రీసెంట్ ‘హంట్’ సినిమాతో  ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు, ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మారింది. 2018 లో వచ్చిన ‘సమ్మోహనం’ సినిమా తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాడు. ఆ మధ్యలో ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాతో కొంత మేర ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. తాజాగా ఆయన  ‘మామా మశ్చీంద్ర’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని భావిస్తున్నారు.  ఈషా రెబ్బా, మృణాళిని రవి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల అయ్యింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మూవీ టీజర్ ను లాంచ్ చేశారు.






దుమ్మురేపిన 'మామా మశ్చీంద్ర' టీజర్


టీజర్ ప్రారంభమే హైవోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో మొదలవుతుంది. “దేవుడు అడిగాడట నన్ను చేరడానికి ఏడు జన్మలు భక్తుల్లా బతుకుతారా? లేక మూడు జన్మలు రాక్షసుల్లా బతుకుతారా? అని. మీకు దూరంగా ఉండటం కన్నా మూడు జన్మలు రాక్షస జన్మే మిన్న అని దేవతలే కోరుకున్నారట” అంటూ భారీ యాక్షన్ సీన్లతో కనిపించింది. ఆ తర్వాత టీజర్ ఫన్నీ లైన్ లోకి వెళ్లింది. “వేగం ఎక్కువైతే ఆగం అవుతావు కాకా, కిక్కు కోసం వెళ్తే కక్కొస్తుంది” అంటూ సుధీర్ బాబు చెప్పే మాటలు ఆకట్టుకుంటాయి. “ఈ జెనరేషన్ గుంటలందరికీ సిక్స్ ప్యాక్ పిచ్చిపట్టింది. ఫ్యామిలీ ప్యాక్ ఉన్నోడు ఫ్యామిలీని సుబ్బరంగా చూసుకుంటాడు” అని ఊబకాయం ఉన్న దుర్గ చెప్పడం నవ్వు కలిగిస్తుంది.  



వెరైటీ స్టోరీలపై సుధీర్ ఫోకస్!


వాస్తవానికి సుధీర్ బాబు గత కొంత కాలంగా రొటీన్ కథలకు గుడ్ బై చెప్పి, వెరైటీ స్టోరీలపై దృష్టి పెట్టారు. అందులో భాగంగానే 'మామా మశ్చీంద్ర' మూవీకి ఓకే చేశారు. నటుడు- - దర్శకుడు హర్షవర్ధన్ దర్శకత్వం వహించిన 'మామా మశ్చీంద్ర'లో సుధీర్ బాబు మూడు విభిన్న లుక్స్ లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఇప్పటికే ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో సుధీర్ బాబు సిక్స్ ప్యాక్ బాడీతో కనపడగా, ఫస్ట్ లుక్ తో పూర్తి భిన్నంగా కనిపించారు.


సుధీర్ బాబు ట్రిపుల్ ధమాకా!


సుధీర్ బాబు ట్రిపుల్ రోల్ చేస్తోన్న ‘మామా మశ్చీంద్ర’లో ఊబకాయం ఉన్న దుర్గ, ఓల్డ్ డాన్ పరశురామ్, డిజె క్యారెక్టర్ పోస్టర్‌లకు అద్భుతమైన స్పందన వచ్చింది. మొదటి రెండు గెటప్‌లలో డీ-గ్లామ్ లుక్స్‌లో కనిపించిన సుధీర్, మూడో లుక్‌లో డీజేగా తన రిథమ్‌తో మనసుల్ని దోచుకునేలా కనిపించారు.   కాగా ఈ ద్విభాషా చిత్రాన్ని సృష్టి సెల్యులాయిడ్‌ సోనాలి నారంగ్, సృష్టి సమర్పిస్తుండగా.. వెరైటీ కాన్సెప్ట్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.


మారుతీ డైరెక్షన్ లో వచ్చిన 'ప్రేమ కథా చిత్రమ్' సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు హీరో నాగ సుధీర్ బాబు. ఈ మూవీ అప్పట్లో భారీ హిట్ అవ్వడమే కాకుండా బాక్సాఫీస్ వద్దా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఆ తర్వాత చాలా సినిమాలు చేసినా.. హిట్ మాత్రం కలిసి రాలేదు. 'సమ్మోహనం' మూవీతో మంచి క్రేజ్ తెచ్చుకున్నా.. దాన్ని నిలుపుకునేందుకు చాలానే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మళ్లీ చాలా రోజులకు ఇటీవల సుధీర్ బాబు హీరోగా మహేష్ సూరపనేని దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'హంట్'. ఈ సినిమా భారీ హైప్ తో, భారీ అంచనాల మధ్య రిలీజైనా.. బాక్సాఫీస్ వద్ద నిరాశే మిగిల్చింది. ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.