థియేటర్లలో ఒక సినిమా హిట్ అయితే మేకర్స్ ఫుల్ హ్యాపీ. ఒకవేళ అలా కాకపోయినా.. వారికి నష్టాలు కలిగించకుండా ఉండడం కోసం ఓటీటీ అనేది ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఒకవేళ థియేటర్లలో విడుదలయిన సినిమా హిట్ అయితే మేకర్స్ సూపర్ హ్యాపీ.. ఒకవేళ అవ్వకపోతే అది నెలరోజులలోపే ఓటీటీలోకి అందుబాటులోకి వస్తోంది. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ‘గాండీవధారి అర్జున’కు కూడా అదే పరిస్థితి ఏర్పడుతోంది. మెగా ప్రిన్స్‌గా పేరు తెచ్చుకున్న వరుణ్ తేజ్.. తన చివరి చిత్రం ‘గాండీవధారి అర్జున’తో ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు కాబట్టి ఈ మూవీ త్వరగానే ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది.


వరుణ్ తేజ్.. గతేడాది రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి వచ్చాడు. అందులో ‘ఎఫ్ 3’ సూపర్ హిట్ సాధించింది. కానీ ‘గని’ మాత్రం ఫ్లాప్‌గా నిలిచింది. ఇక ఈ ఏడాది అసలు వరుణ్ తేజ్ సినిమా ఉంటుందా లేదా అనుకున్న ప్రేక్షకులకు ‘గాండీవధారి అర్జున’తో వస్తున్నానంటూ ప్రకటన ఇచ్చాడు. కానీ ఈ మూవీ అసలు ఎప్పుడు మొదలయ్యిందో, ఎప్పుడు పూర్తయ్యిందో అన్న సమాచారం ఎక్కువగా సోషల్ మీడియాతో, ప్రేక్షకులతో పంచుకోవడానికి ఆసక్తి చూపించలేదు మూవీ టీమ్. దీంతో అసలు ఈ సినిమా గురించే చాలామందికి తెలియకుండా పోయింది. పైగా ప్రమోషన్స్ విషయంలో కూడా మూవీ టీమ్ అంతా యాక్టివ్‌గా పాల్గొనకపోవడం వల్ల ‘గాండీవధారి అర్జున’పై సీరియస్ ఎఫెక్టే పడింది. అందుకే థియేటర్లలో విడుదలయ్యి నెలరోజులు అవ్వకముందే ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది.


నెలరోజులు గడవకముందే..
వరుణ్ తేజ్, సాక్షి వైద్య జంటగా నటించిన ‘గాండీవధారి అర్జున’ను ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేశాడు. ‘గరుడవేగ’ లాంటి థ్రిల్లర్ చిత్రంతో సూపర్‌హిట్ సాధించిన ప్రవీణ్ సత్తారు.. ‘గాండీవధారి అర్జున’ను కూడా అదే జోనర్‌లో తెరకెక్కించాడు. అసలు సినిమా ఎలా ఉంది అనే విషయాన్ని పక్కన పెడితే.. చాలామందికి వరుణ్ తేజ్ ఇలాంటి ఒక సినిమాను తీశాడు అని తెలియలేదు. దీంతో ఆగస్ట్ 25న థియేటర్లలో విడుదలయిన ఈ సినిమా.. నెలరోజులు అవ్వకముందే ఓటీటీ రిలీజ్ డేట్‌ను లాక్ చేసింది. సెప్టెంబర్ 24న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుందని కన్ఫర్మ్ అయ్యింది. ఈ మూవీలో సాక్షి వైద్యతో పాటు విమలా రామన్‌లాగా సీనియర్ హీరోయిన్ కూడా తెలుగులో కమ్‌బ్యాక్ ఇచ్చింది.


‘ఆపరేషన్ వాలెంటైన్’కు సిద్ధం..
హిట్ వచ్చినా, ఫ్లాప్ వచ్చినా హీరోలు ముందుకు వెళ్లాల్సిందే. అందుకే ‘గాండీవధారి అర్జున’ ఫ్లాప్‌ను పట్టించుకోకుండా వరుణ్ తేజ్.. తన తరువాతి సినిమాను పూర్తి చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. అదే ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఈ మూవీ కూడా ‘గాండీవధారి అర్జున’ లాగా థ్రిల్లర్ జోనర్‌లో ఉండబోతుందని మూవీ టీమ్ ఇచ్చిన అప్డేట్స్‌తో అర్థమయ్యింది. ఇప్పటికే ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకొని డబ్బింగ్ పనులను కూడా మొదలుపెట్టుకుంది. ఈ విషయాన్ని స్వయంగా వరుణ్ తేజ్.. తన సోషల్ మీడియాలో ప్రకటించాడు. అయితే ఇది కూడా ‘గాండీవధారి అర్జున’లాగా అవ్వకుండా ఉండాలంటే కనీసం ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో అయినా వరుణ్ తేజ్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని ఫ్యాన్స్ సలహా ఇస్తున్నారు.


Also Read: అందరినీ భయపెట్టే చీకటినే భయపెడతాడు వీడు - ప్రోమోతో అదరగొట్టిన మాస్ రాజా!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial