సాయి ధరమ్ తేజ్, సంయుక్త ప్రధాన పాత్రల్లో నటించిన ‘విరూపాక్ష’.. ఎక్కడాలేని క్రేజ్ లభిస్తోంది. పబ్లిసిటీతో పనిలేకుండానే.. మౌత్ పబ్లిసిటీతో మూవీకి బోలెడంత బజ్ లభిస్తోంది. దీంతో ‘విరూపాక్ష’ చిత్రయూనిట్ సంబరాల్లో మునిగితేలుతోంది. పాజిటివ్ టాక్ వల్ల సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. మూడు రోజుల్లోనే ఈ మూవీ భారీ వసూళ్లు సాధించింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లో ఇప్పటి వరకు (రిలీజైన్ మూడు రోజుల్లో) రూ.44 కోట్లు వసూలు చేసింది. వీకెండ్ కావడంతో రికార్డు స్థాయిలో ఈ మూవీకి కలెక్షన్స్ లభించాయి. 


రెండో రోజే ఈ మూవీ రూ.28 కోట్ల వరకు కలెక్షన్స్ లభించాయి. శుక్రవారం రూ.12 కోట్లు, శనివారం రూ.16 కోట్లు, ఆదివారం రూ.16 కోట్లు చొప్పున ఈ మూవీకి కలెక్షన్స్ వచ్చినట్లు తెలిసింది. అమెరికాలో రూ.8.20 కోట్లు (సుమారు ఒక మిలియన్ డాలర్లు) వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ‘విరూపాక్ష’ ఊపు చూస్తుంటే.. రానున్న రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్‌లో స్థానం సాధించడం ఖాయం. వచ్చే వారం పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు సన్నహాలు జరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే ఊపు కొనసాగితే.. ‘కాంతార’ తరహాలోనే రికార్డులు బద్దలకొట్టే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. 


మూడో రోజు కలెక్షన్ల పూర్తి వివరాలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ)


మూడో రోజైన ఆదివారం ‘విరూపాక్ష’కు నైజాంలో రూ.7.20 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.2.05 కోట్లు, సీడెడ్‌లో 2.31 కోట్లు లభించాయి. మొత్తంగా ఏపీ, తెలంగాణలో కలిసి రూ.16.36 కోట్లు లభించాయి. గుంటూరులో రూ.1.19 కోట్లు, నెల్లూరులో రూ.56 లక్షలు, కృష్ణలో రూ.1.10 కోట్లు, పశ్చిమలో రూ.85 లక్షలు, తూర్పులో రూ.1.10 కోట్లు లభించాయి. మొత్తానికి మూడు రోజులు కలిపి ఈ మూవీకి రూ.44 కోట్లు లభించాయి. ఇది సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లోనే అత్యంత బెస్ట్ కలెక్షన్స్ కావడం గమనార్హం.






మొదట్లో మాట రాక ఇబ్బంది పడ్డా సాయి ధరమ్ తేజ్


సాయి ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అయిన తర్వాత దాదాపు 22 రోజులు ఆసుపత్రిలో ఉంచారని, తర్వాతే ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారని అన్నారు. తర్వాత ఆయన్ను చూడటానికి ఇంటికి వెళ్లామని, అన్నిరోజులు ఫుడ్ లేకపోవడం వలన ఆయన చాలా వీక్ అయిపోయారని అన్నారు. ఆయన పరిస్థితి చూసి కోలుకోవడానికి ఆరు నెలలు అయినా పడుతుందని అనుకున్నామని.. కానీ ఆయన మూడు నెలల్లోనే కోలుకొని షూటింగ్ కు రెడీ చెప్పారని చెప్పారు. అయితే షూటింగ్ మొదట్లో డైలాగ్స్ చెప్పడానికి చాలా ఇబ్బంది పడేవారని, ఒక్కో అక్షరం కూడబలుక్కొని మాట్లాడేవారని చెప్పారు. అయితే ఆయన సమస్యలను ఆయనే పరిష్కరించుకొని నాలుగో రోజు నుంచి నార్మల్ గా మారిపోయారని అన్నారు. 


నైట్ షూటింగ్ లలో చాలా కష్టపడ్డారు


‘విరూపాక్ష’ సినిమా దాదాపు 70 శాతం అంతా రాత్రి పూటే జరిగే సన్నివేశాలు ఉంటాయని అన్నారు దర్శకుడు కార్తీక్. అందుకే సినిమాలో రాత్రి పూట జరిగే సన్నివేశాలను నిజంగానే రాత్రి పూటే తీశామని, ప్రేక్షకులకు ఆ విజువల్ ట్రీట్ ఇద్దామనే అలా చేశామని అన్నారు. అయితే  సాయి ధరమ్ తేజ్ అప్పటికే మెడికేషన్ మీద ఉన్నారని, రాత్రి పూట సన్నివేశాల్లో చేయగలరా లేదా అనే సందేహం ఉండేదని అన్నారు. ఆయన శారీరకంగా బలహీనంగా ఉన్నా షూటింగ్ కు ఇబ్బంది రాకూడదు అని అలాగే చేసేవారని అన్నారు. అలా సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని చెప్పుకొచ్చారు దర్శకుడు కార్తీక్ దండు.