Thalapathy Vijay Jana Nayagan Delayed Again : కోలీవుడ్ స్టార్, దళపతి విజయ్ హీరోగా నటించిన లాస్ట్ మూవీ 'జన నాయగన్' ఇప్పట్లో రిలీజ్ అయ్యే సూచనలు కనిపించడం లేదు. జనవరి 9న రిలీజ్ కావాల్సిన సినిమా సెన్సార్ వివాదాలతో ఆలస్యమైంది. చిత్ర నిర్మాణ సంస్థ కేసు వెనక్కి తీసుకోవడంతో సెన్సార్ బోర్డు మూవీని రివైజింగ్ కమిటీకి పంపిన నేపథ్యంలో మార్చిలో విడుదలవుతుందని అంతా భావించారు. అయితే, ఫ్యాన్స్‌కు మాత్రం మళ్లీ నిరాశే మిగిలింది.

Continues below advertisement

ఏప్రిల్‌లోనూ కష్టమే...

అయితే, ఏప్రిల్‌లోనూ 'జన నాయగన్' రిలీజ్ అయ్యే సూచనలు కనిపించడం లేదు. కెనడాలోని ఇండియన్ సినిమాస్ డిస్ట్రిబ్యూట్ చేసే 'యార్క్ సినిమాస్' సంస్థ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. 'జన నాయగన్ ఏప్రిల్ 30 లోపు రిలీజ్ కాదనే విషయాన్ని అంతా గమనించగలరు. సినిమా టికెట్స్ బుక్ చేసుకుని ఇంకా రిఫండ్ పొందని వారు సంబంధిత థియేటర్ల యాజమాన్యాలను అప్రోచ్ కావొచ్చు.' అంటూ పేర్కొంది. దీంతో మూవీ సెన్సార్ వివాదం ఇంకా క్లియర్ కాలేదని తెలుస్తోంది.

Continues below advertisement

Also Read : నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 14కి మళ్ళీ వస్తాం... 'కపుల్ ఫ్రెండ్లీ' జంటతో కొత్త సినిమా - సక్సెస్‌ మీట్‌లో బిగ్ అప్డేట్

వారం రోజుల్లోనే అనుకున్నా...

'జన నాయగన్'ను సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీకి పంపాలన్న నిర్ణయంపై చిత్ర నిర్మాణ సంస్థ కోర్టును ఆశ్రయించింది. అయితే, కోర్టులో సెన్సార్ బోర్డుకు అనుకూలంగా తీర్పు రావడంతో ఆ కేసును వెనక్కి తీసుకుంది. ఈ క్రమంలో మూవీని సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీకి పంపింది. వారం రోజుల్లోనే కాంట్రవర్సీ క్లియరై సెన్సార్ సర్టిఫికెట్ వస్తుందనుకున్న తరుణంలో ఆ అవకాశాలు కనిపించడం లేదు. దీనిపై నిర్మాణ సంస్థ రియాక్ట్ కావడం లేదు. తాజాగా కెనడాలో డిస్ట్రిబ్యూట్ సంస్థ చేసిన ప్రకటనతో 'జన నాయగన్' సమ్మర్ తర్వాతే ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. 

అసలేం జరిగింది?

సెన్సార్ బోర్డు ముందుగా మూవీకి U/A సర్టిఫికెట్ జారీ చేసి ఆ తర్వాత రివైజింగ్ కమిటీకి పంపాలని నిర్ణయించింది. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ కోర్టును ఆశ్రయించింది. సింగిల్ బెంచ్ అనుకూలంగా తీర్పు ఇచ్చినా... సెన్సార్ బోర్డు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించడంతో అక్కడ చుక్కెదురైంది. సుప్రీంకోర్టును ఆశ్రయించినా కూడా డివిజన్ బెంచ్‌లోనే తేల్చుకోవాలని సూచించింది. దీంతో కేసును వెనక్కి తీసుకుని మూవీని రివైజింగ్ కమిటీకి పంపారు. అయితే, ఆ తర్వాత సెన్సార్ సర్టిఫికెట్‌పై కానీ మూవీ రిలీజ్‌పై కానీ ఎలాంటి అప్డేట్ లేదు. 

ఈ మూవీకి హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా... విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. ప్రేమలు ఫేం మమితా బైజు కీలకపాత్ర పోషించారు. వీరితో పాటే బాబీ డియోల్, నరైన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు కీలకపాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించగా... KVN ప్రొడక్షన్స్ బ్యానర్‍పై వెంకట్ కె నారాయణ నిర్మించారు. విజయ్ చివరి మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.