Mani Ratnam: మోస్ట్‌ యాంటిసిపేటెడ్‌ సీక్వెల్స్‌ల్ గా తెరకెక్కిన ‘పొన్నియన్‌ సెల్వన్‌-2’ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. గతేడాది సెప్టెంబర్‌ చివరివారంలో రిలీజైన పార్ట్‌-1 ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇక పార్ట్ 2 రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు. అందులో భాగంగా దర్శకుడు మణిరత్నం చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దర్శక ధీరుడు రాజమౌళి సృష్టించిన బాహుబలి లేకుండా తన పొన్నియన్ సెల్వన్ లేదని వ్యాఖ్యానించారు. ఈ మూవీ ఇండస్ట్రీలో చారిత్రక సినిమాలు తీసే నమ్మకాన్నిచ్చిందంటూ రాజమౌళిని, ఆయన రూపొందించిన ‘బాహుబలి’ చిత్రాలను కొనియాడారు.


మణిరత్నం రూపొందించిన ‘పొన్నియిన్ సెల్వన్’ పార్ట్ 1 గతేడాది రిలీజై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ముఖ్యంగా తమిళ నాట కాసుల వర్షం కురిపించింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైనా.. తమిళంలోనే ఎక్కువ రికార్డులు సృష్టించింది. మిగతా భాషల్లో అంతంత మాత్రంగానే మార్కులు కొట్టేసింది. మల్టీస్టారర్ సినిమా అయిన ‘పొన్నియన్ సెల్వన్‌’లో కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్, ప్రకాశ్ రాజ్, పార్థిబన్, ఐశ్వర్య, ప్రభు, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, జయరాం తదితరులు నటించారు. ప్రజాదరణ పొందిన ఒక నవల ఆధారంగా తీసిన ఈ సినిమాకు ఏఆర్ రహమాన్ సంగీత దర్శకత్వం వహించగా, సీనియర్ రైటర్ జయమోహన్ డైలాగులు రాశారు. సినిమాటోగ్రఫర్‌గా రవి వర్మన్ పనిచేశారు. లైకా ప్రొడక్షన్ ఈ సినిమాను నిర్మించింది.


పాన్ ఇండియా మూవీ పొన్నియిన్ సెల్వన్ 2 విషయానికొస్తే ఏప్రిల్ 28న గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. టీమ్ మొత్తం ప్రమోషన్స్‌లో పాల్గొంటూ సందడి చేస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన తెలుగు ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా చిత్ర దర్శకుడు మణిరత్నం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా రెండు భాగాలుగా తీయడానికి దర్శక ధీరుడు రాజమౌళే కారణమని చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే బాహుబ‌లి లేకపోతే పొన్నియిన్ సెల్వన్‌ లేదని కొనియాడారు. బాహుబలి సినిమాలతో రాజమౌళిలో ఓ హిస్టరీ క్రియేట్ చేశారన్న ఆయన.. ఈ సందర్భంగా మణిరత్నం, రాజమౌళికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పానని, ఇదే విషయాన్ని రాజమౌళికి కూడా చెప్పానని మణిరత్నం తెలిపారు. ఇక ఏప్రిల్ 28న థియేట‌ర్స్‌లో విడుదలయ్యే పీఎస్ 2ను కచ్చితంగా ఎంజాయ్ చేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.


తెలుగు ప్రేక్షకుల ఎన‌ర్జీ అమేజింగ్ అని, ఈ సినిమా ప్రమోష‌న్స్ కోసం చాలా ప్రాంతాల‌కు వెళ్లామని, కానీ ఇక్కడ దొరికే ప్రేమ మ‌రో లెవ‌ల్‌లో ఉంటుందని హీరో చియాన్ విక్రమ్ అన్నారు. పీఎస్ 1 తెలుగులో చాలా పెద్ద హిట్ అయ్యిందన్న ఆయన.. ఇప్పుడు అదే ప్రేమ‌ను పీఎస్‌2లోనూ చూపిస్తార‌నుకుంటున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. మ‌ణిర‌త్నంగారు జీనియ‌స్‌ అని, ఆయ‌న‌తో వంద సినిమాలైనా చేయాల‌ని అనుకుంటానని చెప్పారు.


జ‌యం ర‌వి, కార్తి, విక్రమ్‌, ఐశ్వర్య రాయ్‌, త్రిష‌, శోభిత‌, ఐశ్వర్య ల‌క్ష్మి, తోట త‌ర‌ణి, శ్రీక‌ర్ ప్రసాద్‌, ఏఆర్ రెహ‌మాన్  స‌హా గొప్ప నటీనటులు నటించిన ‘పొన్నియన్ సెల్వన్ 2’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పార్ట్ 1మంచి రెస్పాన్స్ రాగా.. ఇప్పుడు అంతకుమించిన పాజిటివ్ టాక్, హిట్ వస్తుందని మేకర్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.