, విజయ్ దేవరకొండ ఖాళీగా ఉండాల్సి వస్తోందని ఇండస్ట్రీ గుసగుస. 


'ఖుషి' షూటింగ్ వెనక్కి!
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కు జంటగా సమంత నటిస్తున్న సినిమా 'ఖుషి' (Khushi Movie). ఆల్రెడీ కొంత షూటింగ్ చేశారు. ఓసారి కశ్మీర్ కూడా వెళ్లి వచ్చారు. అక్కడ యూనిట్ సభ్యుల సమక్షంలో సమంత బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. అయితే... ఆ సినిమా షూటింగ్ అనుకున్న ప్రకారం జరగడం లేదని తెలుస్తోంది. సమంత ఆరోగ్య పరిస్థితి కారణంగా షెడ్యూల్స్ వాయిదా పడ్డాయట! గతంలో ఇతర సినిమా షూటింగులతో సమంత బిజీగా ఉండటంతో కూడా ఓ షెడ్యూల్ వెనక్కి జరిపారని టాక్. సమంత ఆరోగ్యం మెరుగు పడిన తర్వాత కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 


సినిమా విడుదల ఫిబ్రవరికి వాయిదా! 
ముందుగా ప్లాన్ చేసిన ప్రకారం కాకుండా షూటింగ్ వెనక్కి జరిగితే... షెడ్యూల్స్ వాయిదా పడితే... సినిమా విడుదల కూడా వెనక్కి వెళుతుంది! 'ఖుషి' విషయంలో అదే జరుగుతోందట. తొలుత ఈ సినిమాను డిసెంబర్ 23న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఆ తేదీకి ప్రేక్షకుల ముందుకు రావడం కష్టం. ఎందుకంటే... ఇంకా షూటింగ్ చాలా బ్యాలన్స్ ఉంది. అందుకని, ఫిబ్రవరిలో విడుదల చేస్తే ఎలా ఉంటుందని అనుకున్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయనున్నట్టు విజయ్ దేవరకొండ చెప్పారు. 


ప్రస్తుత పరిస్థితులు చూస్తే... ఫిబ్రవరిలో కూడా సినిమా విడుదల కావడం కష్టమేనని గుసగుసలు వినబడుతున్నాయి. వచ్చే ఏడాది వేసవికి విడుదల చేయాలనుకుంటున్నారట. 'లైగర్' డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ (Vijay Devarakonda New Movie Release Date) తప్పకుండా విజయం అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేరే సినిమాలు పక్కన పెట్టి మరీ ఆయన 'ఖుషి' మీద కాన్సంట్రేషన్ చేశారు. యువతలో ఆయనకు క్రేజ్ ఉంది. వాళ్ళకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కనుక... ఆ సీజన్ లో సినిమాను విడుదల చేస్తే వసూళ్ళు కూడా బావుంటాయని అంచనా వేస్తున్నారట. 


Also Read : రష్మీని తీసేశారు - 'జబర్దస్త్'కు కొత్త యాంకర్ వచ్చిందోయ్






శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి 'ఖుషి' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనిని తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు జయరామ్, మరాఠీ నటుడు సచిన్ ఖేడేకర్, ఇంకా మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఫైట్స్: పీటర్ హెయిన్, సంగీత దర్శకుడు : హిషామ్ అబ్దుల్ వాహాబ్, సీఈవో : చెర్రీ, ఛాయాగ్రహణం: జి. మురళి.