మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ 'టైగర్ నాగేశ్వరావు'(Tiger Nageshwararao) ప్రస్తుతం ఓటీటీలో అదరగొడుతోంది. అమెజాన్ ప్రైమ్(Amazon Prime) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఏకంగా రజనీకాంత్ 'జైలర్'(Jailer) ని సైతం వెనక్కి నెట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. డీటెయిల్స్ లోకి వెళ్తే.. రవితేజ కెరియర్ లో తొలి పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో రూపొందింది. 'టైగర్ నాగేశ్వరావు' మూవీ స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.


రవితేజ సరసన నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటించగా.. రేణు దేశాయ్, అనుపమ్ కేర్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల నడుమ దసరా కానుకగా అక్టోబర్ 20 విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంది. మొదటి వారం రోజులు సినిమా నిడివి ఎక్కువ ఉందని, సెకండ్ హాఫ్ సాగదీతగా ఉందని కామెంట్స్ రావడంతో మూవీ టీం సినిమా నిడివిని తగ్గించింది. దాంతో ఈ చిత్రానికి డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి. ముఖ్యంగా సినిమాలో రవితేజ యాక్టింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కానీ నెరేషన్ స్లోగా ఉండటంతో అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.


థియేట్రికల్ రన్ తర్వాత ఇటీవల ఓటీటీ లోకి వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందనను కనబరిచింది. నవంబర్ 17 నుంచి ఆమెజాన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన 'టైగర్ నాగేశ్వరరావు' రిలీజ్ అయిన దగ్గర్నుంచి నంబర్ వన్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్పటికే విడుదలైన 'జైలర్' వంటి బ్లాక్ బస్టర్ సినిమాను సైతం వెనక్కి నెట్టి టాప్ వన్ ప్లేస్ లో నిలిచింది. ఇందుకు సంబంధించిన వివరాలను అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది. వీటిలో 'టైగర్ నాగేశ్వరావు' మూవీ నంబర్ వన్ ప్లేస్ లో ఉండగా 'ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ' మూవీ సెకండ్ ప్లేస్ లో సొంతం చేసుకుంది.


మూడో స్థానంలో 'పిప్పా' నాలుగో స్థానంలో రజనీకాంత్ 'జైలర్' ఐదో స్థానంలో 'రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని' ఉన్నాయి. ఈ సూపర్ హిట్ సినిమాలు అన్నిటినీ వెనక్కినట్టు 'టైగర్ నాగేశ్వరరావు' టాప్ వన్ ప్లేస్ ని సొంతం చేసుకోవడంతో మాస్ మహారాజా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక రవితేజ ప్రస్తుతం 'ఈగల్'(Eagle) అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్ భారీ రెస్పాన్స్ అందుకుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీలో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read : చిత్ర సీమలో విషాదం - గుండెపోటుతో 'ధూమ్' డైరెక్టర్ మృతి!