సుమారు 8 సంవత్సరాల క్రితం ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో తెలుగులోకి హీరోయిన్ గా అడుగు పెట్టింది  మాళవికా నాయర్‌. తొలి సినిమాతోనే చక్కటి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో ఆనంది పాత్రలో ఒదిగిపోయి నటించింది. తొలి హిట్ తో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. ఇప్పుటి ఈ ముద్దుగుమ్మ పలు సినిమాల్లో నటించినా ఒక్కటంటే ఒక్కటి కూడా సాలిడ్ హిట్ తగల్లేదు. స్టార్ హీరోయిన్ కాలేదు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో సెకెండ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా చేసింది. ప్రస్తుతం ఈమె నాగశౌర్యతో కలిసి ఓ సినిమా చేస్తోంది. ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ పేరుతో  ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీనివాస్‌ అవసరాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై మాళవిక గంపెడు ఆశలు పెట్టుకుంది.


ముద్దుసీన్లతో నటించేందుకు ఇబ్బంది పడలేదు- మాళవిక


ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, ప్రచార వీడియోలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార వీడియోల్లో మాళవిక ముద్దు సీన్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. తొలిసారి ఆమె బోల్డ్ సీన్లు చేయడంతో అందరూ షాక్ అయ్యారు.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవిక, ముద్దు సీన్లపై స్పందించింది. ఈ సినిమాలో బోల్డ్ సీన్లలో నటించడం తనకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదని చెప్పింది. ఎందుకంటే, అవి సినిమాలో కావాలని పెట్టలేదని, కథలో భాగంగానే ఉన్నాయని వెల్లడించింది.  ముద్దు సీన్ కథకు చాలా అవసరం కాబట్టే నటించాల్సి వచ్చిందని చెప్పింది.  నిజానికి  బోల్డ్ సీన్ అంటే హీరోయిన్లకు కాస్తా కష్టంగానే ఫీలవుతారని, తాను మాత్రం ఆ సీన్లలో నటించడానికి పెద్దగా ఇబ్బంది పడలేదని మాళవిక చెప్పింది.


18 ఏళ్ల నుంచి 28 ఏళ్ల వరకు జంట ప్రేమ ప్రయాణం  


ఇక ఈ సినిమా గురించి కూడా ఈ మద్దుగుమ్మ పలు కీలక విషయాలు వెల్లడించింది. సాధారణ ప్రేమ కథా చిత్రాలతో పోల్చితే ఈ సినిమా చాలా భిన్నంగా ఉంటుందని వెల్లడించింది. ఈ సినిమాలో అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయని తెలిపింది.  ఈ మూవీలో తాను అనుపమ అనే క్యారెక్టర్ చేస్తున్నానని చెప్పింది. తనకు ఈ పాత్ర బాగా సూటైనట్లు వివరించింది. తనను తాను నటిగా నిరూపించుకునే పాత్రలో నటించడం సంతోషంగా ఉందని చెప్పింది.  ఇప్పటి వరకు నటిగా ఏం చేయాలో అంతవరకే చేశానని, కానీ, ఈ సినిమా తన హృదయానికి నచ్చినట్లు చెప్పింది.  18 ఏళ్ల నుంచి 28 ఏళ్ల వరకు ఓ జంట ప్రేమ ప్రయాణం ఈ సినిమాలో చూపిస్తారని వెల్లడించింది.  ప్రేమ, ద్వేషం, హాస్యం సహా పలు రకాల  భావోద్వేగాలు ఇందులో ఉంటాయని తెలిపింది.


ఏడేళ్ల తర్వాత మెగా ఫోన్ పట్టిన అవసరాల


ఇక ఏడేళ్ల తర్వాత శ్రీనివాస్‌ అవసరాల ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమాతో మళ్లీ మెగాఫోన్ పట్టారు. నాగశౌర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మార్చి 17న రిలీజ్‌ కానుంది. రోమ్‌ కామ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ‌, దాసరి ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లపై టీ.జి విశ్వప్రసాద్‌, పద్మజ దాసరి సంయుక్తంగా  నిర్మించారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించిన ఈ సినిమాకి ఇప్పటివరకు విడుదలైన పాటలన్నీ మంచి హిట్ అయ్యాయి.