మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'విరూపాక్ష'. ఇది తేజ్ కెరీర్ లో 15వ సినిమా. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇందులో 'భీమ్లా నాయక్' ఫేమ్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఇదొక ఆసక్తికరమైన మిస్టిక్ థ్రిల్లర్ అని చిత్ర బృందం చెబుతూ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా, పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది.  


'విరూపాక్ష' చిత్రాన్ని సమ్మర్ స్పెషల్ గా 2023 ఏప్రిల్ 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటుగా తమిళం, మలయాళ కన్నడ హిందీ భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరుస అప్డేట్స్ తో, మూవీ ప్రమోషన్స్ షురూ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా టీజర్ ను లాంచ్ చేయాలని నిర్ణయించుకున్నారు. 


బుధవారం, మార్చి 1వ తేదీన 'విరూపాక్ష' టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని హీరో సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ''ఇంక వెయిటింగులు ఉండవ్.. ఓన్లీ అప్డేట్స్'' అని ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీజర్ అనౌన్సమెంట్ గ్లిమ్స్ ను షేర్ చేశారు. ఇందులో తేజ్ తన చేతిలో ఒక కాగడాని పట్టుకొని దేన్నో అన్వేషించడానికి బయలుదేరినట్లు కనిపిస్తున్నాడు. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ దీనికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 






చేతబడులు, మూఢ నమ్మకాల నేపథ్యంలో 'విరూపాక్ష' సినిమా రూపొందుతోందని ప్రచారం జరుగుతోంది. ఇదివరకే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ మరియు గ్లిమ్స్ కు విశేష స్పందన లభించింది. ముఖ్యంగా యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో వచ్చిన వీడియో గ్లిమ్స్ మూవీపై ఆసక్తిని కలిగించింది. ఇది కచ్చితంగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందే చిత్రమనే భావన కలిగించింది. ఈ క్రమంలో మార్చి 1న టీజర్ తో ఉత్సుకతను రెట్టింపు చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. అప్పుడైనా అసలు ఈ విరూపాక్ష కథేంటో హింట్ ఇస్తారేమో చూడాలి. 


'విరూపాక్ష' చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ & సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'విక్రాంత్ రోణా' 'కాంతారా' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు వర్క్ చేసిన కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ నిర్వర్తిస్తున్నారు. 


ఇకపోతే 'పిల్లా నువ్వు లేని జీవితం' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయి ధ‌ర‌మ్‌ తేజ్.. కెరీర్ ప్రారంభం నుంచీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి విభిన్నమైన చిత్రాలను ఎంపిక చేసుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' 'సుప్రీమ్' 'చిత్ర లహరి' 'ప్రతిరోజూ పండుగే' వంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు. చివరగా 'రిప‌బ్లిక్' మూవీతో ప్లాప్ అందుకున్న తేజ్.. ఇప్పుడు 'విరూపాక్ష' చిత్రంతో స్ట్రాంగ్ క‌మ్ బ్యాక్‌ ఇవ్వాలని చూస్తున్నాడు. దీని కోసం ఈ సినిమాలో రిస్కీ స్టంట్స్ కూడా చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా మెగా హీరోకి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి. 


Read Also: హిందీ సినిమాల కంటే సౌత్ సినిమాలే బెస్ట్ - నసీరుద్దీన్ షా సెన్సేషనల్ కామెంట్స్!