Devara Movie: ‘RRR’ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘జనతా గ్యారేజ్’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.  


తారక్ రోల్ విషయంలో కీలక ట్విస్ట్!


తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరికొత్త గెటప్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ లేనంత రఫ్ లుక్ లో కనిపించబోతున్నారట. మాస్ లుక్ తో అందరినీ ఆశ్చర్యపరిచే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, తారక్ రోల్ కు సంబంధించి ఓ కీలక ట్విస్ట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఆ ట్విస్ట్ సినిమా మొత్తానికి హైలెట్ గా నిలవబోతున్నట్లు సమాచారం. అటు త్వరలోనే ఈ మూవీకి సంబంధించి స్పెషల్ వీడియో గ్లింప్స్ రిలీజ్ కాబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.   


‘దేవర’ సినిమా రిలీజ్ వాయిదా


అటు ‘దేవర’ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 5న విడుదల అవుతుందని అందరూ భావిచారు. కానీ, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. రీసెంట్ గా ఈ సినిమాలో విలన్ రోల్ పోషిస్తున్న సైఫ్ అలీ ఖాన్ గాయపడ్డారు. ఆయన పార్ట్ షూటింగ్ పెండింగ్ లోనే ఉంది. అటు ఈ సినిమాకు పాటలు, నేపథ్య సంగీతాన్ని అందించేందుకు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవి చందర్ చాలా టైమ్ తీసుకుంటున్నారట. అటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ లోనే జరిగే అవకాశం ఉంది. మొత్తంగా పలు కారణాలతో ఈ సినిమా సమ్మర్ బరి నుంచి తప్పుకోబోతోంది.


రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ‘దేవర’


‘జనతా గ్యారేజ్’ తర్వాత కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్‌ కాంబోలో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా గురించి జాన్వీ రీసెంట్ గా కీలక విషయాలు వెల్లడించింది. “నేను ఇప్పటి వరకు నటించిన సినిమాలు ఒక ఎత్తు, ‘దేవర’ సినిమా మరోఎత్తు. ఇప్పటి వరకు నేను నటించిన సినిమాలు ఓ వర్క్ షాప్ లా పనికి వచ్చాయి. ఈ సినిమాతో నాలోని నటిని పూర్తి స్థాయిలో చూడబోతున్నారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాం. ఈ సినిమా అనుభవాలను బేస్ చేసుకుని నా సినీ కెరీర్ ను నిర్మించుకునే ప్రయత్నం చేస్తాను” అని చెప్పింది. భారతదేశంలోని తీర ప్రాంతాల కథ నేపథ్యంలో రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది.  ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.