Siddharth : ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్- ఇండియన్ సినిమాల్లో 'ఇండియన్ 2' ఒకటి. ఉలగనాయగన్ కమల్ హాసన్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ మూవీలో హీరో సిద్దార్థ్ కూడా నటించబోతున్నారంటూ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సిద్దార్థ్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. 


డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో వస్తోన్న భారీ బడ్జెట్ ఫిల్మ్ 'ఇండియన్‌ 2'.  లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో విశ్వ నటుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీ 1996లో రిలీజైన 'ఇండియన్' సినిమాకు సీక్వెల్ గా వస్తోంది. అప్పట్లో ఈ చిత్రానికి విపరీతమైన రెస్పాన్స్ రావడంతో.. 'ఇండియన్ 2'పై అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.


తాజాగా ‘ఇండియన్ 2’ సినిమాకు సంబంధించి మేకర్స్ ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ ను షేర్ చేశారు. ఏప్రిల్ 17న హీరో సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా ఓ అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు. సిద్ధార్థ్ కూడా ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో నటించనున్నాడని మూవీ మేకర్స్ ప్రకటించారు.


ఇదిలా ఉండగా భాస్కర్ దర్శకత్వంలో 2006లో రిలీజైన ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీ బేస్డ్ మూవీ 'బొమ్మరిల్లు' తర్వాత హీరో సిద్దార్థ్ కు.. మళ్లీ అంత పెద్ద హిట్ ఇప్పటివరకూ రాలేదు. ఆ తర్వాత కూడా అనేక తెలుగు సినిమాల్లో నటించినా.. అవీ బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగిల్చాయి. ఈ మధ్య కాలంలో తెలుగులో ఆశించిన స్థాయిలో సక్సెస్ లు దక్కకపోవడంతో.. సిద్దార్థ్ పూర్తిగా తమిళ సినిమా ఇండస్ట్రీకే పరిమితం అయ్యారు. ఇక 'ఇండియన్ 2' టీం రిలీజ్ చేసిన తాజా ప్రకటనతో హీరో సిద్ధార్ధ్ మళ్లీ ఫామ్ లోకి వస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. సిద్ధార్థ్ ఖాతాలో ఈ సారి మాత్రం హిట్ ఖాయం అంటూ ఆయన ఫ్యాన్స్ ఇప్పట్నుంచే ఎన్నో కలలు కంటున్నారు. అది ఎంత వరకు చూడాలి మరి.


కొన్ని రోజుల క్రితమే హాలీవుడ్ యాక్షన్‌ అండ్‌ స్టంట్‌ డిజైనింగ్‌ టీంతో కమల్ హాసన్‌ జాయిన్ అయిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  తైవాన్‌లోని లొకేషన్‌లో 'ఇండియన్‌ 2' షూటింగ్ స్టిల్స్‌, వీడియోలతోపాటు సౌతాఫ్రికా షెడ్యూల్‌కు సంబంధించిన అప్‌డేట్ కూడా ఇటీవలే బయటకు వచ్చింది. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్‌తో మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు శంకర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.


'ఇండియన్ 2' మూవీలో హీరో కమల్ హాసన్ తో పాటు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ కూడా నటిస్చున్నారు. వీరితో పాటు ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, బాబీ సింహా తదితరులు కీలక పాత్రలు పోషించనున్నట్టు సమాచారం. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ కలిసి ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.


Read Also: ఓటీటీలోకి రవితేజ ‘రావణాసుర’, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?