ధనుష్ లేటెస్ట్ సినిమా 'వాతి (తమిళం) / సార్ (తెలుగు)' పెయిడ్ ప్రీమియర్స్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుల్లో ప్రారంభం అయ్యాయి. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.


సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్‌ను అందుకుంటుంది. అయితే సినిమా విడుదలకు ఒక రోజు ముందు ‘సార్‌‘కు సమస్య తలెత్తింది. సినిమా టైటిల్‌ను ‘వాతి’ నుండి ‘వాతియార్’గా మార్చాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు పుదుచ్చేరి స్టేట్ టీచర్ ఫెడరేషన్ పిటీషన్ రాస్తూ అభ్యర్థించినట్లు వార్తలు వస్తున్నాయి.


'వాతి' అనే పదం ఉపాధ్యాయులను అత్యంత కించపరిచేలా ఉందని పిటిషన్‌లో ప్రస్తావించారు. అయితే ఈ చిత్రం ‘వాతి’ అనే టైటిల్‌తోనే థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటి వరకు ఈ విషయంపై ఎటువంటి అధికారిక చర్యలు తీసుకోలేదు.


ధనుష్ హీరోగా నటిస్తున్న ‘సార్’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కూడా ధనుష్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నాకు తెలుగు అంతగా తెలీదు. కొంచెం కొంచెం అర్థం అవుతుంది. కానీ పూర్తిగా తెలియదు. సాధారణంగా తెలుగు తెలియకపోతే ఇంగ్లిష్‌లో మాట్లాడతారు. కానీ పక్కనే ఉన్న రాష్ట్రం కాబట్టి తమిళంలో మాట్లాడుతున్నాను. మీకు తమిళం అర్థం అవుతుంది అనుకుంటున్నాను. ఇది నాకు చాలా స్పెషల్ డే. నా మొదటి డైరెక్ట్ తెలుగు సినిమా ఇదే. మీ అందర్నీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది.’


(తమిళంలో మాట్లాడుతూ)‘ఇంతకుముందు చూస్తే తమిళ సినిమా, తెలుగు సినిమా, మలయాళం సినిమా, కన్నడ సినిమా అని వేర్వేరుగా ఉండేవి. ఇప్పుడు అందరూ అన్ని సినిమాలూ చూస్తున్నారు. అంతా ఒకే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలా అయింది. అది చాలా మంచిది. ఇప్పుడు మీరందరూ తమిళ సినిమా చూస్తున్నారు. మేమంతా తెలుగు సినిమా చూస్తున్నాం. ఈ మార్పు చాలా బాగుంది. ఇప్పుడు నేను నటించిన తెలుగు సినిమా ప్రమోట్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. నాకు చాలా సంతోషంగా ఉంది.’


‘ఈ సినిమా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ బోర్డర్‌లోని ఒక గ్రామంలో జరిగే కథ. రెండు సంస్కృతులు కలిసి ఉన్నాయి. రెండు భాషలూ కలిసి ఉన్నాయి. అది చూడటానికి చాలా అందంగా ఉంది. మనమంతా ఎంత పక్కపక్కనే ఉన్నామో అప్పుడు అర్థం అయింది. అది చాలా అద్భుతమైన విషయం. అలాంటి కథలో నటించినందుకు నాకు సంతోషంగా ఉంది.’ అన్నారు. ఆ తర్వాత ఆడియన్స్ అర్థం కావడం లేదనడంతో మళ్లీ ఇంగ్లిష్‌లో మాట్లాడారు.


‘నేను వెంకీ అట్లూరికి థ్యాంక్స్ చెప్పాలి. వంశీ, త్రివిక్రమ్, యువరాజ్ (డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ), సంయుక్త అందరికీ చాలా థ్యాంక్స్.  హైపర్ ఆదికి ఇంత మంది ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలీదు. అతను చాలా అద్భుతంగా మాట్లాడాడు. అందరి తరఫున తనే మాట్లాడాడు. ఆ తర్వాత మాట్లాడటానికి కూడా పెద్దగా ఏమీ లేదు. అందరికీ చాలా థ్యాంక్స్.’ అంటూ ముగించాడు. ఆ తర్వాత చివర్లో ‘రఘువరన్ బీటెక్’ సినిమాలోని అమూల్ బేబీ డైలాగ్ చెప్పారు. ‘సార్’ సినిమాలో పెద్ద హిట్ అయిన మాస్టారు పాటను తెలుగు, తమిళ భాషల్లో పాడి అభిమానులను అలరించారు.