మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో ఉస్తాద్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'స్కంద' (Skanda Movie). మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో రామ్ జోడిగా శ్రీ లీల కథానాయికగా నటిస్తుండగా... మరో హీరోయిన్ సయీ మంజ్రేకర్ కీలక పాత్రలు పోషిస్తుంది. శ్రీకాంత్, గౌతమి, ఇంద్రజ, ప్రిన్స్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకోగా రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ ఒక్కసారిగా సినిమాపై భారీ హైప్ ని క్రియేట్ చేసింది. బోయపాటి శ్రీను ఈ సినిమాలో రామ్ ను ఊర మాస్ అవతార్ లో చూపించబోతున్నాడని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది.


దీంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'అఖండ' వంటి భారీ హిట్ తర్వాత బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే రిలీజ్ కు ముందే 'స్కంద' సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు సమాచారం వినిపిస్తోంది. లేటెస్ట్ టాక్ ప్రకారం... స్కంద ఓటీటీ రైట్స్ (Skanda OTT Platform)ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్, శాటిలైట్ రైట్స్ ను స్టార్ మా చానల్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. రామ్ కెరియర్ లోనే భారీ ధరకి ఓటీటీ, సాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయిన మూవీగా 'స్కంద' సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ మూవీ డిజిటల్, సాటిలైట్ హక్కులు ఏకంగా రూ. 45 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం.


రిలీజ్ కి ముందే 'స్కంద' మూవీ ఓటీటీ, సాటిలైట్ రైట్స్ ఇంత భారీ మొత్తంలో అమ్ముడవ్వడం విశేషం. ఇక ఈ రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్లో డిఫరెంట్ షేడ్స్ లో రామ్ కనిపించిన తీరు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇప్పటికే యూట్యూబ్లో 'స్కంద' ట్రైలర్ 25 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టింది. మాస్ యాక్షన్ అంశాలకు ఫ్యామిలీ ఎమోషన్స్ ని జోడించి దర్శకుడు బోయపాటి శ్రీను ఈ మూవీని తెరకెక్కించారు. జి స్టూడియో సంస్థ పై పవన్ కుమార్ సమర్పణలో సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాని భారీ బడ్జెట్తో నిర్మించారు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15న తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.


ఇక ఈ సినిమా తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్' చేస్తున్నాడు రామ్. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. రీసెంట్ గానే ముంబైలో ఓ షెడ్యూల్ ని కూడా పూర్తి చేశారు. పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది  మార్చ్ 8 న మహాశివరాత్రి కానుకగా ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.


Also Read : నా ట్రస్ట్‌కు డబ్బులు ఇవ్వొద్దు, బదులుగా వారికి సహాయం చేయండి: రాఘవా లారెన్స్






Join Us on Telegram: https://t.me/abpdesamofficial