పొన్నియిన్ సెల్వన్‌ టీజర్‌కి ముహూర్తం పెట్టారా..?


క్లాసిక్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ మణిరత్నం. గీతాంజలి చిత్రంతో తెలుగు చిత్ర ప్రేక్షకులకు పరిచయమైన ఆయన ఇప్పటికీ ఆ క్రేజ్‌ను కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన కెరీర్ గ్రాఫ్ కాస్త పడిపోయింది. కడలి ఫ్లావ్ అవగా, చెలియా సినిమా కూడా అదే ఫలితాన్ని చవి చూసింది. తరవాత వచ్చిన నవాబ్ కాస్తో కూస్తో ఆడినా, ఇది మణిమార్క్ అని మాత్రం ప్రేక్షకులకు అనిపించలేదు. చాలా లాంగ్ గ్యాప్‌ తరవాత ఆయన మరో మూవీతో ముందుకు రానున్నారు. ఆ మూవీయే పొన్నియిన్ సెల్వన్. తమిళ్‌లోని ఓ నవల ఆధారంగా ఈ  చిత్రం తెరకెక్కుతోంది. విక్రమ్, ఐశ్వర్యరాయ్, కార్తి, త్రిష, జయం రవి లాంటి భారీ తారాగణం కీ రోల్స్‌లో కనిపించనున్నారు. ఏ ఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఒక్కో క్యారెక్టర్‌ని పరిచయం చేస్తూ విడుదల చేసిన పోస్టర్స్‌కి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. పొన్నియిన్ సెల్వన్ పార్ట్‌-1 టీజర్‌ త్వరలోనే విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతోందట. జులై 7న తంజావూరులోని బృహ‌దేశ్వ‌రా ఆలయంలో విడుద‌ల చేయ‌నున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌తో కలిసి మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్‌పై మ‌ణిర‌త్నం స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కించారు. తమిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో ఈ మూవీ విడుద‌ల కానుంది.


ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్‌ 30వ తేదీన విడుదల కానుంది. ఇప్పటి నుంచే మూవీ ప్రమోషన్స్‌లో వేగం పెంచాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. అందుకే వీలైనంత త్వరగా టీజర్ విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. ఇక ఆడియో రిలీజ్ ఫంక్షన్‌ని కూడా  ఓ రేంజ్‌లో చేయాలని చూస్తున్నారు. ఫారిన్‌ లొకేషన్‌లో పాటలు విడుదల చేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సీక్వెల్‌ని 2023 వేసవి నాటికి విడుదల చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఈ విషయమై ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదు.