జనవరి 25వ తేదీన విడుదలైన బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ సినిమా ‘పఠాన్’ బాలీవుడ్‌లో ఎన్నో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. గత రెండు సంవత్సరాలుగా బాలీవుడ్ సినిమా మొత్తం అతలాకుతలం అవుతుండగా, బాలీవుడ్ బాద్‌షా అని చెప్పుకునే షారుక్ తిరిగి సినీ పరిశ్రమను గాడిలోకి తీసుకువచ్చాడు.


2018 సంవత్సరంలో విడుదల అయిన రొమాంటిక్ కామెడీ ‘జీరో’ కమర్షియల్‌గా విఫలం అయ్యాక షారుఖ్ ఖాన్ సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నాడు. నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన పఠాన్ ఇప్పుడు బాలీవుడ్‌లో రికార్డులు బద్దలు కొడుతోంది. కేవలం ఐదు రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సెన్సేషనల్ రికార్డు సృష్టించింది. బుకింగ్స్ ఊహించిన స్థాయిలో జరిగితే రూ.550 కోట్ల మార్కును కూడా దాటవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.


ఒకే రోజు బాలీవుడ్‌లో రూ.70 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించిన ఏకైక సినిమా ఇదే. ఇంతవరకు ఏ సినిమా కనీసం రూ.55 కోట్ల మార్కును కూడా దాటలేదు. సినిమా వచ్చిన ఐదో రోజు కూడా రూ.60 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. రూ.250 కోట్ల బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెరకెక్కింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది.


ఈ ప్రాజెక్టులో దీపికా పదుకొణె హీరోయిన్ గా చేసింది. జాన్ అబ్రహం కీలక పాత్రలో నటించారు. ఓ ఉగ్ర సంస్థ భారత్ మీద అణు దాడికి ప్లాన్ చేసినప్పుడు, తన దేశాన్ని కాపాడుకునేందుకు ఓ సైనికుడు చేసే పోరాటమే ఈ సినిమాలోని కథ. ఈ మిషన్ లో పాల్గొనే షారుఖ్ చుట్టూ కథంతా తిరుగుతుంది. సదరు ఉగ్రవాద సంస్థకు జాన్ అబ్రహం నాయకత్వం వహిస్తాడు. అతడు చేసే అణు దాడి ప్లాన్ ను షారుఖ్ ఎలా తిప్పికొట్టాడు అనేదే స్టోరీ. ఇక ఈ సినిమాలో నటనకు గాను ఆయా నటీనటులు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ అందుకున్నారు.  ఇంతకీ ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. 


బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటీమణులు దీపికా పదుకొణె ఒకరు. ఈమె ప్రతి సినిమాకు రూ. 10 కోట్లకు పైనే తీసుకుంటుంది. ఇక ‘పఠాన్’ సినిమాకు గాను తను ఏకంగా రూ. 15 కోట్లు వసూలు చేసింది. ఉగ్రవాద సంస్థ అణుదాడిని తిప్పికొట్టడంలో ‘పఠాన్’కు సాయం చేసే  RAW ఏజెంట్ పాత్రను పదుకొణె పోషించింది. పదుకొణె కొన్ని యాక్షన్ సన్నివేశాల్లోనూ నటించింది. ఈ సీన్లు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి.


ఈ సినిమాలో జాన్ అబ్రహం పవర్ ఫుల్ నెగెటివ్ రోల్ పోషించాడు. ఉగ్రవాద సంస్థను తనే లీడ్ చేస్తుంటాడు. భారత్ పై అణుదాడికి ఫ్లాన్ చేస్తాడు. ఈ సినిమాకు గాను తను రూ. 20 కోట్లు తీసుకున్నాడు.‘వార్’, ‘బ్యాంగ్ బ్యాంగ్!’, ‘బచ్నా ఏ హసీనో’ సహా పలు హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాను తెరకెక్కించారు.  స్పై థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సినిమాలో నటించిన నటీనటులు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోగా, దర్శకుడు ఆనంద్ సైతం రూ.6 కోట్లు అందుకున్నారు.
 
చాలా గ్యాప్ తర్వాత ‘పఠాన్’తో వెండితెరపై ఆకట్టుకున్న షారుఖ్ ఖాన్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. అదిరిపోయే యాక్షన్ సీన్లతో అదుర్స్ అనిపించారు. భారత్ పై న్యూక్లియర్ దాడిని ఎదుర్కొనేందుకు ఆయన చేసే ప్రయత్నాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇక ఈ సినిమాలో నటనకు గాను షారుఖ్ ఏకంగా రూ. 100 కోట్లు తీసుకున్నారు. ఆయన కెరీర్ లో తీసుకున్న అతి పెద్ద రెమ్యునరేషన్ ఇదే కావడం విశేషం.