మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. స్వతహాగా చిరంజీవికి వీరాభిమాని అయిన కె.ఎస్. రవీంద్ర(బాబీ) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటోంది. మరోవైపు ప్రమోషన్స్ ను కూడా వేగవంతం చేసింది మూవీ టీమ్. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. మూవీలో బాస్ పార్టీ సాంగ్ ను ఈ నెల 23న సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆ పాటకు సంబంధించి ఓ ప్రోమోను కూడా మంగళవారం విడుదల చేశారు. అయితే ఆ పాటను అన్నయ్య చిరంజీవితో కలసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీక్షించారు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలు, అటు రాజకీయాలతో బిజీగా ఉంటున్నారు. అయితే ఆయన తాజాగా ‘వాల్తేరు వీరయ్య’ సెట్ లో సందడి చేశారు. ఈ సందర్భంగా బాస్ పార్టీ పాటను దర్శకుడు బాబీ పవన్ కళ్యాణ్ కు చూపించారట. ఈ పాట పవన్ కళ్యాణ్ కు బాగా నచ్చిందని బాబీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవితో కలసి చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. 


ప్రస్తుతం 'వాల్తేరు వీరయ్య' నుంచి వస్తోన్న ఈ మొదటి సాంగ్ కోసం మెగా అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇందులో మరో సర్ప్రైజ్ ఏంటంటే.. ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా చిరుతో కలసి స్టెప్పులేసింది. మాస్ పల్స్ తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు సంగీతం అందిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో కూడా చిరంజీవికి దేవి హిట్ సాంగ్స్ ను అందించారు. అదే తరహాలో మాస్ బీట్స్ తో ఈ సినిమాకు సంగీతాన్ని అందించారట డిఎస్పీ. ఈ పాటను కూడా దేవిశ్రీ ప్రసాద్ రాశాడని టాక్. ఇక ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. 


అన్ని కమర్షియల్ హంగులు కలగలిపిన మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా ఈ సినిమా రూపొందిస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో మాస్ మహరాజ్ రవితేజ నటించనున్నారు. చిరంజీవి, రవితేజ కలసి నటించి చాలా ఏళ్ళు అయింది. ఎప్పుడో 'అన్నయ్య' సినిమాలో చిరుతో కలసి నటించారు రవితేజ. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. ఇప్పటికే వింటేజ్ చిరంజీవి మాస్ లుక్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. ఇక త్వరలోనే రవితేజ లుక్ ను కూడా రివీల్ చేయనున్నారు మూవీ టీమ్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ మెరవనుంది. వచ్చే సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.



Also Read: అవన్నీ ఫేక్ వార్తలు, వాళ్ళని ఊరికే వదలకూడదు: హీరో శ్రీకాంత్