టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, కామినేని ఉపాసన పెళ్లి దశాబ్దం క్రితం జరిగింది. జూన్ 14, 2012 నాడు హైదరాబాద్ లో అట్టహాసంగా వీరి వివాహం జరిగింది. పెళ్లైన 10 ఏండ్లకు ఈ దంపతులిద్దరూ పేరెంట్స్ కాబోతున్నట్లు ప్రకటించారు. ఉపాసన, రామ్ త్వరలో బిడ్డకు జన్మనివ్వబోతున్నారని తొలుత మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. గత ఏడాది(2022) డిసెంబర్ లో ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆ ప్రకటనతో కొణిదెల, కామినేని కుటుంబ సభ్యులతో పాటు మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. చెర్రీ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

  


ప్రెగ్నెన్సీ గురించి తెలియగానే రామ్ చరణ్ తొలి స్పందన


తాను ప్రెగ్నెన్సీ అనే విషయాన్ని రామ్ చరణ్ కు చెప్పగానే తను ఒకే ఒక్క మాట చెప్పారని వెల్లడించింది ఉపాసన. ప్రశాంతంగా ఉండాలని సూచించారు. "నేను ప్రెగ్నెంట్ అని అనుకుంటున్నాను అని చెప్పగానే.. ఎక్కువగా ఎగ్జైట్ కాకు,  ప్రశాంతంగా ఉండు” అని చెప్పినట్లు వివరించింది. ఎందుకైనా మంచిదని మరోసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి ధృవీకరించుకున్నట్లు వెల్లడించింది. అప్పుడు అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకున్నట్లు వివరించింది. “నేను రామ్‌ని ఎక్కువగా ఇష్టపడతాను. ఆరాధిస్తాను. అతడు నా జీవితంలో ప్రశాంతతకు మూల కారణం. నన్ను నిత్యం ఎంతో ఉత్సాహంగా ఉండేలా చూసుకుంటాడు. నా భావాలను తను పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటాడు. మేము ఆర్థికంగా స్థిరపడిన తర్వాతే పిల్లలు కనాలి అనుకున్నాం. అలాగే చేస్తున్నాం” అని వెల్లడించింది.


ఉపాసన డెలివరీ ఎప్పుడు? ఎక్కడంటే?


తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఉపాసన, తన డెలివరీ డేట్ గురించి వివరించింది. జూలై నెలలోనే డెలివరీ డేట్ ఇచ్చినట్లు చెప్పింది. అయితే, డెలివరీ అనే జులై 16-22 మధ్యలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అపోలో ఆసుపత్రిలోనే ఆమె ప్రసవం జరగనుంది. అయితే, పుట్టబోయే బిడ్డతో పాటు ఫ్యామిలీ ఆరోగ్యం కోసం అత్యాధునిక పద్ధతిలో స్టెమ్ సెల్ బ్యాంకింగ్ విధానం ఎంచుకున్నట్లు తాజాగా ఉపాసన తెలిపింది. ఇందుకోసం స్టెమ్ సైట్ ఇండియాను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలిపింది. స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అంటే బొడ్డు తాడు దాచుకోవడం. భవిష్యత్తులో బిడ్డకు ఏవైనా ఆనారోగ్య సమస్యలు వస్తే దీని ద్వారా నయం చేసే అవకాశం ఉంటుంది. ఈ విషయం పట్ల అందరికీ అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.  


అపోలో హాస్పిటల్ పనుల్లో ఉపాసన, సినిమాలతో చెర్రీ బిజీ


ఉపాసన  అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు. శోభన, అనిల్ కామినేని ముద్దుల కూతురు. ప్రస్తుతం ఉపాసన అపోలో ఛారిటీకి వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం అపోలో హాస్పిటల్ వ్యవహారల్లో ఉపాసన బిజీగా ఉంది.. రామ్ చరణ్ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తోంది.






Read Also:ప్రభాస్ మంచి మనసు - ‘సలార్‘ సిబ్బందికి అదిరిపోయే గిఫ్ట్