‘దసరా’ టీజర్ లాంచ్‌లో నాని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి. ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీయఫ్’, ‘కాంతార’లతో దసరాను పోలుస్తూ ఇచ్చిన స్పీచ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీనిపై నాని క్లారిటీ ఇచ్చారు. 


‘దసరా’ రెండో పాట ‘ఓరి వారి’ రిలీజ్ ప్రెస్‌మీట్‌లో ఒక విలేకరి నానిని ‘ఇటీవల జరిగిన టీజర్ లాంచ్‌లో ఆర్ఆర్ఆర్, కేజీయఫ్ సినిమాలతో దసరాని పోల్చారు. ఆ రేంజ్ సినిమాలతో మీ సినిమాని ఎలా పోల్చారు?’ అని అడిగారు.


దీనికి నాని బదులిస్తూ...‘సోషల్ మీడియాలో దీనిపై వస్తున్న కామెంట్లకు కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి. ఒక్కోసారి మనం ఏదో అంటాం. దాన్ని 100 సార్లు కాపీ, పేస్ట్ చేసి ఇంకోలా రాస్తారు. నేను క్లియర్‌గా చెప్పేది ఏంటంటే... ఆర్ఆర్ఆర్, కేజీయఫ్‌లాగా రూ. 500 కోట్లు, రూ. 1000 కోట్లు వసూలు చేస్తాయా, వాటి అంత బడ్జెట్ పెట్టి చేశామా అన్నది కాదు.’


‘నా ఉద్దేశం ఏంటంటే ఆ సినిమాలో ఆయా ఇండస్ట్రీలు గర్వించదగ్గ సినిమాలు. వాటి జోనరో, సీన్లు అలా ఉంటాయనో, కథ వాటిలో ఉంటుందనో కాదు. అది చిన్న సినిమా కావచ్చు, పెద్ద సినిమా కావచ్చు, ఇంకా పెద్ద సినిమా కావచ్చు. కొన్ని ఆణిముత్యాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం ఆయా ఇండస్ట్రీల నుంచి కొన్ని సినిమాలు వస్తాయి. ఈ సినిమా మా ఇండస్ట్రీ నుంచి వచ్చిందని గర్వంగా చెప్పుకునే సినిమాలు అవి.’


‘అలా గత సంవత్సరం వచ్చిన సినిమాలు ఆర్ఆర్ఆర్, కేజీయఫ్ అయితే ఈ సంవత్సరం తెలుగు సినిమా నుంచి దసరా వస్తుందని చెప్పాను. మార్చి 30వ తేదీ వరకు అడిగిన ప్రతి సారీ ఇదే చెప్తాను. ఆ తర్వాత నేను చెప్పింది కరెక్టో కాదు మీరు చెప్పండి.’ అంటూ ఈ వివాదంపై బదులిచ్చారు.


‘దసరా’ ముందస్తు బిజినెస్ భారీగా జరుగుతుందని సమాచారం అందుతోంది. ఆంధ్రాలోని అన్ని ఏరియాల్లో కూడా ఈ సినిమా అమ్ముడు పోయిందని, తెలంగాణలో కూడా భారీ మొత్తానికి ప్రముఖు నిర్మాత కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది. అంతే కాకుండా సినిమాకు పెట్టిన బడ్జెట్ కంటే థియేట్రికల్ బిజినెస్ ద్వారా వస్తున్న మొత్తం కాస్త ఎక్కువగానే ఉన్నట్టు సమాచారం. హీరో నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ‘దసరా’. ఈ సినిమా రూ. 65 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. అయితే నిర్మాత థియేట్రికల్ మరియు నాన్-థియేట్రికల్ బిజినెస్ నుంచి ఈ మొత్తాన్ని రికవరీ చేసి సుమారు రూ. 10 కోట్ల లాభాలను ఆర్జించారని సమాచారం.


తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను నిర్మాత చాలా కాలం క్రితం రూ. 23 కోట్లకు కొనుగోలుదారుకు విక్రయించారు. అయితే వీరు రూ. 28 కోట్లకు దిల్ రాజుకు విక్రయించారని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఈ చిత్రానికి రూ. 35 కోట్ల మధ్య భారీ ఆఫర్లు వస్తున్నాయట. నిర్మాత సినిమాను రూ. 23 కోట్లకు అమ్మకుండా ఉంటే, అతను తెలుగు రాష్ట్రాల నుంచి ఈజీగా రూ. 35 కోట్ల వరకు సంపాదించేవాడు.