తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్‘ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో మంచి జోష్ లో ఉన్నారు. అదే ఊపులో తన కెరీర్ లో 170వ సినిమా చేస్తున్నారు. 'జైభీమ్' ద‌ర్శ‌కుడు టీజే జ్ఞాన్ వేల్ ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్నారు.  ఈ సినిమాకు ‘Thalaivar 170‘ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ సినిమాలో సౌత్ నుంచి నార్త్ వరకు పలువురు స్టార్ హీరోలు కీలక పాత్రలు పోషించబోతున్నారు. తెలుగు నుంచి రానా ద‌గ్గుబాటి ఈ మూవీలో నటిస్తుండగా, మ‌ళ‌యాళం నుంచి ఫ‌హాద్ ఫాజిల్‌ కనిపించనున్నారు. ఈ చిత్రంలో మంజూ వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నుంచి లెజెండ‌రీ న‌టుడు అమితాబ‌చ్చ‌న్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు.  పలువురు అగ్ర తారలు ఈ సినిమాలో భాగస్వామ్యం కావడంతో భారీగా అంచనాలు నెలకొన్నాయి.


‘Thalaivar 170‘ సెట్స్ లో రజనీ, బిగ్ బీ


తాజాగా ఈ సినిమా షూటింగ్ లో బిగ్ బీ అమితాబ‌చ్చ‌న్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెట్స్ లో రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి ఉన్న ఫోటోను చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ విడుదల చేసింది. ఈ ఫోటోలో అమితాబ్ చైర్ లో కూర్చొని  ఫోన్ చూస్తుండగా, రజనీకాంత్ ఆయన భుజలాపై చేతులు వేసి ఏదో చెప్తున్నట్లుగా కనిపిస్తోంది. ఒకే ఫ్రేమ్ లో దిగ్గజ నటులను చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ ముంబైలో కొనసాగింది. అక్కడే బిగ్ బీ ఈ షూట్ లో జాయిన్ అయ్యారు.






రజనీ మూవీలో అమితాబ్ కీలక పాత్ర


రజనీకాంత్ ప్రతిష్టాత్మక చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌ను చేయ‌బోతున్నారు. దాదాపు మూడు ద‌శాబ్దాల త‌ర్వాత ర‌జ‌నీకాంత్‌, అమితాబ్‌బ‌చ్చ‌న్ కలిసి ఈ సినిమాలో నటించబోతున్నారు ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో రజనీ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. సోష‌ల్ మెసేజ్‌కు క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌ను మేళ‌విస్తూ తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందించ‌బోతున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మించ‌నున్న‌ది. వ‌చ్చే ఏడాది వేస‌విలో ఈ పాన్ ఇండియ‌న్ మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్  స‌న్నాహాలు చేస్తున్నారు.


32 ఏండ్ల క్రితం కలిసి నటించిన బిగ్ బీ, రజనీ  


ఇక వీరిద్దరు కలిసి 32 ఏండ్ల క్రితం సినిమా చేశారు.  ముకుల్ ఎస్ ఆనంద్ రూపొందించిన ‘హమ్’ చిత్రంలో కలిసి నటించారు. అంతకు ముందు  'అంధా కానూన్', 'గెరాఫ్తార్'  లాంటి హిట్ చిత్రాలు చేశారు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్  రిభు దాస్‌గుప్తా దర్శకత్వం వహిస్తున్న 'సెక్షన్ 84' చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.  ఈ సినిమా ఇంటెన్స్ కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందుతోంది. అటు నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబోలో వస్తున్న ‘Kalki 2898 AD’లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. 


Read Also: 'కన్నప్ప' షూటింగ్‌లో ప్రమాదం, మంచు విష్ణుకు గాయాలు!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial