తెలుగు సినిమాకు గౌరవం, గుర్తింపు తెచ్చిన దర్శకుల్లో కె. విశ్వనాథ్ ఒకరు. సౌండ్ రికార్డిస్ట్ గా సినిమా రంగంలోకి ప్రవేశించి, అసిస్టెంట్ డైరెక్టర్ గా, డైరెక్టర్ గా అత్యున్నత చిత్రాలను తెరకెక్కించారు. మెగా ఫోన్ పట్టుకోవడమే కాకుండా, కెమెరా ముందు నటుడిగా అద్భుతంగా రాణించారు. దర్శకుడిగా ఆయన తెరకెక్కించిన తొలి చిత్రం ‘ఆత్మ రమ్య’. ఈ సినిమాతోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డు పొందారు. ఆ తర్వాత ‘శంకరాభరణం’ సినిమాతో కనీవినీ ఎరుగని విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాకు గాను జాతీయ చలనచిత్ర పురస్కారం పొందారు. ఇక విశ్వనాథ్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన మరో చిత్రం ‘సిరివెన్నెల’. ఈ మూవీ ఎంతో గొప్ప విజయాన్ని సాధించడంతో పాటు దర్శకుడిగా ఆయన కీర్తిని ఆకాశాన్ని తాకేలా చేసింది. ‘సిరివెన్నెల’ గొప్ప విజయం సాధించినా, తనను మానసికంగా బాధించిందని విశ్వనాథ్ అనడం నిజంగా ఆశ్చర్యకరమే.

  


ఎన్నో ఆణిముత్యాలను తెరకెక్కించిన కళాతపస్వి


‘సప్తపది’, ‘స్వాతిముత్యం’, ‘స్వయంకృషి’, ‘శుభోదయం’, ‘శుభలేఖ’, ‘ఆపద్భాంధవుడు’, ‘శుభసంకల్పం’ లాంటి అద్భుతమైన చిత్రాలను రూపొందించి కళాతపస్విగా పేరు తెచ్చుకున్నారు దర్శకుడు కె.విశ్వనాథ్. ఆయన దర్శకత్వం వహించిన ఎన్నో హిట్ చిత్రాలలో ‘సిరివెన్నెల’ సినిమా ప్రత్యేకం. సినిమాలతో ప్రేక్షకుల మనసు దోచే విశ్వనాథ్ మనసును గాయపరిచింది ఈ సినిమా. కొంతకాలం ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.


మానసికంగా ఇబ్బంది పెట్టిన చిత్రం ‘సిరివెన్నెల’-విశ్వనాథ్


విశ్వనాథ్‌కి కెరీర్‌లో ఏ సినిమా సంతృప్తినిచ్చిందనే ప్రశ్నకు ఆయన కీలక విషయాలు చెప్పారు. సంతృప్తినిచ్చిన సినిమాలు చాలా ఉన్నాయన్న ఆయన, మానసికంగా వేధించిన సినిమా మాత్రం ‘సిరివెన్నెల’ అన్నారు. ‘‘ఒక ఆర్టిస్టుకు జీవితాంతం తృప్తి ఉండదు. ఇంకేదో చేయాలి, ఇంకేదో సాధించాలనే అసంతృప్తితో జీవిస్తాడు. నేనూ అంతే. కానీ, నన్ను మానసికంగా హర్ట్ చేసిన సినిమా ‘సిరివెన్నెల’. మాటలు రాని అమ్మాయి అంటే ఏమిటి? అంధ బాలుడు అంటే ఏమిటి? వాళ్ల మధ్య సీన్స్ క్రియేట్ చేయడానికి నేనెందుకు పగలు రాత్రి కష్టపడుతున్నాను? ఆలోచించాను. ఆ కథను ఎందుకు మొదలుపెట్టానో? సినిమా షూటింగ్ మధ్యలో ఉన్నప్పుడు పూర్తి చేయగలనా లేదా? అని బాధగా అనిపించింది. నేను ఈ సినిమాని ఆపలేను. నేను పని చేసిన నటీనటులను తక్కువ, ఎక్కువ భావంతో చూసే వాడిని కాదు. ఏ సినిమాతో పని చేస్తే ఆ సినిమా నటీనటులతో అత్యంత అటాచ్మెంట్ తో ఉండేవాడిని. సినిమాలో అనుకున్న సీన్ అనుకున్నట్లుగా వచ్చేందుకు ఎంతో కష్టపడే వాడిని. నటీనటులను కూడా అంతే కష్టపెట్టేవాడిని'' అన్నారు. తెలుగు తెరపై ‘సిరివెన్నెల’ సినిమా క్లాసిక్‌గా నిలిచింది. ఇప్పటికీ టాలీవుడ్ టాప్ సినిమాల లిస్టును రూపొందిస్తే ఈ సినిమా కచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు.‘సిరివెన్నెల’ మూవీలో సుహాసిని మూగ యువతిగా, సర్వదమన్ బెనర్జీ అంథుడిగా నటించిన సంగతి తెలిసిందే. బెంగాలీ నటి మూన్ మూన్ సేన్ ప్రత్యేక పాత్రలో నటించారు. నటి మీనా ఈ మూవీలో బాలనటి. 


Read Also: టాలీవుడ్‌ను ఖండాంతరాలకు తీసుకు వెళ్ళారు, తీరని లోటు - విశ్వనాథునికి చిరంజీవి, ఎన్టీఆర్, మమ్ముట్టి నివాళులు