ఉక్రెయిన్ - రష్యా యుద్ధంలో చిక్కుకున్న విదేశీయులంతా ఎలాగోలా స్వదేశాలకు చేరుకుంటున్నారు. ఎంతో మంది భారతీయులు కూడా ‘ఆపరేషన్ గంగా’లో భాగం దేశానికి చేరుకున్నారు. కానీ ఒక తెలుగు వ్యక్తి మాత్రం తాను రానని ఉక్రెయిన్లోనే ఉండిపోయాడు. ‘ఈ దేశంలో నేను ఇరుక్కుపోలేదు, నాకు నచ్చే ఉంటున్నా’ అని చెబుతున్నారు. అతని పేరు గిరికుమార్ పాటిల్. అక్కడ ఆయన వైద్యుడిగా పనిచేస్తున్నాడు. తూర్పు ఉక్రెయిన్లోని సెవెరోదన్యస్క్ అనే చిన్న పట్టణంలో నివసిస్తున్నాడాయన. ఇంతకీ అతను ఉక్రెయిన్ నుంచి రాకపోవడానికి కారణమేంటో తెలుసా? అతడు పెంచుకుంటున్న పులిపిల్లలు. ఆ రెండింటినీ యుద్ధ భూమిలో తాను ఒక్కడినీ రాలేనని తెగేసి చెప్పాడాయన. వాటితో పాటూ తన ఇంటి బేస్ మెంట్లో తలదాచుకుంటున్నాడు.  ఆ రెండింటినీ ఆయన 27 లక్షల రూపాయలు వెచ్చించి కొన్నాడు. 2007 నుంచి ఆయన ఉక్రెయిన్లోనే నివసిస్తున్నారు. కాగా పులులను పెంచాలన్న కోరిక కలిగింది హీరో చిరంజీవి వలనే అని చెప్పారాయన. ‘నా అభిమాన నటుడు చిరంజీవి చిరుత పులితో నటించడం చూసినప్పటి నుంచి పులులంటే ఇష్టం పెరిగింది’ అని మీడియాతో చెప్పాడు గిరి కుమార్. ఆ విషయం మీడియా ద్వారానే చిరంజీవి వరకు చేరింది. ఆయన ట్విట్టర్లో స్పందించారు. 


నిజంగా ఆశ్చర్యంగా ఉంది...
చిరు ట్విటర్లో ‘డియర్ గిరికుమార్... నీకు పులుపై ప్రేమ కలగడానికి స్పూర్తి నేనేనని తెలిసింది. అది గుండెను తాకింది. వాటిని యుద్ధభూమిలో వదిలి రాలేక, మీరు కూడా అక్కడే ఉండిపోవడం నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం. ఆ జంతువుల పట్ల మీ ప్రేమ, వాత్సల్యం ఎంతో ప్రశంసనీయం. మీరు క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. యుద్ధం త్వరగా ముగిసి అక్కడ శాంతి వికసించాలని ప్రార్థిస్తున్నాను. యుద్ధం ముగిసేవరకు మీరూ, మీ జంతువులు సురక్షితంగా ఉండాలి’ అని రాసుకొచ్చారు. దీన్ని గిరికుమార్ చూశారో లేదో తెలియదు కానీ,చూస్తే మాత్రం ఆనందం పట్టలేకపోవచ్చు. తన అభిమాన నటుడే తన క్షేమం కోసం ప్రార్థిస్తున్నానని చెప్పడం గిరికుమార్‌ను సంతోషంలో ముంచెత్తడం ఖాయం. గిరికుమార్ కు  ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. దాని పేరు ‘జాగ్వార్ కుమార్ తెలుగు’.






Also read: లవ్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పిన ప్రభాస్! ఆ అమ్మాయి ఎవరు?


Aslo read: మరో హీరో పెళ్లి పీటలెక్కబోతున్నాడా? అక్కినేని వారి ఇంట పెళ్లి బాజాలు?