prabhas - vijay devarakonda  'సలార్‌' సినిమా హిట్‌తో మంచి ఊపుమీద ఉన్న ప్రభాస్‌ వరుసగా.. ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు చేస్తున్నారు. దాంట్లో భాగంగా 'కల్కి 2898ఏడి' ప్రాజెక్ట్‌ శరవేగంగా సాగుతోంది. మే 9న సినిమా రిలీజ్‌ డేట్‌ని కూడా ప్రకటించేశారు కూడా. ఇక ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి మరికొన్ని అప్‌డేట్స్‌ బయటికి వచ్చాయి. పాన్‌ ఇండియా లెవెల్‌లో తెరకెక్కుతున్న ఆ సినిమాలో మరో పాన్‌ ఇండియా హీరో గెస్ట్‌ రోల్‌ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరోనే విజయ్‌ దేవరకొండ. 


ఇప్పటికే మొదలైన షూటింగ్‌.. 


కల్కీ సినిమాకి సంబంధించి షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా.. విజయ్‌ దేవరకొండ నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో 'ఎవడే సుబ్రమణ్యం', 'మహానటి' సినిమాలు వచ్చాయి. ఇక ఇప్పుడు సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో తెరకెక్కుతున్న 'కల్కి' సినిమాలో గెస్ట్‌ రోల్‌ ప్లే చేయనున్నారు విజయ్‌ దేవరకొండ. కాగా.. విజయ్‌కి సంబంధించి షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నట్లు సమాచారం. ఎన్నో హిట్‌ సినిమాలు చేసిన విజయ్‌ దేవరకొండ ఈ మధ్యే లైగర్‌ సినిమాతో పాన్‌ ఇండియా హీరో అయ్యారు.  


దుల్కర్‌ కూడా?


ఈ సినిమాలో విలన్‌గా కమల్‌హాసన్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తుండగా, అమితాబ్‌ బచ్చన్‌, దిశాపటాని ప్రధాన ప్రాతల్లో నటిస్తున్నారు. అయితే, ప్రముఖ హీరో దుల్కర్‌ సల్మాన్‌ కూడా 'కల్కి' సినిమాలో గెస్ట్‌రోల్‌లో కనిపిస్తున్నట్లుగా వార్తలు వినిపించాయి. అయితే, దానికి సంబంధించి చిత్ర యూనిట్‌ నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇక ఇప్పుడు రౌడీ కూడా ఎంట్రీ ఇస్తున్నాడనే వార్తలు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. టీమ్‌ నుంచి ఎలాంటి అప్‌డేట్‌ రానప్పటికీ.. ఫ్యాన్స్‌ మాత్రం తెగ సంబరాలు చేసుకుంటున్నారు. ఇది కదా మజా ఇచ్చే న్యూస్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు.  


నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కల్కి' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.ఇక దానికి తగ్గట్టుగానే భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని తీస్తున్నారు.వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై అశ్వినీ దత్‌ సినిమాని నిర్మిస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో సినిమా రూపొందుతోంది. 


ఇక ఇదిలా ఉంటే ప్రభాస్‌ ప్రస్తుతం 'కల్కీ'తో పాటుగా..మారుతి దర్శకత్వంలో రాజాసాబ్‌ అనే మరో సినిమాలో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక ఇప్పటికే పోయిన ఏడాది 'ఆది పురుష్‌', సలార్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ప్రభాస్‌. దాంట్లో సలార్‌ భారీగా కలెక్షన్లు రాబట్టింది. సూపర్‌హిట్టుగా నిలిచింది. ఇక ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో కూడా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.