నిజం ఎవరు కోసం దాస్తున్నావో వాళ్ళెవరూ సంతోషంగా లేరని చారుశీల అంటుంది. ఈ సమస్యలన్నింటికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలని అంటుంది. కార్తీక్ తన బాధని చారుశీలకి చెప్పుకుంటాడు. మేము బతికే ఉన్నామని వాళ్ళ నమ్మకం మాత్రమే నిజమని తెలియదు కదా, మేము బతికే ఉన్నామని తెలిసి దీప చావుకి దగ్గర అయితే వాళ్ళు తట్టుకోలేరు. నిజం చెప్తే తట్టుకోగలదని అనిపిస్తే అప్పుడు చెప్తాను అని కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ‘దశాబ్ద కాలం పాటు భార్య ఉన్నా లేనట్టే బతికాను ఇప్పుడు తను నా సర్వస్వం అనుకుంటే తనే నాకు కాకుండా పోతుంది. నా అంత దురదృష్టవంతుడు ఉండదు, నేను శాపగ్రస్తుడిని’ అని కార్తీక్ ఎమోషనల్ అవుతాడు.


అటు దీప శౌర్య గురించి ఆలోచిస్తూ పండరితో చెప్పుకుని ఏడుస్తుంది. ఏదో జరిగింది లేకపోతే ఇంత త్వరగా ఖాళీ చేసి వెళ్లరు అని పండరి అంటే ఆ మాటలు కార్తీక్ వింటాడు. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పింది నేనే దీప అని కార్తీక్ మనసులో అనుకుంటాడు. వాళ్ళు ఇదంతా చేస్తుంది బిడ్డ మీద ప్రేమ తప్ప మరొకటి కాదు పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారు అని పండరి ధైర్యం చెప్తుంది. దీప మూడ్ మార్చాలని కార్తీక్ ట్రై చేస్తాడు కానీ ఫలించదు. శౌర్య గురించి ఆలోచన లేకుండా చేయాలంటే దీప పరిస్థితి గురించి నిజం చెప్పాలని కార్తీక్ డిసైడ్ అవుతాడు. సౌందర్య శౌర్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది. చారుశీలని కలిసి శౌర్యని రప్పించి భయం పెట్టి అయినా తనతో తీసుకెళ్లాలని అనుకుంటుంది.


Also Read: చిలిపి అల్లరి చేస్తూ భార్యని ఉడికించిన యష్- బుంగమూతి పెట్టిన వేద


దీప-కార్తీక్: శౌర్య గురించి ఊరికే ఆలోచిస్తూ బెంగ పెట్టుకోవద్దు. పండరి చెప్పింది కదా వాళ్ళు మనకి దొరక్కుండా పరిగెడుతుంది బిడ్డ మీద ప్రేమతోనే కదా. తన గురించి ఆలోచించి బెంగ పెట్టుకోవడం ఎందుకు. భారం అంతా నా మీద వేసి నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం అని కార్తీక్ అంటాడు. కానీ దీప మాత్రం శౌర్యని ఎక్కడ దూరం చేస్తాడో అని ఏడుస్తుంది. మనం బతికాం అంటే డానికి ఏదో ఒక సార్థకం ఉంటుంది, నువ్వు ముందు ఆరోగ్యం చూసుకోవాలి కదా అని కార్తీక్ ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నారు నా ఆరోగ్య పరిస్థితి బాగోలేదా నా ప్రాణాలకి ప్రమాదమా అని దీప అడుగుతుంది. అదేమీ లేదని అంటే కాదు ఏదో దాస్తున్నారని అంటుంది.


సౌందర్య చారుశీలకి ఫోన్ చేసి అర్జెంట్ గా కలవాలని చెప్తుంది. ఈ విషయం కార్తీక్ కి చెప్తే దూరం నుంచి అయిన తల్లిని చూసుకుంటాడాని అనుకుంటుంది. దీప భోజనం చేసిన తర్వాత ప్లేట్ కూడా కార్తీక్ తీసేసరికి ఏమైందని అడుగుతుంది. ప్లేట్ కూడా మోయలేనంత రోగం వచ్చిందా, ఏమైంది చెప్పడం లేదు ఏదో విషయం కావాలనే దాస్తున్నారని దీప అంటుంది. ఆ మాటకి కార్తీక్ కోపంగా చేతిలోని ప్లేట్స్ విసిరికొట్టి అరుస్తాడు. అలా అరవడం చూసి మీకేమైంది డాక్టర్ బాబు అని దీప అడుగుతుంది. మనకి ఏమీ కాలేదు అని మళ్ళీ కూల్ గా తనకి సర్ది చెప్తాడు. కార్తీక్ కి చారుశీల ఫోన్ చేసి విషయం చెప్తుంది. కార్తీక్ బయల్దేరుతుంటే దీప తను కూడా వస్తానని అంటుంది. వద్దని సర్ది చెప్పి వెళ్ళిపోతాడు.


Also Read: అత్తారింటికి దారేది అంటూ బయలుదేరిన రిషి, వసుతో జంటగా తిరిగొస్తాడా!


చారుశీల సౌందర్య దగ్గరకి వస్తుంది. కార్తీక్ చాటుగా తన తల్లిని చూస్తూ ఉంటాడు. కార్తీక్ కోసం చారుశీల వెతుకుతూ ఉంటే పక్కన కనిపిస్తాడు. ఎంత తగ్గిపోయావ్ మమ్మీ మా మీద బెంగపెట్టుకుని ఉంటావ్ కదా అని కార్తీక్ కన్నీళ్ళు పెట్టుకుంటాడు.


తరువాయి భాగంలో..


చారుశీల, సౌందర్య హాస్పిటల్ లో ఉండగా శౌర్య సంతోషంగా పరుగులు పెడుతూ వస్తుంది. కానీ లోపల సౌందర్య ఉండటం చూసి వెంటనే వాళ్ళకి కనిపించకుండా ఇంద్రుడు, చంద్రుడిని తీసుకుని వెళ్లబోతుంది. అప్పుడే సౌందర్య బయటకి వచ్చి వాళ్ళని ఆపుతుంది.