సందీప్ కిషన్ మరో పాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకు స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్స్ చేసిన ఆయన... ఫస్ట్ టైమ్ హిస్టారికల్ సినిమాకు 'ఎస్' చెప్పారు. వెండితెరపై యోధుడిగా వీరోచిత పోరాటం చేయనున్నారు. ఆ సినిమాకు 'కరికాల' టైటిల్ ఖరారు చేశారు. ఇవాళ ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ విడుదల చేశారు.
'శంబాల' దర్శకుడితో సందీప్ కిషన్...రెండు భాగాలుగా థియేటర్లలోకి 'కరికాల'!'శంబాల'తో విజయం సాధించిన యుగంధర్ ముని దర్శకత్వంలో సందీప్ కిషన్ ఓ సినిమా చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితం వెల్లడించారు. ఆ సినిమాకు 'కరికాల' టైటిల్ ఖరారు చేసినట్టు ఇవాళ తెలిపారు.
సందీప్ కిషన్, యుగంధర్ మునిల 'కరికాల' చిత్రాన్ని షైనింగ్ పిక్చర్స్ పతాకంపై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్నారు. టైటిల్ పోస్టర్ చూస్తే... గుర్రంపై కత్తి చెతపట్టిన యోధుడిగా సందీప్ కిషన్ కనిపించారు. అతని ముందు ఓ సింహం పరుగులు పెడుతోంది. రెండు భాగాలుగా 'కరికాల'ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
'కరికాల' మొదటి చాప్టర్ను వచ్చే ఏడాది జూలై 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. అది విడుదలైన మూడు నెలలకు రెండో చాప్టర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని చెప్పారు. అక్టోబర్ 28న 'కరికాల' రెండో పార్ట్ రానుంది. రెండు పార్టులు విడుదల తేదీలను ఒకేసారి విడుదల చేయడం విశేషం. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. నటీనటులు, ఇతర టెక్నీషియన్లతో పాటు మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
