కోలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమా 'పొన్నియిన్ సెల్వన్'(Ponniyin Selvan). సెప్టెంబర్ 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు మణిరత్నం(Maniratnam) డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఈ సినిమా తెరకెక్కించడానికి ఆయన చాలా కష్టపడ్డారు. లైకా ప్రొడక్షన్స్ సహాయంతో తన సొంత బ్యానర్ లో ఈ సినిమాను నిర్మించారు మణిరత్నం. ఈ సినిమాలో విక్రమ్, కార్తి, ఐశ్వర్యారాయ్, త్రిష ఇలా చాలా మంది పేరున్న నటీనటులు కనిపించబోతున్నారు. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.


తాజాగా ఈ సినిమా నుంచి ఓ లిరికల్ వీడియోను విడుదల చేశారు. దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ మీట్ లో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు మణిరత్నం. ఈ సందర్భంగా చిరంజీవికి థాంక్స్ చెప్పారు మణిరత్నం. కానీ ఆయనకు థాంక్స్ ఎందుకు చెబుతున్నానో.. ఇప్పుడే చెప్పనని సస్పెన్స్ లో పెట్టేశారు. బహుశా చిరంజీవి ఈ సినిమా కోసం వాయిస్ ఓవర్ ఇచ్చి ఉండొచ్చని టాక్. 


ఇదే సమయంలో మణిరత్నం.. రాజమౌళికి కూడా థాంక్స్ చెప్పారు. రాజమౌళి కారణంగానే ఇలాంటి సినిమాలు చేయడానికి ధైర్యం వచ్చిందని అన్నారు. ప్రస్తుతం మణిరత్నం చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 



నేటివిటీ ఫ్యాక్టర్ ఎఫెక్ట్ చేస్తుందా..?


ఇదిలా ఉండగా.. ఈ సినిమా కథ తమిళ నేటివిటీకి సంబంధించినది కావడంతో మిగిలిన భాషల్లో ఎంతవరకు వర్కవుట్ అవుతుందా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఒకప్పుడు తమిళనాడు సహా పలు ప్రాంతాలను ఏలిన చోళ రాజుల కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 


తమిళ ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం అక్కడి నేటివిటీని కాస్త జోడించి సినిమాలు తీస్తుంటారు కోలీవుడ్ దర్శకులు. దీని వలన అక్కడ ప్రేక్షకులకు సినిమా రుచించినా.. వేరే రాష్ట్రాలకు చెందిన ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోతున్నారు. నేటివిటీ ఫ్యాక్టర్ అనేది శృతి మించకుండా చూసుకోవాల్సి ఉంటుంది. కొంతలో కొంతైనా.. స్థానిక ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా మార్చాల్సి ఉంటుంది. 'బాహుబలి' లాంటి సినిమా అంత పెద్ద హిట్ అయిందంటే దానికి కారణం.. అది కల్పిత కథ కాబట్టి దానికి పరిమితులు ఉండవు. దీంతో అన్ని ప్రాంతాల ప్రజలకు ఈ సినిమా కనెక్ట్ అయింది.


'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రాంతీయ కథ అయినప్పటికీ.. అందరికీ రీచ్ అయ్యేలా సినిమా తీశారు రాజమౌళి. పైగా టైటిల్స్ కూడా అన్ని భాషలకు తగ్గట్లే ఉంటాయి. కానీ మణిరత్నం ఆ ప్రయత్నం చేసినట్లు లేరు. ఇతర భాషలకు కనీసం టైటిల్ మార్చలేదు. పాత్రల పేర్లను కూడా తమిళంలోనే పెట్టి క్యారెక్టర్ పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. ఈ ఫ్యాక్టర్స్ ను దాటుకొని పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి!