టాలీవుడ్ ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ(87) ఇకలేరు. గతకొంత కాలంగా అనారోగ్యం కారణాలతో ఇబ్బంది పడుతోన్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఫిల్మ్ నగర్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కైకాల మృతితో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. కైకాల కృష్ణాజిల్లా కౌతవరం గ్రామంలో 1935 న జన్మించారు. గుడివాడలో ఆయన డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ తర్వాత సినిమాల మీద ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. 'సిపాయి కూతురు' కైకాల మొదటి సినిమా. పౌరాణికం, జానపదం, కమర్షియల్ ఇలా ఎన్నో చిత్రాల్లో హీరో, విలన్ గా నటించి మెప్పించారు. యమధర్మరాజు, దుర్యోధనుడు, ఘటోత్కచుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, భరతుడు, రావణాసురుడి పాత్రల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లాంటి నాటి తరం నటులతోనే కాకుండా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ లతోనూ కొంతమంది యువ హీరోలతోనూ నటించారు. 'మహర్షి' సినిమా తర్వాత ఆయన వెండితెరపై కనిపించలేదు. కైకాల మృతి పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. 


కైకాల మృతి పట్ల నందమూరి బాలకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘‘కైకాల సత్యనారాయణ మరణం దిగ్భ్రాంతి కలిగించింది. కైకాల సత్యనారాయణ ఆరు దశాబ్దాలు పాటు తెలుగు సినిమా రంగంలో పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రల్లో నవరస నటనా సార్వభౌముడిగా తన వైవిధ్యమైన నటనతో అలరించారు. మా కుటుంబంతో కైకాల సత్యనారాయణ గారికి స్నేహ సంబంధాలు వున్నాయి. నాన్నగారితో కలిసి ఎన్నో సినిమాల కోసం పనిచేశారు. నా చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. మంచి నటుడిగానే కాకుండా పార్లమెంట్ సభ్యునిగా తనదైన ముద్రవేశారు. సినీ జీవితంలోనూ, ప్రజాజీవితంలోనూ ఎంతో బాధ్యతాయుతంగా ఆయన అందించిన సేవలు మరువలేనివి. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’  అంటూ బాలకృష్ణ ట్వీట్ చేశారు. 


కైకాల సత్యనారాయణ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ‘‘తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డ, నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యన్నారాయణ గారు మృతి చెందడం నన్ను కలచివేస్తోంది. శ్రీ కైకాల సత్యన్నారాయణ గారు తెలుగు సినీ రంగానికే కాదు.. భారత సినీ రంగానికి గర్వకారణమైన అత్యంత ప్రతిభావంతుడైన నటులు. సత్యన్నారాయణ గారు పోషించినటువంటి వైవిధ్యమైన పాత్రలు బహుశా భారతదేశంలో వేరొక నటుడు పోషించి ఉండరు. కైకాల సత్యన్నారాయణ తో కలిసి నేను ఎన్నో చిత్రాల్లో నటించాను. ఆ సందర్భంగా ఆయన నటనా వైదుష్యాన్ని, వ్యక్తిత్వాన్ని దగ్గర నుండి పరిశీలించే అవకాశం నాకు కలిగింది. గొప్ప స్పాంటేనియిటీ ఉన్న అరుదైన నటులు ఆయన. డైలాగ్ డెలివరీలో ఆయనది ప్రత్యేక పంథా. స్వచ్ఛమైన స్పటికం లాంటి మనిషి, నిష్కల్మషమైన మనసున్న మనిషి. ఎటువంటి అరమరికలు లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావం కలవారు. నన్ను 'తమ్ముడూ' అంటూ తోడబుట్టినవాడిలా ఆదరించారు. మా మధ్య అనుబంధం. ఆత్మీయత అంతకంతకూ బలపడుతూ వచ్చాయి. ఆయనతో నాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఆనందకరమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.


నటన, రుచికరమైన భోజనం రెండూ కైకాల సత్యన్నారాయణ గారికి ప్రాణం. నా శ్రీమతి సురేఖ చేతివంటను ఎంతో ఇష్టపడేవారు. క్రిందటేడాది, ఈ యేడాది ఆయన జన్మదినం సందర్భంగా ఆయన స్వగృహానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేయడం నాకు మిగిలిన సంతృప్తి. ఆ సందర్భంగా సత్యన్నారాయణ సురేఖతో “అమ్మా ఉప్పు చేప వండి పంపించు" అని అన్నప్పుడు "మీరు త్వరగా కోలుకోండి.. ఉప్పు చేపతో మంచి భోజనం చేద్దాం" అని అన్నాం. ఆ క్షణాన ఆయన చిన్న పిల్లాడిలా ఎంతో సంతోష పడిపోయారు. కైకాల సత్యన్నారాయణ గొప్ప సినీ సంపదను అందరికీ అందించి వెళ్లిపోయారు. ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాను.’’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.