కోలీవుడ్ అగ్ర హీరో దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం 'లియో'(Leo) తెలుగు వెర్షన్ రిలీజ్ కు ఊహించని అడ్డంకి ఎదురైంది. 'లియో' మూవీ తెలుగు వెర్షన్ రిలీజ్ పై స్టే విధిస్తూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 20 వరకు లియో చిత్రాన్ని విడుదల చేయకూడదని ఈ మేరకు సివిల్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ చిత్ర టైటిల్ విషయంలో ఉన్న చిక్కుల నేపథ్యంలోనే సివిల్ కోర్టు ఆదేశాలను జారీ చేసినట్లు సమాచారం. కోలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లియో' మూవీని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.


ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అన్నిచోట్ల రికార్డు స్థాయిలో టికెట్లు అమ్ముడవుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఈ మూవీ మొదటి రోజే వంద కోట్ల వసూళ్లు రాబట్టడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి గత కొద్ది రోజులుగా 'లియో' మూవీకి ఏదో ఒక వివాదం వెంటాడుతూనే ఉంది. మొన్నటివరకు తమిళనాడులో మార్నింగ్ షో వివాదం ఎదురవగా తాజాగా తెలుగు విడుదలపై సివిల్ కోర్టు స్టే ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.


'లియో' మూవీని అక్టోబర్ 19న విడుదల చేస్తున్నారు. అదే రోజు తెలుగు నుంచి బాలకృష్ణ నటిస్తున్న 'భగవంత్ కేసరి' రిలీజ్ అవుతుంది. దాంతో అక్టోబర్ 19న ఈ రెండు చిత్రాల మధ్య గట్టి పోటీ ఉంటుందని అనుకునే సమయంలోనే 'లియో' తెలుగు వెర్షన్ రిలీజ్ వాయిదా పడడం గమనార్హం. అక్టోబర్ 20 తర్వాతే 'లియో' మూవీ తెలుగు వెర్షన్ థియేటర్స్ లో విడుదల అయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఇదే విషయం గురించి ఈ మూవీ తెలుగు రైట్స్ కొన్న సితార నిర్మాత నాగ వంశీ క్లారిటీ ఇస్తూ కొన్ని కీలక విషయాలు పంచుకున్నారు.


"అక్టోబర్ 19 ఉదయం ఏడు గంటల షోతో 'లియో' రిలీజ్ అవుతుంది. తెలుగులో టైటిల్ విషయంలో ఓ చిన్న సమస్య వచ్చింది. లియో టైటిల్ ని తెలుగులో మరొకరు రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళు మమ్మల్ని సంప్రదించకుండా నేరుగా కోర్ట్ కి వెళ్లారు. ఆ విషయం నాకు కూడా మీడియా ద్వారానే తెలిసింది. టైటిల్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళతో మాట్లాడుతున్నాం. సమస్య పరిష్కారమవుతుంది. లియో విడుదలలో ఎటువంటి మార్పు ఉండదు. అక్టోబర్ 19నే తమిళం తో పాటు తెలుగులో లియో రిలీజ్ అవుతుంది" అని చెప్పుకొచ్చారు. 


ఇక 'లియో' సినిమా విషయానికొస్తే.. 'విక్రమ్' లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం 'మాస్టర్' తర్వాత విజయ్ లోకేష్ కాంబినేషన్లో 'లియో' వస్తుండడంతో ఈ చిత్రంపై కోలీవుడ్లో ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఓవర్సీస్ లో 'లియో' అడ్వాన్స్ బుకింగ్స్ వన్ మిలియన్ డాలర్ మార్క్ ని అందుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది  ఇందులో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటించింది. సంజయ్ దత్ యాక్షన్ కింగ్ అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియా ఆనంద్, మన్సూర్ అలీ ఖాన్, మిస్కిన్ ఇతర కీలక పాత్రలు పోషించగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు.


Also Read : 'ఇండియాస్ గాట్ టాలెంట్' షోలో మాస్ మహారాజా - అక్కడా అదే ఎనర్జీ!





Join Us on Telegram: https://t.me/abpdesamofficial