టాలీవుడ్ దర్శకులంతా ఎప్పుడూ కలిసే ఉంటారు. ఎవరిదైనా సినిమా హిట్ అయిందంటే అందరూ కలిసి పార్టీలు చేసుకుంటారు. ఎవరిమధ్యనైనా.. విబేధాలు ఉంటే బయటకు మాత్రం తెలియనివ్వరు. అలాంటిది ఇప్పుడు ఇద్దరు దర్శకులు ట్విట్టర్ వేదికగా వార్ కి దిగారు. ఒకరినొకరు మాటలు అనుకుంటూ వార్తల్లో నిలిచారు. 


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఉద్దేశిస్తూ.. దర్శకుడు బీవీఎస్ రవి 'అనుభవించమని ఇచ్చిన అధికారాన్ని ప్రదర్శించడం మొదలెడితే ప్రజలు పతనం పరిచయం చేస్తారని తరతరాల ప్రజాస్వామ్య చరిత్ర చెబుతోంది' అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ఈ డైరెక్టర్ పై మండిపడుతున్నారు. అనుభవించడానికి అధికారం ఇస్తారా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 


దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఈ ట్వీట్ పై స్పందిస్తూ.. 'అనుభవించమని ఇచ్చారా ?' అని ప్రశ్నించారు. ఇది చూసిన బీవీఎస్ రవి.. సెటైరికల్ గా అన్నానని.. ట్వీట్ ను ఎంజాయ్ చేయమని అన్నారు. దీంతో హరీష్ అది సెటైరికల్ గా లేదని అన్నారు. ఇక్కడితో మొదలైన వారి మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. 


'సంస్కారం గురించి నువ్ మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. బహుశా మొదటిసారి అనుకుంటా కదా..?' అని బీవీఎస్ రవి అనగా.. 'అంతేగా.. ఉన్నదాని గురించి ఎక్కువ మాట్లాడను.. లేనివాళ్ల దగ్గర మాట్లాడడానికి తడబడను' అంటూ పంచ్ లైన్లు రాసుకొచ్చారు హరీష్ శంకర్. ఇదంతా చూస్తుంటే వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనే విషయం క్లియర్ గా తెలుస్తుంది.