అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. పచ్చళ్ల కాస్ట్ అంత ఎక్కువగా ఎందుకు పెట్టారు ? అన్న ఒకే ఒక్క ప్రశ్నకి అలేఖ్య చిట్టి పికిల్స్ కు సంబంధించిన ఓ అమ్మాయి బూతులతో కూడిన వాయిస్ మెసేజ్ పంపిన వీడియో ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది. దీంతో ఒక్కసారిగా అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదంపై ట్రోలింగ్ మొదలైంది. కాస్ట్ అడిగితే సరిగ్గా సమాధానం చెప్పకుండా ఇంత దారుణంగా తిడతారా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మరోవైపు అసలు ఆ వాయిస్ ఒరిజినలేనా? ఇదంతా నిజమేనా? అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే అలేఖ్య చిట్టికి సంబంధించిన సిస్టర్స్ లో ఒకరు యూట్యూబ్ వేదికగా స్పందిస్తూ ఏం జరిగిందో క్లారిటీ ఇచ్చారు. తనకు కూడా దీని గురించి ఏమాత్రం తెలియదని, తనను, తన ఫ్యామిలీని ఈ వివాదంలోకి లాగుతూ దారుణంగా ట్రోల్ చేస్తున్న వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. 

అసలు వివాదం ఏంటంటే? 

అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నాన్ వెజ్ పచ్చళ్లను ఇష్టపడేవారు వీళ్ళ పికిల్స్ రుచి చూడకుండా వదిలిపెట్టరు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాలకు సైతం పచ్చళ్ళు ఆర్డర్ చేసి పంపించే అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ రాజమండ్రిలో జరుగుతుంది. వాళ్ళ వాట్సాప్ నెంబర్ కి హాయ్ అని మెసేజ్ పెడితే తమ దగ్గర ఉన్న పచ్చళ్ళు, వాటి ధరలను వివరాలతో సహా పంపిస్తారు. వీళ్ళ పచ్చళ్ళు టేస్టీగా ఉన్నాయని పేరు రావడంతో డిమాండ్ పెరిగింది. ఆ డిమాండ్ తో పాటు రేటు కూడా ఓ రేంజ్ లో పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి నాన్ వెజ్ పచ్చళ్ళు అరకిలో రూ. 1200 నుంచి స్టార్ట్ కావడం గురించి ప్రశ్నించాడు. "మీ పచ్చళ్ళు ఇంత ధర ఎందుకు ఉన్నాయో నాకు అర్థం కావడం లేదు" అంటూ రెండు చేతులు జోడించిన ఎమోజిని పంపాడు. దీంతో అటువైపు నుంచి ఓ అమ్మాయి దారుణమైన బూతులను తిడుతూ రిప్లై పంపింది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయింది. ఫలితంగా నెటిజన్లు అలేఖ్య చిట్టి పికిల్స్ ను ఆటాడుకోవడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ ట్రోలింగ్ కారణంగా ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేయడంతో పాటు వాట్సాప్ అకౌంట్ ను సైతం డిలీట్ చేశారు. అలాగే ఇన్స్టాలో కొత్త రిక్వెస్ట్లను స్వీకరించట్లేదు. వీళ్ళ వెబ్సైట్ కూడా ఓపెన్ కావట్లేదు. మొత్తానికి టెంపరరీగా అలేఖ్య చిట్టి పికిల్స్ దుకాణం క్లోజ్ అయ్యింది. 

వివాదంపై సిస్టర్ రియాక్షన్ 

ఏపీలోని రాజమండ్రికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్ళు అలేఖ్య చిట్టి పేరుతో పచ్చళ్ల బిజినెస్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వీరికి మంచి ఫాలోయింగ్ ఉండడంతో బిజినెస్ బాగానే జరుగుతుంది. ఈ క్రమంలోనే వీరిలో చెల్లెలు సోషల్ మీడియా వేదికగా చేసిన అభ్యంతరకర కామెంట్స్, దానిపై వస్తున్న ట్రోలింగ్ పై అక్క స్పందించింది. సుమీ యూట్యూబ్ ను నడుపుతున్న ఆమె ఈ మేరకు స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. అందులో అసలు ఈ వివాదం గురించి తనకు తెలియదని, అసలేం జరిగిందో తెలియనప్పుడు ఎలా మాట్లాడుతానని తిరిగి ప్రశ్నించింది. తన సిస్టర్ కి ఫోన్ చేసి అడిగితే రెండు రోజుల వరకు తనతో మాట్లాడొద్దని చెప్పి బాధగా ఫోన్ పెట్టేసిందని, అయితే ఈ వివాదంతో తనకేంటి సంబంధం ? అని అడిగింది. అనవసరంగా ఈ వివాదంలోకి తనను, తన ఫ్యామిలీని లాగుతున్నారని ఆవేదనను వ్యక్తం చేసింది. తన చెల్లి చేసింది తప్పేనని ఒప్పుకున్న ఆవిడ... వీళ్లను ఎక్కడైనా కనిపిస్తే చంపేస్తాము, రేప్ చేస్తాము అని వస్తున్న బెదిరింపు కామెంట్స్ ను లైక్ చేస్తున్నవారు ఏం చెప్పాలనుకుంటున్నారని ఫైర్ అయ్యింది. తన భర్త ఫోటోలు వాడటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది.